ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా?

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండు క్లెయిం చేశారా? ఇంకా ఆ మొత్తం మీ ఖాతాలో జమ కాలేదా? మరి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా?

Updated : 19 Aug 2022 11:09 IST

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండు క్లెయిం చేశారా? ఇంకా ఆ మొత్తం మీ ఖాతాలో జమ కాలేదా? మరి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా?

సాధారణంగా ఉద్యోగులు ఫారం-16లో పేర్కొన్న వివరాల ఆధారంగానే రిటర్నులు దాఖలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఫారం-16లో పేర్కొన్న మినహాయింపులను మించి, క్లెయిం చేసుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఆయా రిటర్నులను ‘స్క్రూటినీ’ కోసం ఎంపిక చేసే ఆస్కారం ఉంది. ఇలా ఎంపిక చేసిన అసెసీలకు దానికి సంబంధించిన సమాచారాన్ని ఇ-మెయిల్‌ పంపించడం, మెబైల్‌కు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తుంది. ఫారం-16లో పేర్కొన వివరాలకు, రిటర్నులలో నమోదు చేసిన వివరాల మధ్య తేడా ఉన్నప్పుడు ఈ హెచ్చరిక సమాచారం అందుతుంది. ఇది ఆదాయపు పన్ను విభాగం నుంచి ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే ఈ నోటీసులు వచ్చేలా ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఏర్పాటు ఉంది. ఈ ఆటోమేటెడ్‌ సమాచారం వచ్చిన తర్వాత 15 రోజుల్లోగా అసెసీ దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇ-మెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్‌ రాకున్నా సరే.. ఒకసారి ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి వెళ్లి ‘పెండింగ్‌ యాక్షన్‌/వర్క్‌లిస్ట్‌’లో తనిఖీ చేసుకోండి. మీరు క్లెయిం చేసిన రిఫండు సరైనదే అయితే.. ఆ వివరాలను పేర్కొనండి. లేదా రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుంది. తప్పు సమాచారంతో రిఫండును క్లెయిం చేసుకున్నప్పుడు అపరాధ రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇది దాదాపు రిఫండుపై 200 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది.

* ఫారం-16లో పేర్కొనని మినహాయింపులను క్లెయిం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు ఆటోమేటెడ్‌ నోటీసులకు బదులు ఆదాయపు పన్ను అధికారుల నుంచే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అరుదుగానే జరుగుతుంది. కానీ, దీని తీవ్రత అధికంగా ఉంటుంది. మీరు క్లెయిం చేసుకున్న మినహాయింపుల ఆధారాలన్నీ ఆదాయపు పన్ను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా 80జీ మినహాయింపుల విషయంలో ఇలాంటిది ఎదురవుతుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త అవసరం. రిఫండు రాని వారు ఒకసారి ఆదాయపు పన్ను పోర్టల్‌లో నోటీసు వచ్చిందా అనేది చూసుకోవడం వల్ల భవిష్యత్తులో చిక్కులు రాకుండా చూసుకోవచ్చు. 

ఇ-వెరిఫై చేశారా?

కొన్నిసార్లు రిటర్నులు దాఖలు చేసినప్పటికీ.. వాటిని ఇ-వెరిఫై చేయడం మర్చిపోవడం లేదా వాయిదా వేసి ఉంటారు. రిటర్నులను ప్రాసెస్‌ చేయాలంటే ముందుగా వాటిని ఇ-వెరిఫై చేయాలి. ఆ తర్వాతే అవి ప్రాసెసింగ్‌ అవుతాయి. రిఫండుకు అర్హత ఉంటే.. ఆ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. గతంలో ఇ-వెరిఫై చేసేందుకు రిటర్నులు దాఖలు చేసిన నాటి నుంచి 120 రోజుల వ్యవధి ఉండేది. ఇప్పుడు దీనిని 30 రోజులకు తగ్గించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని