ప్రభుత్వ సెక్యూరిటీల్లో...

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ప్రధానంగా ‘నిఫ్టీ జీ-సెక్‌ సెప్టెంబరు 2032 ఇండెక్స్‌’లోని పత్రాల్లో పెట్టుబడి పెడుతుంది.

Published : 10 Mar 2023 00:03 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫండ్‌ ప్రధానంగా ‘నిఫ్టీ జీ-సెక్‌ సెప్టెంబరు 2032 ఇండెక్స్‌’లోని పత్రాల్లో పెట్టుబడి పెడుతుంది. ట్రెజరీ బిల్లులు, ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు, జీరో కూపన్‌ బాండ్లు, క్యాపిటల్‌ ఇండెక్స్‌డ్‌ బాండ్లు తదితర పత్రాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ దేశీయంగా సెకండరీ రుణ మార్కెట్లో ట్రేడ్‌ అవుతుంటాయి. కాబట్టి, నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య ఉండదు.

యాక్సిస్‌ నిఫ్టీ జీ-సెక్‌ సెప్టెంబరు 2032 ఇండెక్స్‌ ఫండ్‌ వడ్డీ రేటు రిస్కు (ఐఆర్‌ఆర్‌) అధికంగా, క్రెడిట్‌ రిస్కు తక్కువగా ఉంటుంది. పేరులోనే ఉన్నట్లుగా ఈ పథకం గడువు సెప్టెంబరు 30, 2032 నాడు తీరిపోతుంది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 13. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఆదిత్య పగారియా, హార్దిక్‌ షా దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన జీ- సెక్‌లను ఆయా పత్రాల కాలపరిమితి తీరిపోయే వరకూ విక్రయించటం ఉండదు. కేవలం చెల్లింపుల ఒత్తిడి (రిడంప్షన్‌ ప్రెషర్‌) మేరకు కొన్ని పెట్టుబడులను విక్రయిస్తారు. అందువల్ల ఇది టార్గెట్‌ మెచ్యూరిటీ పథకంగా ఉంది. ఫలితంగా ‘డ్యూరేషన్‌ రిస్క్‌’ ఉండదు.దీర్ఘకాలం పాటు వడ్డీ ప్రతిఫలం మదుపరులకు లభిస్తుంది.


రుణ పత్రాల్లో దీర్ఘకాలం..

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ‘యూటీఐ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌’ అనే ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 15. ఇందులో ప్రవేశ, అమ్మకపు రుసుములు లేవు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ‘క్రిసిల్‌ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ ఏ 3 ఇండెక్స్‌’ ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. యూటీఐ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌కు ఇంట్రస్ట్‌ రేట్‌ రిస్క్‌ అధికంగా, క్రెడిట్‌ రిస్క్‌ తక్కువగా ఉంటాయి. పెట్టుబడులపై నష్టభయాన్ని తగ్గించుకోవటానికి, ముఖ్యంగా తమ పెట్టుబడుల్లో దీర్ఘకాలిక రుణ పత్రాలపై కొంత మేరకు పెట్టుబడులు ఉండాలని ఆశించే మదుపరులకు ఈ పథకం అనువుగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించిన వారికి మాత్రమే ఆశించిన మేరకు ప్రతిఫలం లభిస్తుంది.


అధిక వడ్డీ కోసం...

జేఎం మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ‘జేఎం కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 20న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌, డెట్‌ తరగతికి చెందిన పథకం. దీనికి గుర్విందర్‌ సింగ్‌ వాసన్‌, షాలినీ టిబ్రేవాలా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. క్రిసిల్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.

కార్పొరేట్‌ బాండ్‌ పథకాల్లో, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ప్రధానంగా వివిధ కంపెనీలు జారీ చేసే ఏఏ ప్లస్‌ రేటింగ్‌ కల రుణ పత్రాల్లో (బాండ్లు) పెట్టుబడి పెడుతుంది. కార్పొరేట్‌ బాండ్‌ పథకాలు అయిదేళ్ల కాలంలో 8 శాతం వరకూ ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి. అంతేగాక జీ-సెక్‌ పథకాలతో పోలిస్తే కార్పొరేట్‌ బాండ్‌ పథకాల్లో ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. రుణ పథకాల్లో మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే దీర్ఘకాలిక లాభాలపై పన్ను విషయంలో ద్రవ్యోల్బణ సూచీతో సర్దుబాటు (ఇండెక్సేషన్‌) సదుపాయం లభిస్తుంది. కార్పొరేట్‌ బాండ్‌ పథకాల్లో కొన్ని నష్టభయాలూ ఉంటాయి. రీట్స్‌, ఇన్విట్‌లలోనూ ఈ పథకాలు 10 శాతం వరకూ పెట్టుబడి పెడతాయి. ఈ పత్రాల్లో నష్టభయం ఎక్కువ. ఏఏ ప్లస్‌ రేటింగ్‌ కల పత్రాలను పెట్టుబడి కోసం ఎంచుకున్నప్పటికీ కంపెనీ పనితీరును బట్టి రేటింగ్‌ ఒక్కసారిగా దిగజారిపోతుంది. అప్పుడు నష్టభయం అధికం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని