ఫండ్లలో మదుపు... క్రమం తప్పని ఆదాయం కోసం...

భవిష్యత్‌ అవసరాల కోసం క్రమం తప్పని ఆదాయం వచ్చేలా మదుపరులు తమ పెట్టుబడి పథకాలు ఉండాలని కోరుకుంటారు.

Updated : 12 May 2023 00:17 IST

భవిష్యత్‌ అవసరాల కోసం క్రమం తప్పని ఆదాయం వచ్చేలా మదుపరులు తమ పెట్టుబడి పథకాలు ఉండాలని కోరుకుంటారు. షేర్ల నుంచి డివిడెండ్లు, బాండ్ల నుంచి వడ్డీ చెల్లింపులు, స్థిరాస్తుల నుంచి అద్దె ఆదాయం, వ్యాపారాల నుంచి లాభాలు ఇలా ఎన్నో రూపాల్లో ఇది ఉండొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడూ ఈ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. డివిడెండ్‌ ఆప్షన్‌ (ఐడీసీడబ్ల్యూ) ద్వారా ఆదాయం వచ్చేలా చూసుకోవచ్చు. మరోవైపు క్రమానుగతంగా కొంత పెట్టుబడిని ఉపసంహరించుకునే (ఎస్‌డబ్యూపీ) పద్ధతినీ పరిశీలించవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది మేలు.. చూద్దాం.

దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం తోడ్పడుతుంది. ఇలా ఏర్పాటైన నిధిని ఒకేసారి వెనక్కి తీసుకోకుండా క్రమం తప్పని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. దీనికోసం అందుబాటులో ఉన్న మార్గాలే సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ), ఇన్‌కం డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ విత్‌డ్రాయల్‌ (ఐడీసీడబ్ల్యూ). ఈ రెండు విధానాలూ మదుపరులకు తన పెట్టుబడి నుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే మార్గాలు.

సమకూరిన పెట్టుబడి నుంచి నిర్ణీత మొత్తాన్ని నెలనెలా వెనక్కి తీసుకునేలా ఎస్‌డబ్ల్యూపీ తోడ్పడుతుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్న వారికి ఇది అనుకూలమని చెప్పొచ్చు. కావాల్సిన మొత్తాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అప్పటి మార్కెట్‌ ప్రకారం యూనిట్లను విక్రయించి, మదుపరుల ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకొని, ఈ పద్ధతిలో డబ్బును వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది.

డివిడెండ్‌ ఆప్షన్‌ (ఐడీసీడబ్ల్యూ) ఎంచుకున్నప్పుడు పెట్టుబడి వృద్ధితో పాటు, డివిడెండ్‌ను అందిస్తాయి. ఫండ్‌ సంస్థలు నిర్ణీత కాలానికి ఒకసారి డివిండెండ్‌ను ప్రకటిస్తుంటాయి. దీన్ని చెల్లించిన తర్వాత ఆ మేరకు ఫండ్‌ ఎన్‌ఏవీ తగ్గుతుంది. ఇందులో యూనిట్లను విక్రయించకుండానే డబ్బు అందుతుంది.
* ఎస్‌డబ్ల్యూపీ ఎంచుకున్నప్పుడు ఎంత మొత్తం కావాలి? వ్యవధి ఏమిటి? అనేది నిర్ణయించుకునే వెసులుబాటు మదుపరులకు ఉంటుంది. దాన్ని బట్టి, అవసరమైన మేరకు యూనిట్లను విక్రయించి, ఫండ్‌ సంస్థ డబ్బును సర్దుబాటు చేస్తుంది. కాబట్టి, క్రమం తప్పని ఆదాయం సాధ్యం అవుతుంది.
డివిడెండ్‌ను ఎంచుకున్నప్పుడు ఫండ్‌ సంస్థ వ్యవధిని నిర్ణయిస్తుంది. పోర్ట్‌ఫోలియోపై వచ్చే లాభాల ఆధారంగా డివిడెండ్‌లను చెల్లించేందుకు ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు డివిడెండ్‌ను ప్రకటించకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆదాయం అందదు.
*పెట్టుబడిదారుడి అవసరం మేరకు ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకునే వెసులుబాటు ఎస్‌డబ్యూపీలో ఉంటుంది. వ్యవధితోపాటు, కావాల్సిన మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. పెంచుకోవచ్చు. ఈ మార్పులన్నీ పెట్టుబడిదారుడి నియంత్రణలోనే ఉంటాయి.
డివిడెండ్‌ ప్లాన్‌ ఎంచుకున్నప్పుడు పై అంశాలేవీ పెట్టుబడిదారుడికి సంబంధం ఉండవు.
* పనితీరుతో అవసరం లేకుండా పెట్టుబడి నుంచి కాలానుగుణంగా నిర్ణీత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు
ఎస్‌డబ్ల్యూపీ తోడ్పడుతుంది.
ఫండ్‌ సంస్థలు లాభాలను పంచే అంచనా ఆధారంగా డివిడెండ్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది.  
* మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగత పెట్టుబడి విత్‌డ్రాయల్‌ ద్వారా డబ్బు చేతికి అందుతుంది. ఫండ్‌ పనితీరు సరిగా లేనప్పుడు డివిడెండ్‌ లభించడం కష్టం కావచ్చు.
* డివిడెండ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. అప్పుడు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎస్‌డబ్ల్యూపీలో గ్రోత్‌ ఆప్షన్‌ ఎంచుకుంటారు. కాబట్టి, మూలధన రాబడిపై పన్ను లెక్కిస్తారు. విక్రయించిన యూనిట్లు, కొనసాగిన కాలాన్ని బట్టి పన్నును గణిస్తారు. అధిక పన్ను శ్లాబు రేటులో ఉన్నప్పుడు డివిడెండ్‌ ఆదాయం వల్ల పన్ను భారం ఎక్కువగా ఉంటుంది.
రోజువారీ ఆదాయ అవసరాలు, జీవన శైలి ఖర్చులు తదితరాలను లెక్కించుకొని ఏ విధానంలో పెట్టుబడిని ఉపసంహరించుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. కచ్చితంగా డబ్బు కావాలనుకుంటేనే ఎస్‌డబ్ల్యూపీ విధానాన్ని ఎంచుకోవాలి. పెట్టుబడి ద్వారా వచ్చే మొత్తంతో అవసరాలు పరిమితంగానే ఉంటే డివిడెండ్‌ ఆప్షన్‌ను పరిశీలించవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని