సూచీ పథకాల్లో మదుపు

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు పథకాలను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి ‘యూటీఐ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ కాగా, మరోటి ‘యూటీఐ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హౌసింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’.

Updated : 26 May 2023 00:39 IST

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు పథకాలను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి ‘యూటీఐ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ కాగా, మరోటి ‘యూటీఐ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హౌసింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’. ఈ రెండూ ఇండెక్స్‌ పథకాలే. రెండింటి ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 5. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000.

* యూటీఐ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌కు షర్వాన్‌ కుమార్‌ గోయల్‌, ఆయుష్‌ జైన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈ పథకం కింద సమీకరించిన నిధులను నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌లో భాగంగా ఉన్న కంపెనీల షేర్లపై పెట్టుబడి పెడతారు. ఈ సూచీలో బ్యాంకులు, ఐటీ, పెట్రోలియం ఉత్పత్తుల రంగాలకు చెందిన కంపెనీలకు అధిక వెయిటేజీ ఉంది. దాదాపు 50 శాతం వెయిటేజీ ఈ మూడు రంగాలకు ఉంది.

* యూటీఐ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హౌసింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ పూర్తిగా కొత్త తరహా పథకం. ఇలాంటి పథకాన్ని ఇంతకు ముందు ఏ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థా ఆవిష్కరించలేదు. తొలిసారిగా దీన్ని తీసుకొచ్చిన ఘనత యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు దక్కుతుంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హౌసింగ్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. అంటే ఈ సూచీలో ఉన్న కంపెనీల షేర్లతో ఈ పథకం పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. గత ఏడాది కాలంలో ఈ సూచీ 13 శాతం ప్రతిఫలాన్ని అందించింది. గత మూడేళ్ల కాలానికి చూస్తే, ఇంకా ఎక్కువ ప్రతిఫలం ఉంది. ప్రధానంగా నిర్మాణ రంగానికి చెందిన కంపెనీలు ఈ సూచీలో ఉన్నాయి. ఈ పథకానికీ షర్వాన్‌ కుమార్‌ గోయల్‌, ఆయుష్‌ జైన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

ఇండెక్స్‌ పథకాల్లో నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం ఒక సానుకూలత. దీనికి తోడు సూచీల్లో కనిపించే వృద్ధి కాస్త అటూఇటూగా ఈ పథకాల్లో కనిపిస్తుంది. రిస్కు, ప్రతిఫలం పరిమితంగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించే మదుపరులకు ఇలాంటి పథకాలు అనుకూలంగా ఉంటాయి.


బలమైన కంపెనీల్లో

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘కోటక్‌ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌. నిఫ్టీ 200 మొమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ప్రధానంగా ఈ సూచీలో ఉన్న కంపెనీలతో ‘నార్మలైజ్డ్‌ మొమెంటమ్‌ స్కోర్‌’ ఆధారంగా కోటక్‌ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ ‘పోర్ట్‌ఫోలియో’ ను రూపొందిస్తారు. గత దశాబ్దకాలంలో నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 టీఆర్‌ఐ సూచీ 20 శాతం సగటు వార్షిక ప్రతిఫలాన్ని ఆర్జించింది. ఇది నిఫ్టీ 200 టీఆర్‌ఐ సాధించిన 14 శాతం ప్రతిఫలం కంటే ఎంతో అధికం.

‘మొమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌’ అనేది ఒక ఆసక్తికరమైన పెట్టుబడి విధానం. స్టాక్‌మార్కెట్‌ తీరుతెన్నులతో సంబంధం లేకుండా కొన్ని షేర్లు బలమైన ‘అప్‌ట్రెండ్‌’ను ప్రదర్శిస్తుంటాయి. వేగంగా షేర్‌ ధర పెరుగుతుంది. అటువంటి ట్రెండ్‌ను గుర్తించి పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలను ఆర్జించటం ఈ విధానంలోని ప్రధాన సూత్రం. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి నమోదవుతున్న దేశంలో ఇటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. ఈ తరహా పెట్టుబడి విధానంలో రిస్కూ ఎంతో అధికం. ఫండ్‌ మేనేజర్‌కు నైపుణ్యం ఉండాలి. మొమెంటమ్‌ను గుర్తించి సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం, పెట్టుబడిని ఉపసంహరించటం చేయగలగాలి. ‘కోటక్‌ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌’ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) వచ్చే నెల 8న ముగుస్తుంది. ఈ పథకం దీర్ఘకాలిక మదుపరులకు అనువుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని