IPO: 28 ఐపీఓలు.. రూ.45,000 కోట్లు

తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓ) ద్వారా రూ.45,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులై మధ్య 28 కంపెనీలకు అనుమతి ఇచ్చింది.

Updated : 08 Aug 2022 14:35 IST

ఏప్రిల్‌-జులైలో సెబీ అనుమతి
ఇప్పటికే 11 కంపెనీలు రూ.33,000 కోట్లు సమీకరించాయ్‌

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓ) ద్వారా రూ.45,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులై మధ్య 28 కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 11 సంస్థలు ఐపీఓలకు రావడం ద్వారా రూ.33,000 కోట్ల సమీకరించాయి.
* ఫ్యాబ్‌ ఇండియా, భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌, టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మాక్లియోడ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌, కిడ్స్‌ క్లినిక్‌ ఇండియాలు సెబీ నుంచి అనుమతులు పొందిన కంపెనీల్లో ఉన్నాయి. ఇవన్నీ తమ ఐపీఓల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సవాళ్లతో కూడుకుని ఉండటంతో, ఆయా సంస్థలు ఐపీఓ తేదీల ప్రకటనకు సరైన సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.
* ఏప్రిల్‌-జులై మధ్యలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.33,254 కోట్లు సమీకరించాయి. ఇందులో సింహభాగం (రూ.20,557 కోట్లు) లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సమీకరించింది. ఈ ఐపీఓలు ఏప్రిల్‌-మే మధ్యలోనే వచ్చాయి. మే తర్వాత ఒక్క ఐపీఓ కూడా రాలేదు.
* 2021-22లో 52 కంపెనీలు ప్రాథమిక మార్కెట్‌ నుంచి రూ.1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం సాంకేతిక అంకురాలు ఐపీఓలకు రావడం, వీటికి రిటైల్‌ మదుపర్ల నుంచి విశేష ఆదరణ లభించడం చూశాం. కొన్ని కంపెనీలు భారీ లిస్టింగ్‌ లాభాల్ని కూడా అందించాయి.
* స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన కొన్ని కంపెనీలు షేర్ల విలువలు తదుపరి దశలో బాగా తగ్గాయి. జొమాటో తొలుత లాభపడినా తరవాత నిరుత్సాహపరచింది. పేటీఎంతో పాటు అతి పెద్ద ఎల్‌ఐసీ ఐపీఓ కూడా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు నుంచే నిరుత్సాహపర్చడంతో ఐపీఓ మార్కెట్‌ డీలా పడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముఖ్య పెట్టుబడులు వ్యూహకర్త విజయ్‌కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2-3 నెలల్లో కొన్ని కంపెనీలు ఐపీఓకు రావచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సీఈఓ అభిజిత్‌ అంచనా వేశారు. షేరు ధర కూడా సహేతుకంగా నిర్ణయించవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు