Consumer Rights: సేవల్లో లోపం.. అమెజాన్‌కు జరిమానా!

కొనుగోలు చేసిన వస్తువును డెలివరీ చేయకపోగా.. వసూలు చేసినదాని కన్నా తక్కువ డబ్బు వాపసు చేసి ఇబ్బంది పెట్టినందుకు రూ.10వేలు చెల్లించాలని అమెజాన్‌ సంస్థను హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 ఆదేశించింది. గాంధీనగర్‌

Published : 11 Jul 2022 14:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొనుగోలు చేసిన వస్తువును డెలివరీ చేయకపోగా.. వసూలు చేసినదాని కన్నా తక్కువ డబ్బు వాపసు చేసి ఇబ్బంది పెట్టినందుకు రూ.10వేలు చెల్లించాలని అమెజాన్‌ సంస్థను హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 ఆదేశించింది. గాంధీనగర్‌ బ్యాంక్‌ బరోడా కాలనీకి చెందిన ఎం.శ్రీకాంత్‌.. అమెజాన్‌ నుంచి ఓ చరవాణిని రూ.43,852 వెచ్చించి 2020 జనవరిలో కొనుగోలు చేశారు. చరవాణిని కొనుగోలుదారుడికి చేరవేయలేదు. దీంతో అతనికి కేవలం రూ.41,742 మాత్రమే సంస్థ వాపసు చేసింది. డబ్బులు తగ్గించడంపై సంస్థ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను శ్రీకాంత్‌ ఆశ్రయించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్‌-2 బెంచ్‌.. సేవల్లో లోపంగా పరిగణిస్తూ పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు, 45 రోజుల్లో చెల్లించాలని అమెజాన్‌ సంస్థను ఆదేశించింది.

కొత్త బైక్‌ ఇవ్వాలని ఆది మోటార్స్‌కు ఆదేశం

ఉత్పత్తి లోపం ఉన్న ద్విచక్రవాహనం అందించి సేవల్లో లోపం కలిగించినందుకు కొత్త బైక్‌ ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 ప్రతివాద సంస్థలను ఆదేశించింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీహెచ్‌.రవింద్రబాబు అనే న్యాయవాది కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారించిన బెంచ్‌ 45 రోజుల్లో తీర్పు అమలు చేయాలని తీర్పు వెలువరించింది. 2017లో కొనుగోలు చేసిన హోండా సీబీ షైన్‌ వాహనం తరచూ మరమ్మతులకు గురవ్వడం, సమస్యను గుర్తించడంలో ప్రతివాద సంస్థలు హోం మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌, మలక్‌పేట్‌లోని ఆది మోటార్స్‌ విఫలమయ్యాయంటూ ఫిర్యాదీ.. కమిషన్‌కు తెలిపారు. సాక్ష్యాధారాలు పరిశీలించి బెంచ్‌ తీర్పు వెలువరించింది.

వాహన బీమా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ముషీరాబాద్‌కు చెందిన సీహెచ్‌.గోపీనాథ్‌ అనే వ్యక్తి వాహన బీమా సంస్థ (భారతీ అడా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌)పై ఫిర్యాదు చేయగా.. విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3, వాహన బీమా పరిహారం రూ.5,34,370లో 75శాతం చెల్లించాలని, పరిహారం రూ.20వేలు, కేసు ఖర్చులు రూ.10వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

సికింద్రాబాద్‌లోని లా బెల్లె బాడీ కేర్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ ప్రకటనలకు ఆకర్షితురాలైన అమీర్‌పేట్‌కు చెందిన ఎం.శారద తనతో పాటు తన కూతుళ్ల కోసం ‘ఫుల్‌ బాడీ హెయిర్‌ రిమూవల్‌ ట్రీట్‌మెంట్‌’ కావాలంటూ ఆశ్రయించారు. ఈ మేరకు రూ.1,18,000 ప్యాకేజీతో చికిత్స అందించేందుకు ప్రతివాద సంస్థ అంగీకరించింది. చికిత్స ప్రారంభించిన కొంతకాలం తర్వాత దఫదఫాలుగా మరో రూ.20వేలు వసూలు చేశారు. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. ఏ మాత్రం ఫలితం కనిపించకపోవడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 బాధితురాలికి రూ.1,15,500 (9శాతం వడ్డీతో), పరిహారం రూ.25వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని