Aadhaar: ఆధార్‌ సవరణకు కొత్త నిబంధనలు

ప్రజల నిత్య జీవితంలో ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు విధిస్తోంది.

Updated : 03 Apr 2023 15:12 IST

ములుగు, న్యూస్‌టుడే: ప్రజల నిత్య జీవితంలో ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు విధిస్తోంది. నూతనంగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా  ఆధారాలు సమర్పించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మనిషికి ఆధార్‌ కార్డు ఉండాలని నిబంధన విధించాయి. సంక్షేమ పథకాల మంజూరు, భూముల రిజిస్ట్రేషన్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఉపాధి హామీ పనుల కల్పన, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల చదువులు, స్కాలర్‌షిప్‌, పంటల విక్రయాలకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది.

* గతంలో సవరణలు సులభంగా చేసుకునే వీలుండేది. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధ్రువపత్రాలు, వయసును బట్టీ కేటగిరీల వారీగా సమర్పించే పత్రాల్లో మార్పులు చేస్తూ ఇటీవల యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. సవరణలో సరికొత్త మార్పులు చేస్తూ దరఖాస్తు విధానాన్ని మార్చింది.

మూడు కేటగిరీలుగా విభజన

ఆధార్‌ కార్డును సవరణ చేసుకునే వారిని వయసుల ప్రకారం మూడు కేటగిరీలుగా విభజించారు. గతంలో ఈ విభజన ఉండేది కాదు. రెండు రకాల దరఖాస్తు పత్రాలు ఉండేవి. తాజాగా ఐదేళ్లలోపు పిల్లలను మొదటి, ఐదు నుంచి 18 ఏళ్లు లోపు వారిని రెండు, 18 ఏళ్లు పైబడిన వారిని మూడో కేటగిరీగా విభజించారు. వీరికి వేర్వేరుగా దరఖాస్తులను రూపొందించారు.

పదేళ్లకోసారి పునరుద్ధరణ

ఆధార్‌ కార్డును పదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాలి. చిరునామా స్థానికతను నిర్ధారించుకుంటూ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన చిరునామా ధ్రువపత్రాలను జత చేయాలి. ఇంతకు ముందు గెజిటెడ్‌ అధికారి సంతకంతో వ్యక్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దారు జారీ చేసే గుర్తింపు పత్రాన్ని చూపాలి. ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, రేషన్‌కార్డులో సరైన చిరునామా ఉంటే వాటితో సరి చేసుకోవచ్చు. నీటి పన్ను, విద్యుత్తు, టెలిఫోన్‌ బిల్లు, గ్యాస్‌ కనెక్షన్‌ ధ్రువపత్రాలు వినియోగించుకోవచ్చు.

పేరులో మార్పు చేయాలంటే..

* తప్పరిసరిగా ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, సదరం ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే వివాహ ధ్రువపత్రం, తహసీల్దారుచే జారీ చేసే కుల ధ్రువపత్రం సమర్పించవచ్చు.
* పుట్టిన తేదీ..: గతంలో పుట్టిన తేదీని మార్చుకునేందుకు నమూనా పత్రాన్ని భర్తీ చేసి గెజిటెడ్‌ అధికారులతో సంతకం చేస్తే సరిపోయేది. పాన్‌ కార్డులో ఉన్న పుట్టిన తేదీని అధికారికంగా ధ్రువీకరించుకునే వీలు ఉండేది. చిన్నారులకైతే తప్పనిసరిగా మున్సిపల్‌ లేదా పంచాయతీ నుంచి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకునే వీలు కల్పించారు. రెండోసారి మార్పు చేసుకోవాలనుకుంటే దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
* జెండర్‌(లింగం) తప్పుగా నమోదైతే ఒక సారి మాత్రమే మార్చుకునే వీలుంది. ఇందుకు తప్పనిసరిగా అర్హత గల గుర్తింపు పత్రాన్ని జత చేయాలి. మరోసారి తప్పును సవరించాలంటే ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిందే.


నిబంధనలు పాటించాలి

దేవేందర్‌, ఈడీఎం, ములుగు జిల్లా

ఆధార్‌కార్డు పునరుద్ధరణలో పేరుతో చేసే మార్పుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు తాజాగా యూఐడీఏఐ జారీ చేసిన ఆదేశాలను ఆధార్‌ కేంద్రాల వారు తప్పనిసరిగా పాటించాలి. నిబంధనల ప్రకారం ప్రజలు సరైన ధ్రువపత్రాలతో సవరణ చేసుకోవాలి. ఇది ఒక సారి మాత్రమే చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా మళ్లీ మళ్లీ మార్చుకునే వీలు లేదన్న విషయాన్ని గ్రహించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు