మేలో రికార్డు అమ్మకాలు

దేశీయంగా మే నెలలోనూ వాహన టోకు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ వినియోగ వాహనా (ఎస్‌యూవీ)లకు అధిక గిరాకీ లభించింది. మొత్తం ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) సరఫరాల్లో ఎస్‌యూవీల వాటాయే 47 శాతం అంటే, వీటికి ఎంతగా ఆదరణ పెరిగిందో అర్థమవుతుంది.

Updated : 02 Jun 2023 11:51 IST

ప్రయాణికుల వాహనాల్లో 47% వాటా ఎస్‌యూవీలదే
చిన్నకార్ల అమ్మకాల్లో భారీ కోత

దిల్లీ: దేశీయంగా మే నెలలోనూ వాహన టోకు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ వినియోగ వాహనా (ఎస్‌యూవీ)లకు అధిక గిరాకీ లభించింది. మొత్తం ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) సరఫరాల్లో ఎస్‌యూవీల వాటాయే 47 శాతం అంటే, వీటికి ఎంతగా ఆదరణ పెరిగిందో అర్థమవుతుంది. వాహన టోకు విక్రయాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ), హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఖీఎం), టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సంస్థలు ఘనంగా రాణించాయి. టాటా మోటార్స్‌, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ ఇండియా అమ్మకాలూ పెరిగాయి. ద్విచక్ర వాహన విక్రయాలూ మెరుగ్గా ఉన్నాయి.

మారుతీ సుజుకీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) విక్రయాలు 15% పెరిగాయి. 2022 మేలో 1,24,474 వాహనాలను డీలర్లకు అందించగా, గత నెలలో ఈ సంఖ్య 1,43,708కి పెరిగింది.  ఆల్టో, ఎస్‌ ప్రెసో వంటి మోడళ్లతో కూడిన చిన్నకార్ల అమ్మకాలు మాత్రం 17,408 నుంచి 30% తగ్గి 12,236కు పరిమితం అయ్యాయి.

హ్యుందాయ్‌ మోటార్‌: క్రెటా, వెన్యూ వంటి ఎస్‌యూవీల సాయంతో విక్రయాలు 42,293 నుంచి 14.91% పెరిగి 48,601కి చేరాయి.

టాటా మోటార్స్‌: దేశీయ విక్రయాలు 6%పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో కలిపి విద్యుత్తు వాహనాల సరఫరాలు 3505 నుంచి 66% అధికమై 5805కు చేరాయి.

* ప్లాంటు నిర్వహణ పనులు చేపట్టిన కియా ఇండియా సరఫరాల్లోనూ 3% వృద్ధి లభించింది. మహీంద్రా వినియోగ వాహనాల సరఫరాలు 23% అధికమయ్యాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సరఫరాలు రెట్టింపయ్యాయి. అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌, ఇన్నోవా హైక్రాస్‌, హైలక్స్‌ మోడళ్లకు ఖాతాదార్ల నుంచి గిరాకీ బాగుందని సంస్థ పేర్కొంది.

మే నెలలో ఇన్ని కార్లు ఇప్పుడే: మే నెలలో అన్ని సంస్థలవి కలిపి ప్రయాణికుల వాహన సరఫరాలు 3.34 లక్షలుగా ఉన్నట్లు ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 2022 మే సరఫరాల కంటే ఇవి 13.5% ఎక్కువన్నారు. మే నెలలో ఇన్ని వాహనాలను డీలర్లకు కంపెనీలు సరఫరా చేయడం ఇప్పుడే అన్నారు. ఇంతకుముందు గరిష్ఠ స్థాయి 2018 మేలో నమోదైన    3.10 లక్షల వాహనాలే. మారుతీ అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 12% నుంచి 21 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని