సురక్షిత పథకాలూ అవసరమే...

మా నాన్న మరణించడంతో బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. వీటిని మా అమ్మ పేరుమీద మదుపు చేసి, నెలనెలా

Published : 25 Jun 2022 17:21 IST

* మా నాన్న మరణించడంతో బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. వీటిని మా అమ్మ పేరుమీద మదుపు చేసి, నెలనెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తన వయసు 53. కనీసం రూ.4 వేల వరకూ రావాలంటే ఎంత మొత్తం మదుపు చేయాల్సి ఉంటుంది?  

- కరుణాకర్‌

* ప్రస్తుతం పెట్టుబడులపై వడ్డీ రేట్లు అంత అధికంగా లేవు. కానీ, రానున్న ఆరు నెలల్లో ఇవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో రూ.4.5లక్షల వరకూ జమ చేసుకునే వీలుంది. ప్రస్తుతం 6.6శాతం వడ్డీ లభిస్తోంది. కాబట్టి, నెలకు రూ.2,475 వరకూ వస్తాయి. మిగతా మొత్తం కోసం నాన్‌ క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.2.75 లక్షల వరకూ జమ చేయాలి. ఆరు నెలల తరువాత ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయండి. అప్పుడు మీరనుకున్నట్లు రూ.4వేలు వస్తాయి.

* మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం నెలకు రూ.15వేల వరకూ కేటాయించాలని ఆలోచన. ఏ పథకాలను ఎంచుకోవాలి?           

  - స్వరూప

బంగారాన్ని జమ చేసేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి గోల్డ్‌ ఈటీఎఫ్‌.. ఇందులో ఒక యూనిట్‌ విలువ ఒక గ్రాము బంగారానికి దాదాపు సమానంగా ఉంటుంది. వీటిలో మదుపు చేసేందుకు డీమ్యాట్‌ ఖాతా అవసరం. మరో మార్గం.. గోల్డ్‌ ఫండ్లు. ఇందులో మీ వీలును బట్టి, పెట్టుబడి పెట్టొచ్చు. డీమ్యాట్‌ ఖాతాతో అవసరం లేదు. ఈ రెండింటిలో మీకు అనుకూలమైన పథకాలను ఎంచుకోండి. అవసరమైనప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకొని బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఏడెనిమిదేళ్ల వ్యవధి ఉంటే.. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే అంశాన్నీ పరిశీలించండి. దీనివల్ల కాస్త ఎక్కువ రాబడి వచ్చేందుకు అవకాశాలున్నాయి.

* నేను మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.8వేలు మదుపు చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మరో రూ.5వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్నా కాబట్టి, ఈ మొత్తాన్ని ఏదైనా సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలా?                       

 - అక్షయ్‌

* పెట్టుబడులు ఎప్పుడూ మిశ్రమంగా ఉండాలి. నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడిని ఆర్జించే వాటితో పాటు, సురక్షిత పథకాలనూ ఎంచుకోవాలి. అప్పుడే మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మీరు ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారు కాబట్టి, రూ.5వేలను పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో జమ చేయండి. ప్రస్తుతం ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. వచ్చిన రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు.

* ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.21వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి కనీసం రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టేందుకు, నా ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? రూ.25 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకుంటే సరిపోతుందా?

- నవీన్‌

* వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల టర్మ్‌ పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిది. మీరు రూ.30లక్షల వరకూ విలువైన పాలసీని తీసుకోవచ్చు. అలాగే కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. వ్యక్తిగతంగా ఆరోగ్య, ప్రమాద, డిజేబిలిటీ బీమా పాలసీలను తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. కనీసం అయిదారేళ్లకు మించి పెట్టుబడిని కొనసాగించండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని