ఆ పథకాల్లో 9 శాతం రాబడి వస్తుందా?

ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.40వేలు వస్తున్నాయి. వయసు 29. ఇప్పటి వరకూఏ బీమా పాలసీలు, పెట్టుబడులు లేవు. నెలకు కనీసం రూ.6,000 వరకూ పొదుపు చేయాలనుకుంటున్నాను. ఇటీవలే పెళ్లి అయ్యింది. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందో సూచించండి.

Updated : 10 Aug 2022 10:39 IST

* ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.40వేలు వస్తున్నాయి. వయసు 29. ఇప్పటి వరకూఏ బీమా పాలసీలు, పెట్టుబడులు లేవు. నెలకు కనీసం రూ.6,000 వరకూ పొదుపు చేయాలనుకుంటున్నాను. ఇటీవలే పెళ్లి అయ్యింది. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందో సూచించండి.

   - నాగరాజు

* ముందుగా మీరు కనీసం రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకోండి. మీ ఇద్దరికీ వర్తించేలా కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. వీటితోపాటు, మీ పేరుమీద వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోండి. ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.6వేలలో రూ.2వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.4వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు బదులు అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లలో జమ చేస్తే 9 శాతం వరకూ రాబడి వస్తుందని అంటున్నారు. నిజమేనా? ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలి?

- ప్రవీణ్‌

* మీరు విన్నది నిజం కాదు. సాధారణంగా అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లు ఇచ్చే రాబడి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు దాదాపు సమానంగానే ఉంటుంది. మూడేళ్లకు మించి వీటిలో మదుపు చేసినప్పుడు ద్రవ్యోల్బణ సూచీని వర్తింపచేసి, వచ్చిన రాబడిపై పన్ను లెక్కిస్తారు. దీనివల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీపై వర్తించే పన్నుకన్నా ఈ ఫండ్ల రాబడికి తక్కువ పన్ను భారం ఉంటుంది. అదీ 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నవారికే గరిష్ఠ ప్రయోజనం. అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లలో కాస్త నష్టభయమూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిల్లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా మీరు పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లు లేదా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవడమే మంచిది. 

* మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. తనకు ఇప్పుడు 11 ఏళ్లు. మరో 13 ఏళ్ల దాకా ఈ పెట్టుబడిని కొనసాగిస్తాను. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

- హరిత

* మీరు పెట్టే పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని అందించాలి. మీకు 13 ఏళ్ల వరకూ వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, కాస్త నష్టభయం ఉన్నా, మంచి రాబడిని అందించే పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లు, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజీ ఫండ్లను పరిశీలించవచ్చు. 13 ఏళ్లపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేస్తూ వెళ్తే.. సగటున 11 శాతం రాబడి అంచనాతో.. మీ పెట్టుబడి రూ.31,45,396 అయ్యేందుకు అవకాశం ఉంది.

* ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.30వేల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. బ్యాంకులు అందించే పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చా? ప్రత్యామ్నాయంగా తక్కువ నష్టభయం ఉండే పథకాలు ఏమున్నాయి?

- హరి
* నష్టభయం లేని పెట్టుబడి కోసం పోస్టాఫీసులో జాతీయ పొదుపు పథకం (ఎన్‌ఎస్‌సీ)ని పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఇందులో 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. సెక్షన్‌ 80సీ కింద పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పన్ను ఆదా ఎఫ్‌డీలతో పోలిస్తే కాస్త అధిక రాబడి అందుతుంది. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను పరిశీలించవచ్చు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ మంచి రాబడి అందుతుంది. వీటికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. పెట్టుబడిని కనీసం అయిదేళ్లు కొనసాగించడం వల్ల ఫలితాలు బాగుంటాయి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని