వాహన రుణం తీర్చేయాలా?

నా వయసు 67. పింఛను వస్తోంది. ఇందులో నుంచి  రూ.10వేల వరకూ మంచి రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి?

Published : 04 Nov 2022 00:34 IST

- నా వయసు 67. పింఛను వస్తోంది. ఇందులో నుంచి  రూ.10వేల వరకూ మంచి రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీ ఇస్తారా?          

- రామచంద్రం

 మీకు పింఛనే ఆధారం కాబట్టి, పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధిక నష్టభయం లేకుండా చూసుకోవాలి. సురక్షిత పథకాల కంటే కాస్త అధిక రాబడి రావాలంటే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉంటుంది. మీరు ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు వీలుంది. కాకపోతే వైద్య పరీక్షలు తప్పనిసరి. వీటి ఆధారంగానే పాలసీ ఇవ్వాలా వద్దా అనేది బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. స్టార్‌ హెల్త్‌లో సీనియర్‌ సిటిజన్‌ రెడ్‌ కార్పెట్‌ పాలసీని పరిశీలించవచ్చు. ఇందులో ముందస్తు వ్యాధుల చికిత్సకూ రక్షణ లభిస్తుంది. సహ-చెల్లింపు నిబంధన ఉంటుంది.


- మా అమ్మాయి కోసం బంగారం కొనాలని అనుకుంటున్నాం. నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఆరేళ్ల వరకూపెట్టుబడి కొనసాగిస్తాం. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?               

 - ప్రమీల

మీరు పెట్టే పెట్టుబడి బంగారానికి అనుగుణంగా రాబడిని ఇవ్వాలనుకుంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ లేదా గోల్డ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేయాలంటే.. డీమ్యాట్‌ ఖాతా అవసరం. గోల్డ్‌ ఫండ్లకు ఈ ఖాతా అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లనూ చూడొచ్చు. వీటిల్లో 12-13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. నెలకు రూ.15వేల చొప్పున 12 శాతం రాబడి అంచనాతో ఆరేళ్లపాటు మదుపు చేస్తే.. రూ.14,16,734 అయ్యేందుకు అవకాశం ఉంది. మీరు ఈ డబ్బును వెనక్కి తీసుకొని, బంగారం కొనుగోలుకు వాడుకోవచ్చు.


- ఏడాది క్రితం వాహన రుణం తీసుకున్నాను. వడ్డీ 9.5 శాతం. నెలకు రూ.15,000 ఈఎంఐ చెల్లిస్తున్నా. ఇంకా ఆరేళ్లలో రూ.8 లక్షల వరకూ చెల్లించాలి. దీన్ని ఒకేసారి తీర్చాలంటే 6 శాతం ముందస్తు చెల్లింపు రుసుము ఉంటుందని బ్యాంకు చెబుతోంది. దీన్ని తీర్చకుండా మంచి రాబడి వచ్చే పథకాల్లో మదుపు చేయొచ్చా?

- మహిపాల్‌

మీ విషయాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ప్రస్తుతం మీరు వాహన రుణాన్ని ఒకేసారి చెల్లించాలంటే.. రూ.8,50,000 అవసరం. మీ మొత్తాన్ని చెల్లించకుండా హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే ఆరేళ్ల తర్వాత రూ.15,90,000 అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రుణాన్ని చెల్లించి, మిగిలే ఈఎంఐ రూ.15,000 నెలనెలా మదుపు చేస్తే రూ.14,24,000 చేతికి వస్తాయి. కాబట్టి, మీకు నెలనెలా ఈఎంఐ చెల్లించడంలో ఇబ్బంది లేదు అనుకుంటే.. రుణం తీర్చాల్సిన అవసరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


- టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో ప్రీమియం మొత్తం వాపసు ఇచ్చే పాలసీలు వచ్చాయి కదా! వీటిని ఎంచుకుంటే మంచిదేనా?   

 - శ్రీకాంత్‌

పూర్తిగా రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీకి  చెల్లించిన ప్రీమియం వెనక్కి ఇవ్వరు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా కవరేజీ రావాలనుకుంటే ఇవే మేలు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలకు అధిక ప్రీమియం ఉంటుంది. మన దగ్గర వసూలు చేసిన ఈ అధిక ప్రీమియాన్ని పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరాక బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. దీనికి   బదులుగా సాధారణ బీమా పాలసీనే తీసుకొని, ప్రీమియం వ్యత్యాసాన్ని మీరే సొంతంగా మదుపు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని