అంబానీ ఆలోచన వెనుక అతను..!

మనోజ్‌ మోదీ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు బహిరంగ కార్యక్రమంలో ఆయన కనిపించడం చాలా అరుదు. పూర్తిగా లోప్రొఫైల్‌లో ఉంటారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో మోదీ ఒకరు. ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌తో జరిగిన డీల్‌లో ముఖేష్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీల వ్యూహం వెనుక మనోజ్‌పాత్ర ఉంది.

Published : 26 Dec 2020 17:53 IST

13 బిలియన్‌ డాలర్ల డీల్స్‌కు సూత్రధారి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

కరోనావైరస్‌ మార్చిలో మెల్లగా భారత్‌లో విజృంభించడం మొదలైంది.. దీంతో లాక్‌డౌన్‌ భయాలతో స్టాక్‌ మార్కెట్లు గంగవెర్రులెత్తిపోతున్నాయి. పాతాళాన్ని వెతుకుతున్నాయా..? అన్నట్లు పతనమయ్యాయి. మార్చి మధ్యలో రిలయన్స్‌ షేరు ధర రూ.900 దిగువకు పడిపోయింది. అయినా రిలయన్స్‌ బృందం గుంబనంగా ఉంది.. ఆ తర్వాత మెల్లగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ రెండో వారం గడిచాక ఫేస్‌బుక్‌ డీల్‌ తెరపైకి వచ్చింది.. ఈ డీల్‌ విలువ సుమారు రూ.43 వేల కోట్ల పైమాటే. అక్కడి నుంచి రిలయన్స్‌ ఏ దశలోను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా కంపెనీ విలువ రాకెట్‌లా దూసుకుపోయింది. ఈ డీల్స్‌ వెనుక ముఖేశ్‌ అంబానీ రైట్‌ హ్యాండ్‌గా పేరున్న ఒక వ్యక్తి మేథస్సు ఉంది. ఆయనే మనోజ్‌ మోదీ..! ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది. 

నిశ్శబ్దంగా తనపని తాను..

మనోజ్‌ మోదీ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు బహిరంగ కార్యక్రమంలో ఆయన కనిపించడం చాలా అరుదు. పూర్తిగా లోప్రొఫైల్‌లో ఉంటారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో మోదీ ఒకరు. ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌తో జరిగిన డీల్‌లో ముఖేష్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీల వ్యూహం వెనుక మనోజ్‌పాత్ర ఉంది. ఆయన రిలయన్స్‌ రిటైల్‌తోపాటు రియలన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ తన గురించి ఆయన చెప్పుకోరు. ఓ సదస్సులో ఆయన మాట్లాడతూ ‘‘నేను బేరాలు చేయలేను. నాకు వ్యూహాలు అర్థం కావు. కంపెనీలో అంతర్గతంగా ఉండేవారికి ఈ విషయాలు తెలుసు. నాకు పెద్దగా ముందు చూపు కూడా లేదు. నేను కేవలం సంస్థలో వారితో కలిసే పనిచేస్తా. వారికి శిక్షణ ఇవ్వడం.. కీలకమైన బాధ్యతలను ఎలా నిర్వహించాలో నేర్పిస్తా. మనతో కలిసిన వ్యాపార భాగస్వాములు లాభపడనంతకాలం.. మనం నిలదొక్కుకోలేం అనే రిలయన్స్‌ వ్యాపార సూత్రం నుంచి నేర్చుకొంటా’’ అని పేర్కొన్నారు.  

బేరాలాడటంలో దిట్ట..

రిలయన్స్‌ ఆయన కనుసన్నల్లోనే స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. చర్చలు జరపడం.. బేరాలాడటంలో మనోజ్‌ది అందెవేసిన చేయి. ఇటీవల రిలయన్స్‌ కొనుగోలు చేసిన కృత్రిమ మేధ నుంచి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ నుంచి  స్టార్టప్‌ల వరకు ఆయన కృషి ఉంది. రిలయన్స్‌ డిజిటల్‌  వ్యాపారాలను బలోపేతం చేయడానికి ఈ డీల్స్‌ చాలా వరకు ఉపయోగపడతాయి. చాలా డీల్స్‌లో మనోజ్‌తో మీటింగ్‌ జరిగితే దానికి రిలయన్స్‌ ఆమోద ముద్రపడినట్లేని భావిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా సదరు స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులే వెల్లడించారు. 

‘ఆయన రిలయన్స్‌కు కేవలం నమ్మకస్తుడు మాత్రమే కాదు. తెలివితేటలు.. చర్చలు జరపగల నేర్పరితనం వంటి ఆయన లక్షణాలు సంస్థకు అదనపు బలం. కేవలం అసాధారణ చాతుర్యం.. భారతీయులకు ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోగల నైపుణ్యం.. ముందుచూపు వంటివి ఆయన్ను ఈ స్థితిలో నిలిపాయి’’ అని ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపీనాథ్‌ పేర్కొన్నారు. 2010లో ఎయిర్‌ డెక్కన్‌ వాటాలను రిలయన్స్‌కు విక్రయించింది. విలీనాలు, వాటాల కొనుగోళ్ల విషయంలో మనోజ్‌ అత్యంత నేర్పరి అని తెలిపారు. 

1980 నుంచి రిలయన్స్‌తో అనుబంధం..

ధీరుభాయ్‌ అంబానీ పెట్రోలియం సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన 1980ల నుంచి కంపెనీతో ఉన్న వ్యక్తుల్లో మనోజ్‌ హరిజీవన్‌దాస్‌ మోదీ ఒకరు. ఆయన అంతకు ముందు ముఖేశ్‌తో కలిసి ముంబయిలోని ‘ది యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ’లో ముఖేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో రిలయన్స్‌లో అడుగుపెట్టారు. ధీరుభాయ్‌, ముఖేశ్‌, ఇషా, నీతా కలిసి పనిచేశారు. 

టెలికామ్‌ విస్తరణ వెనుక..

రిలయన్స్‌ జియో విస్తరణ వెనుక ఆయన కృషి చాలా ఉందని చెబుతారు. ముఖ్యంగా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ విస్తరణ సమయంలో సరఫరాదారులతో ఆయనే తీరిక లేకుండా చర్చలు జరిపారు. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పుడు దాదాపు 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు అదే జియోలో ఫేస్‌బుక్‌ కూడా భాగస్వామిగా చేరింది. ఈ డీల్‌ సమయంలో ముఖేష్‌, ఇషా, ఆకాశ్‌, మనోజ్‌, అన్షుమాన్‌ ఠక్కర్‌(రిలయ్స్‌ వ్యూహాల విభాగం) మాత్రమే కీలక వ్యక్తులు. 

పెట్రోలియం విక్రయాలు తగ్గిన సమయంలో..

రిలయన్స్‌ ప్రధాన వ్యాపారమైన పెట్రోలియం రంగంపై కరోనావైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోరంగం ఇబ్బంది పడింది. ఈ సమయంలో వీరు ఈ సమయంలో ఫేస్‌బుక్‌, కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలతో కళ్లు చెదిరే డీల్స్‌ కుదుర్చుకొన్నారు. ఫలితంగా సంస్థ మార్కెట్‌ విలువ పెరగడంతోపాటు రిలయన్స్‌ డిజిటల్‌ వ్యాపారానికి బలమైన పునాదులు పడ్డాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని