ఊరట లభిస్తుందా?

కరోనా మహమ్మారితో ప్రజల  ఆదాయాలు తగ్గాయి.. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. ప్రజల చేతిలో కాస్త మిగులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం...

Updated : 30 Jan 2021 19:10 IST

ఆదాయపు పన్ను మినహాయింపులపై సర్వత్రా ఆసక్తి

ఈనాడు - హైదరాబాద్‌

కరోనా మహమ్మారితో ప్రజల  ఆదాయాలు తగ్గాయి.. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. ప్రజల చేతిలో కాస్త మిగులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకోదగ్గ చర్యల్లో కీలకమైంది ‘పన్నుల భారం తగ్గించడమే’. ఆత్మనిర్భర్‌ భారత్‌తో పలు రంగాలకు చేయూతనిచ్చిన ప్రభుత్వం, కొత్త బడ్జెట్‌లో  సామాన్యులకు ఊరట కల్పించేలా ఏం చర్యలు తీసుకుంటుంది.. ఆదాయపు పన్ను రాయితీలు పెంచుతుందా.. అనే విషయమై చర్చోపచర్చలు  సాగుతున్నాయి.

ప్రీమియం పెరిగింది.. మినహాయింపు మాటేమిటి?

కొవిడ్‌-19 తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియాలు దాదాపు 10శాతానికిపైగానే పెరిగాయి. అందరూ పెద్దమొత్తం పాలసీలు తీసుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆరోగ్య బీమా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు 60 ఏళ్లలోపు వారికి రూ.25,000, సీనియర్‌ సిటిజన్లకు రూ.50వేల వరకు ప్రీమియంలో మినహాయింపు లభిస్తోంది. ఈ మినహాయింపును పెంచాలని పాలసీదారులు కోరుకుంటున్నారు. ముందస్తు వైద్య చికిత్సలకోసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పెరిగిన వైద్య పరీక్షల ఖర్చు నేపథ్యంలో దీన్ని రూ.10వేలైనా చేయాలనే సూచనలున్నాయి.
కొవిడ్‌-19 చికిత్స కోసం ఖర్చు చేసిన వారికి, ఆ మొత్తాన్ని ఏదైనా ప్రత్యేక సెక్షన్‌ కింద మినహాయింపు పొందే అవకాశం ఇవ్వాలనేది పన్ను చెల్లింపుదారుల కోరికల్లో ఒకటి.
గృహ బీమాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలు.. పాలసీదారులూ కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రస్తావన ఉండవచ్చనేది నిపుణుల అంచనా.

వడ్డీ పరిమితి పెరుగుతుందా?

ప్పుడు చాలామంది గృహరుణం తీసుకుని, సొంతింటి వారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం. స్థిరాస్తి రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలంటే.. గృహ రుణ వడ్డీపై సెక్షన్‌ 24(బి) కింద ఇస్తున్న మినహాయింపు పరిమితి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు పెంచాలనేది కోరిక. గృహరుణ అసలును సెక్షన్‌ 80సీ నుంచి తప్పించి, మరో సెక్షన్‌లో చేర్చాలని కోరుతున్నారు.  

ఇంటి నుంచి పనికి..

కొవిడ్‌-19తో కార్యాలయాలకు వెళ్లే వారు తగ్గిపోయారు. ఇంటి నుంచి పని చేయడం పెరిగింది. ఉద్యోగులకు ఫర్నీచర్‌, ఇతర ఖర్చులు పెరిగాయి. కార్యాలయాలకు వెళ్లినప్పుడు లభించే కొన్ని ప్రయోజనాలకూ వారు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పేరుతో ప్రత్యేక ప్రామాణిక తగ్గింపును 2021-22 ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా మినహాయింపు అందించాలన్నది పన్ను చెల్లింపుదారుల కోరిక.  

జీఎస్‌టీ తగ్గాలి

బీమా పాలసీలు ఇప్పుడు ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకంగా మారాయి. వీటిని తీసుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే, ప్రీమియంపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఉండటం భారంగా మారింది. దీన్ని కనీసం 12శాతం లేదా అంతకన్నా తక్కువ శ్లాబులోకి చేరిస్తే మేలని గత బడ్జెట్‌ సమయంలోనూ పలువురు విన్నవించారు. కానీ ఆ ప్రస్తావనే రాలేదు. బీమా పాలసీలు తీసుకుంటున్న వారిని మరింత ప్రోత్సహించేందుకు, ఈసారైనా జీఎస్‌టీని తగ్గించాల్సిన అవసరం ఉంది.  

శ్లాబులు మారితేనే లాభం

ప్రస్తుతం రెండు రకాల ఆదాయపు పన్ను మదింపు పద్ధతులున్నాయి. ఇందులో ఒకటి ‘అన్ని మినహాయింపులు పొందుతూ.. పన్ను  చెల్లించడం’, మరొకటి ‘మినహాయింపులేమీ లేకుండా ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను కట్టడం’.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ఎంచుకోవాలన్న విషయంలో ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సరైన అవగాహన లేదు. దీనికి బదులుగా ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడమే లాభమని ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఈ విషయంలో ప్రజలకు మేలు చేయాలనుకుంటే.. రూ.5 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తూ.. శ్లాబులను సవరిస్తే పెద్ద ఊరట లభించినట్లే.

80సీని పట్టించుకోవాలి

కొన్నేళ్లుగా సెక్షన్‌ 80సీకి సవరణలు రాలేదు. ఈ సెక్షన్‌ కింద రూ.1,50,000 వరకు చెల్లించే ఈపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియాలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణం అసలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటి వాటిపై మినహాయింపు పొందొచ్చు. ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు ఈ మినహాయింపు మొత్తం ద్వారా వస్తున్న ప్రయోజనం తక్కువే. కాబట్టి, ఈ సెక్షన్‌ కింద మినహాయింపు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇందులో నుంచి కనీసం జీవిత బీమా పాలసీలు, గృహరుణం అసలు మొత్తాలనైనా ఇతర సెక్షన్ల కిందకు మారిస్తేనే ప్రయోజనం.

మూలధన రాబడిపై..

దీర్ఘకాలిక పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి ఆదాయం వచ్చినప్పుడు ఆ పై మొత్తంపై 10శాతం పన్ను విధిస్తున్నారు. ఇది మదుపరులకు ఏమాత్రం రుచించడం లేదు. దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని లేదా.. పరిమితినైనా పెంచాలనే డిమాండు ఉంది. పైగా ఈక్విటీలకు 12 నెలలు, డెట్‌ పథకాలకు మూడేళ్లుగా దీర్ఘకాలిక వ్యవధిని నిర్ణయించారు. స్థిరాస్తులకు ఇది 24 నెలలు. ఈ వ్యత్యాసాన్ని సవరించి, డెట్‌ ఫండ్లలోనూ రెండేళ్ల వ్యవధిని తీసుకురావాలని మదుపరులు కోరుతున్నారు. స్వల్పకాలిక పెట్టుబడులపైనా పన్ను భారం 15 శాతాన్ని కొంతమేరకు తగ్గిస్తే పెట్టుబడిదారులకు మరింత ప్రోత్సాహం అందుతుంది.

సాధ్యమేనా?

రోనా దెబ్బకు వ్యక్తులు, కొన్ని రంగాల సంస్థల ఆదాయాలు తగ్గాయి. దీనివల్ల 2021-22లో పన్ను చెల్లింపులు తగ్గే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇలాంటప్పుడు పన్ను పరంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు ఆర్థిక మంత్రి ముందడుగేస్తారా.. ఆత్మనిర్భర్‌ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొంత పన్ను ఆదాయం కోల్పోడానికి సిద్ధమవుతారా ... అన్నది ఫిబ్రవరి 1న వెల్లడవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని