ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకు తీవ్ర కొరత

‘కొవిడ్‌-19తో ప్రజలు చనిపోతున్న తీరు చూస్తే ప్రాణం ఉసూరుమంటోంది, సకాలంలో ఆక్సిజన్‌ ఇస్తే సగం మంది బతుకుతారు..’ ప్రస్తుతం పలువురు వైద్యుల అభిప్రాయమిది. తగినంతగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులను చేర్చుకోడానికీ వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు

Published : 29 Apr 2021 01:46 IST

ఆకాశాన్ని అంటుతున్న ధరలు
గగ్గోలు పెడుతున్న కొవిడ్‌-19 బాధితుల బంధువులు
దిగుమతులపై సంస్థల దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొవిడ్‌-19తో ప్రజలు చనిపోతున్న తీరు చూస్తే ప్రాణం ఉసూరుమంటోంది, సకాలంలో ఆక్సిజన్‌ ఇస్తే సగం మంది బతుకుతారు..’ ప్రస్తుతం పలువురు వైద్యుల అభిప్రాయమిది. తగినంతగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులను చేర్చుకోడానికీ వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. సిలెండర్లు అద్దెకు తెచ్చుకుందామన్నా, దొరకడం లేదు. ఇందువల్లే కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న వారు, వ్యాధి తగ్గినా.. తదుపరి సైడ్‌ ఎఫెక్టుల్లో భాగంగా శ్వాస పీల్చేందుకు ఇబ్బంది పడుతున్న వారు ‘డబ్బు పోతేపోయింది, మనమే ఒక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ (ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం) కొనుక్కొందాం..’ అని ఆలోచిస్తున్నారు. విద్యుత్తు/బ్యాటరీ సాయంతో పనిచేస్తూ, ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ఈ యంత్రాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. సరఫరా ఆ మేర లేకపోవడంతో కొందరు వ్యాపారులు, మధ్యవర్తులు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల ధరలను అడ్డగోలుగా పెంచేశారు. ఈ పరిస్థితి కొవిడ్‌-19 రోగులను, వారి బంధువులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
రెట్టింపునకు మించి
నాలుగు నెలల క్రితం వరకు 7 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ ధర రూ.32,000 మాత్రమే. నెబ్యులైజర్‌ కూడా ఉన్న 9 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ ధర రూ.36,000 ఉండేది. కానీ ఇప్పుడు ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్‌ ధర రూ.68,000 చెబుతున్నారు. దానికి మళ్లీ జీఎస్‌టీ అదనం. కొన్ని ప్రముఖ కంపెనీల యంత్రాల ధరలు ఇంకా అధికంగా ఉన్నాయి. ఒక అగ్రశ్రేణి సంస్థకు చెందిన 5 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ ధర రూ.70,000 పలుకుతోంది. మరికొన్ని రకాలైతే రూ.1 లక్షకు పైగా చెబుతున్నారు. ఇంతా చేస్తే, ఎప్పుడు యంత్రం చేతికొస్తుందో తెలియని పరిస్థితి. ప్రాణాపాయంతో రోగి తల్లడిల్లిపోతుంటే, పది రోజుల తర్వాత డెలివరీ ఇస్తామంటే ఎలా.. అని బాధితులు వాపోతున్నారు.
*ఇంటిలోనే ఆక్సిజన్‌ అందించే కాన్సంట్రేటర్‌ ఉంటే, బాధితుల మరణాలు చాలావరకు తగ్గించవచ్చని, ముఖ్యంగా వృద్ధులు ఉంటే వీటిని వినియోగించడం మేలని బ్లూవాటర్‌ ఆల్కలైన్‌ సొల్యూషన్స్‌ అధినేత కలిశెట్టి నాయుడు చెప్పారు.
ముందస్తుగా నగదు బదిలీ చేశారో..
ఇదే అదనుగా ముందుగా డబ్బు చెల్లిస్తే, రెండు మూడు రోజుల్లో డెలివరీ ఇస్తామని చెప్పి, తర్వాత మొఖం చాటేసే వారు సైతం బయలుదేరారు. ఆన్‌లైన్లో వెంటనే ఎంతో కొంత సొమ్ము జమచేస్తేనే మీకు యంత్రం దొరుకుతుందని నమ్మబలుకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల బంధువులు యంత్రం దొరుకుతుంది కదా అని వెంటనే డబ్బు బదిలీ చేస్తున్నారు. డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత అడ్రసు ఉండటం లేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది.. అని చెప్పి తప్పించుకుంటున్నారు. కొంత మంది మధ్యవర్తులు అయితే, తమ వివరాలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ తెప్పిస్తున్నారు, అది ఏ కంపెనీ, దాని గరిష్ఠ ధర ఎంత? అనే వివరాలు ఏవీ చెప్పడం లేదు. చివరికి బాధితులకు మానసిక వ్యధ మిగులుతోంది.

 

సేకరణపై దృష్టి సారించిన సంస్థలు

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుని ఆసుపత్రులకు అందించడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో ఫిక్కీ, పేటీఎం, స్పైస్‌హెల్త్‌.. తదితర సంస్థలు ఉన్నాయి.
* ఫిక్కీ, తన భాగస్వామ్య అసోసియేషన్‌ అయిన బీవీఎండబ్లూ (జర్మన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం సైజ్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌) తో కలిసి 1500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ప్రైవేటు ఆసుపత్రుల కోసం తెప్పించింది. ఈ యంత్రాలు, ఇతర వైద్య పరికరాలున్న విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరినట్లు ఫిక్కీ వెల్లడించింది.
* డిజిటల్‌ చెల్లింపుల సేవల సంస్థ అయిన పేటీఎం ‘ఆక్సిజన్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమం కింద 21,000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను తెప్పిస్తోంది. మే మొదటి వారంలో ఇవి మనదేశానికి వస్తాయని పేటీఎం వెల్లడించింది. రాగానే వీటిని ప్రభుత్వ - ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సదుపాయాలు, నర్సింగ్‌ హోమ్‌లకు సరఫరా చేస్తామని పేర్కొంది. దీనికోసం ప్రజల నుంచి రూ.5 కోట్లు సమీకరించినట్లు, తన వంతుగా మరో రూ.5 కోట్లు వేసి మొత్తం రూ.10 కోట్లను ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మరో రూ.14 కోట్లు సమీకరించి ఆ సొమ్ముతోనూ కాన్సంట్రేటర్లు తెప్పించనున్నట్లు వివరించింది.
* స్పైస్‌జెట్‌కు చెందిన స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ హాంకాంగ్‌ నుంచి 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను దిల్లీ తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం కోసం వీటిని స్పైస్‌జెట్‌ ప్రమోటర్లకు చెందిన సంస్థ స్పైస్‌హెల్త్‌ తెప్పిస్తోంది. గత రెండు వారాల్లో 2,000 కు పైగా తెప్పించినట్లు స్పైస్‌హెల్త్‌ వెల్లడించింది.
* సింగపూర్‌ నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు దశల వారీగా చేరుకుంటున్నట్లు ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) ప్రకటించింది. ఈ నెల 27న 256 యంత్రాలు వచ్చాయని, 128 యంత్రాలతో మరొక బ్యాచ్‌ రానుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని