నగదు రహితం.. సురక్షితంగా...

నగదు చెల్లింపులతో పోలిస్తే.. డిజిటల్‌ రూపంలో చేసే చెల్లింపులతో ప్రయోజనాలు ఎక్కువే. కానీ, వీటి చుట్టూ ఎన్నో సైబర్‌ నేరాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి.

Updated : 25 Jun 2021 06:21 IST

అధునాతన సాంకేతికత అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. నగదుకు ప్రత్యామ్నాయంగా డిజిటల్‌ చెల్లింపులు ఇందులో ఎంతో ప్రముఖంగా చెప్పొచ్చు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఇందులో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, యూపీఐ ఆధారిత యాప్‌ల వినియోగం ఎంతో వేగంగా  పెరిగింది. ఇప్పుడు కొవిడ్‌-19 నేపథ్యంలో డిజిటల్‌  చెల్లింపులు అనివార్యం అయ్యాయి. అదే సమయంలో ఇందులో మోసాలకూ ఆస్కారం పెరిగింది. అందుకే, సురక్షితంగా ఈ లావాదేవీలు నిర్వహించడానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరి.. అవేమిటో తెలుసుకుందాం...

నగదు చెల్లింపులతో పోలిస్తే.. డిజిటల్‌ రూపంలో చేసే చెల్లింపులతో ప్రయోజనాలు ఎక్కువే. కానీ, వీటి చుట్టూ ఎన్నో సైబర్‌ నేరాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. మహమ్మారి తర్వాత భారత్‌లో ఈ మోసాల సంఖ్య ఎంతో పెరిగింది. డిజిటల్‌ చెల్లింపులపై ఆధారపడటం 2021 తర్వాత నుంచి మరింత అధికమయ్యే అవకాశాలున్నందున.. ఈ సైబర్‌ మోసాలూ అదే స్థాయిలో ఉండే ప్రమాదం ఉంది.

కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్‌ చెల్లింపులను కాదనలేం. అదే సమయంలో అప్రమత్తంగా, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేయాలి.

నమ్మకమైన యాప్‌లు..

చెల్లింపులకు సంబంధించిన యాప్‌లతో లావాదేవీలు పూర్తి చేయాలంటే.. తప్పనిసరిగా బ్యాంకు ఖాతా, కార్డు వివరాలను వాటికి జత చేయాల్సిందే. అందుకే, నమ్మకమైన యాప్‌లను వాడుతున్నామా లేదా అనేది ఇక్కడ కీలకం. నమ్మకమైన, అన్ని చోట్ల అంగీకరించే యాప్‌లను మాత్రమే మనం వినియోగించాలి. ఇలాంటి యాప్‌లు తమ వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతాయని భావించవచ్చు. ఆయా యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్‌ ప్లే ప్రొటెక్ట్‌, యాపిల్‌ ఐస్టోర్‌ ద్వారా గుర్తింపు పొందాయా లేదా అనేది చూసుకోవాలి. మనం ఇచ్చిన సమాచారాన్ని యాప్‌ ఎంత వరకూ వినియోగిస్తుందనే విషయాలనూ స్పష్టంగా తెలుసుకోవాలి.

అత్యంత రహస్యంగా..

చాలామంది తమకు సులభంగా గుర్తుండేలా పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటారు. కానీ, ఇది చాలా పెద్ద పొరపాటు.. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా.. ఇక్కడ డబ్బుతో వ్యవహారం అన్నది మర్చిపోవద్దు. మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నెంబరు ఇలా మీకు సంబంధించినవేవీ పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. కఠినమైన పాస్‌వర్డ్‌లున్నప్పుడే సైబర్‌ నేరాల బారిన పడే ఆస్కారం ఉండదు. కనీసం నెలకోసారైనా పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం తప్పనిసరి.

రెండంచెల భద్రత..

ఒక లావాదేవీ పూర్తి చేసేందుకు రెండుసార్లు పాస్‌వర్డ్‌ నమోదు చేయడంలాంటి రెండంచెల భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఓటీపీ వచ్చే అవకాశం ఉన్న ప్రతి చోటా ఆ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు పాస్‌వర్డ్‌ మోసగాళ్ల చేతిలో పడ్డా.. ఓటీపీ ద్వారా ఆ లావాదేవీ జరగకుండా అడ్డుకోవచ్చు. యాప్‌ను ప్రారంభించేందుకూ.. లావాదేవీని పూర్తి చేసేందుకూ వేర్వేరు రహస్య సంఖ్యలను పెట్టుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.

క్యూఆర్‌ కోడ్‌లతో..

ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లింపులను పూర్తి చేయడం సర్వసాధారణ విషయం. చాలా  దుకాణాల్లో వీటిని బయట అతికిస్తుంటారు. మోసగాళ్లు వీటి స్థానంలో నకిలీ క్యూఆర్‌ కోడ్‌లను అంటించే అవకాశం లేకపోలేదు. మీ దగ్గర్నుంచి డబ్బు డెబిట్‌ అయినా.. వ్యాపారికి అది చేరకపోవచ్చు. కాబట్టి, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, వెంటనే చెల్లించేయకుండా.. అది వారిదేనా అని ఒకసారి ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాతే లావాదేవీని పూర్తి చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోండి. 

* మీకు డబ్బు పంపిస్తాం.. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, ఆ మొత్తాన్ని పేర్కొనండి.. పిన్‌ నమోదు చేయండిలాంటివి ఎవరైనా  చెబితే... అది మోసమేనని  గుర్తుంచుకోండి

మొబైల్‌ నెట్‌వర్క్‌తోనే..

చాలా చోట్ల ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటుంది. ఇలాంటి సౌకర్యాన్ని ఇతర యాప్‌లను ఉపయోగించుకునేందుకు వాడుకోండి. కానీ, చెల్లింపులను మాత్రం తప్పనిసరిగా మీ మొబైల్‌ డేటాను వాడుకుంటూ మాత్రమే నిర్వహించండి. చాలామంది మోసపోవడానికి ప్రధాన కారణం.. పబ్లిక్‌ వై-ఫైలను వాడటమే. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల విషయంలోనూ.. సురక్షితమైన, నమ్మకమైన వెబ్‌సైట్లలో మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి.

సరికొత్త సాంకేతికతల వల్ల మనకు రోజువారీ లావాదేవీలు సులభం అయ్యాయి. కానీ, మోసగాళ్లకూ ఇది అనేక అవకాశాలను ఇస్తోంది. కాబట్టి, మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే.. మన కష్టార్జితాన్ని ఇతరులు తస్కరించకుండా కాపాడుకోగలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని