ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సిద్ధం ఇలా..

ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణకు సమయం వచ్చేసింది. ఈసారి రిటర్నులను మరింత సులభం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Updated : 23 Jul 2021 04:43 IST

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణకు సమయం వచ్చేసింది. ఈసారి రిటర్నులను మరింత సులభం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు www.incometax.gov.in ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల ప్రాసెసింగ్‌ను మరింత వేగంగా చేయడంతోపాటు, రిఫండ్‌నూ త్వరగా చెల్లించేందుకు ఈ సీపీసీ 2.0 అందుబాటులోకి వచ్చింది. మరి, కొత్త పోర్టల్‌లో రిటర్నులను సమర్పించేముందు మనం ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందామా..

రిమితికి మించి ఆదాయం ఉన్నా.. లేకున్నా.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ కొత్తగా జేసన్‌ (జేఎస్‌ఓఎన్‌) యుటిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి పోర్టల్‌లో ఐటీఆర్‌ 1, ఐటీఆర్‌ 2, ఐటీఆర్‌ 4ని విడుదల చేశారు. ఈ ఫారాలు ముందుగానే నింపి (ప్రీ-ఫిల్‌) వస్తున్నాయి. ఇందులో మీ వేతనం వివరాలు, డివిడెండ్‌ ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, ఇలా.. 26 ఏఎస్‌లో అందుబాటులో ఉన్న ప్రతి వివరాలూ ఇందులోనూ కనిపిస్తాయి.

తేడా ఉంటే కుదరదు..

ఐటీ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయ్యేందుకు పాన్‌ కార్డు, పాస్‌వర్డ్‌ ఉంటే చాలు. ఇప్పటివరకూ రిటర్నులు దాఖలు చేయని వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మర్చిపోయిన వారు.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ కావచ్చు. కానీ, పాన్‌ కార్డులో ఉన్న పేరు, బ్యాంకింగ్‌ ఖాతాలో ఉన్న పేరుతో ఒకేలా ఉండాలి. ఐటీ శాఖ వద్ద నమోదైన ఫోన్‌ నెంబరు, ఇ-మెయిల్‌, బ్యాంకుల వద్ద ఉన్న వివరాలతో సరిపోకపోయినా.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐటీ వెబ్‌సైటులోకి లాగిన్‌ అవ్వడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాస్‌వర్డ్‌ కొత్తగా నమోదు చేయడమే మేలు. ఆధార్‌ ఓటీపీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఆధార్‌-పాన్‌ కార్డును అనుసంధానం చేయకపోతే ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేయండి. పోర్టల్‌లోకి వెళ్లిన తర్వాత మీ తాజా వివరాలను అప్‌డేట్‌ చేయడం మంచిది.

ఏ ఫారంలో..

మీరు ఆదాయాన్ని ఆర్జించిన మార్గాలను బట్టి, ఏ ఫారంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. సరైన ఫారంలో రిటర్నులు దాఖలు చేయడం ఇక్కడ ప్రధానం. సరైన పత్రాన్ని వినియోగించకపోతే ఆదాయపు పన్ను శాఖ దాన్ని ‘డిఫెక్టివ్‌ రిటర్న్‌’గా పరిగణిస్తుంది. ఉదాహరణకు వేతనం, డివిడెండ్‌ ఆదాయం, వడ్డీ ఆదాయం ఉన్న వారు ఐటీఆర్‌ 1 దాఖలు చేస్తే సరిపోతుంది. అదే.. మూలధన లాభాలు ఉన్నప్పుడు ఉద్యోగులూ ఐటీఆర్‌ 2 వేయాల్సి ఉంటుంది.

ఆధారాలన్నీ ఒకేచోట..

రిటర్నులు దాఖలు చేసేముందు.. మీ ఆదాయం.. మినహాయింపుల కోసం చేసిన పెట్టుబడులు, ఇతర సెక్షన్ల కింద కోరుతున్న మినహాయింపులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సిద్ధం చేసుకోండి. గతం సంగతి ఎలా ఉన్నా.. ఈసారి నుంచి అన్ని ఆదాయాలనూ కచ్చితంగా చూపించాల్సిందే. ఎందుకంటే.. మీ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉంటాయన్నది మర్చిపోకండి. వేతనం ద్వారా వచ్చిన ఆదాయం, డివిడెండ్లు, పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ.. మూలధన లాభాలు ఇలా అన్నింటి వివరాలూ జాగ్రత్తగా పరిశీలించండి. ఆదాయాలు నమోదు చేసేటప్పుడు పొరపాట్లకు తావీయకండి. చిన్న పొరపాటు చేసినా.. ఆ రిటర్నులు చెల్లకుండా పోయే ఆస్కారం ఉంది.

పన్ను విధానం మార్చుకోవచ్చు..

ఆదాయపు పన్ను చెల్లింపునకు సంబంధించి మినహాయింపులతో.. మినహాయింపులు లేకుండా.. ఈ రెండు విధానాల్లో ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు పాత విధానంలో మూలం వద్ద పన్ను   చెల్లించినప్పటికీ.. రిటర్నుల సమయంలో కొత్త విధానానికి మారిపోవచ్చు. అప్పుడు అధికంగా పన్ను చెల్లిస్తే రిఫండు రూపంలో వస్తుంది. లేదా.. పన్ను చెల్లించాల్సి వస్తే.. సొంతంగా చెల్లించాలి.  

ఫారం 26ఏఎస్‌ను చూడండి..

ఉద్యోగులకు యాజమాన్య సంస్థ ఫారం 16ను జారీ చేస్తుంది. ఇందులో కేవలం యాజమాన్యం ఇచ్చిన వేతనం, మీరు అందించిన ఆధారాలతో మినహాయింపులు పేర్కొని, ఎంత టీడీఎస్‌ చేశారన్న వివరాలు ఉంటాయి. అయితే, మీరు రిటర్నులు సమర్పించే ముందు చూడాల్సిన మరో ముఖ్యమైన పత్రం.. ఫారం 26 ఏఎస్‌. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాలు, మీరు చెల్లించిన పన్ను వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. అందులో పేర్కొన్న   ఆదాయాలన్నీ మీరు రిటర్నుల్లో చూపించాల్సిందే. ఉదాహరణకు మీకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా రూ.లక్ష వడ్డీ వచ్చిందనుకుందాం. మీరు 30శాతం పన్ను శ్లాబులో ఉన్నప్పటికీ.. బ్యాంకు మీ దగ్గర 10శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తుంది. మిగతా 20 శాతం మీరు రిటర్నులు దాఖలు చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, అందుకు అనుగుణంగా పన్ను చెల్లించేందుకు మీ దగ్గర డబ్బు అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. ఇలాంటప్పుడు గడువు తేదీ లోపే పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం. లేకుంటే.. చెల్లించాల్సిన పన్నుపై నిబంధనల మేరకు వడ్డీ అదనంగా పడుతుంది.


సెప్టెంబరు 30 వరకూ..

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31గా ఉంటుంది. కానీ, కొవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవధిని సెప్టెంబరు 30 వరకూ పొడిగించారు. అపరాధ రుసుముతో జనవరి 31, 2022 వరకూ దాఖలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని