పిల్లలభవితకు ధీమాగా...

కొవిడ్‌-19 తర్వాత పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం పడింది. అంతమాత్రాన వారి భవిష్యత్తు చదువులకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలు ఆపేయలేం కదా.. ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అవుతున్నాయి.

Published : 10 Sep 2021 01:04 IST

కొవిడ్‌-19 తర్వాత పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం పడింది. అంతమాత్రాన వారి భవిష్యత్తు చదువులకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలు ఆపేయలేం కదా.. ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అవుతున్నాయి. చదువుల ఖర్చూ గతంతో పోలిస్తే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళిక ఉంటే తప్ప.. ఆయా ఖర్చులను తట్టుకునే శక్తి రాదు. ముఖ్యంగా పిల్లలకు ఆధారమైన తల్లిదండ్రులకు జరగరానిది ఏదైనా జరిగితే వారి భవిష్యత్‌ మొత్తం అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులు, ఇతర అవసరాలకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు  తీసుకోవాల్సిందే. దీనికోసం పిల్లల బీమా పాలసీలు ఒక మార్గం.

రోనా ఎన్నో కుటుంబాలకు కష్టాలను మిగులుస్తోంది. దీని ప్రభావం తగ్గినట్లే కనిపిస్తున్నా.. రానున్న రోజుల్లో ఎలాంటి ముప్పు పొంచి ఉందనేది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల ఆర్థిక రక్షణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం తప్పనిసరి అవసరమవుతోంది. పిల్లల కోసం పాలసీ తీసుకోవడం అంటే వారి పేరుతో తీసుకోవడం కాదు. ఆర్జించే తల్లి లేదా తండ్రి తన పేరుమీద పాలసీ తీసుకొని, అనివార్య పరిస్థితుల్లో పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి.
పిల్లల బీమా పాలసీలు వివిధ దశల్లో అవసరమైన మొత్తాలను సమకూరుస్తుంటాయి. ఉన్నత చదువులు, వారి వివాహంలాంటి సమయాల్లో ఈ పాలసీల నుంచి అవసరమైన మొత్తం తీసుకునే వీలుంటుంది.

ఎందుకు ప్రత్యేకం..

పెద్దలు తీసుకునే పిల్లల పాలసీలు మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణ పాలసీల్లో పాలసీదారుడు మరణించినప్పుడు పరిహారం చెల్లించిన తర్వాత పాలసీ రద్దవుతుంది. ఈ పాలసీలు.. పాలసీదారుడి మరణానంతరమూ కొనసాగుతాయి. బీమా సంస్థ పాలసీదారుడి బదులుగా ప్రీమియం చెల్లిస్తుంది. అంటే, పాలసీదారుడి పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడటం కోసం వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం అనే అనుబంధ పాలసీ ఉండటమే ఇందుకు కారణం. మీరు పిల్లల రక్షణ కోసం పాలసీ తీసుకునేటప్పుడు ఈ వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం ఉందా లేదా అనేది తప్పకుండా చూడండి.

ఎలా పనిచేస్తుందంటే..

సాధారణ జీవిత బీమా పాలసీలో పాలసీదారుడు మరణిస్తే.. ఒకేసారి పరిహారం లభిస్తుంది. కానీ, చిన్నారుల ఆర్థిక రక్షణకు ఉపయోగపడే పిల్లల పాలసీల్లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. వెంటనే నామినీగా ఉన్న వారికి పరిహారం లభిస్తుంది. ఆ తర్వాత ఆ పాలసీ వ్యవధి తీరేంత వరకూ కొనసాగుతూనే ఉంటుంది. దీనికోసం ఆ పాలసీకి బీమా సంస్థ ప్రీమియం చెల్లిస్తూ ఉంటుంది. అంటే వాస్తవ పాలసీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగుతుందన్నమాట.

రకాలూ ఉన్నాయి..

ఈ పాలసీల్లోనూ ఎండోమెంట్‌, యూనిట్‌ ఆధారిత పాలసీలు అందుబాటులో ఉన్నాయి.  పాలసీదారుల అవసరాలు, నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, దీనిని ఎంచుకోవచ్చు. ఈక్విటీల్లో వచ్చే సహజసిద్ధమైన నష్టాలను తట్టుకునే సామర్థ్యం ఉంటే.. యూనిట్‌ ఆధారిత పాలసీలను ఎంచుకోవచ్చు.  నష్టభయం వద్దనుకుంటే.. ఎండోమెంట్‌ పాలసీలను తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి రావాలంటే.. ఈక్విటీల్లో మదుపు చేయడం అవసరం.

ఎప్పుడు తీసుకోవాలి..

ఎంతకాలం మదుపును కొనసాగిస్తే.. అంత మంచి రాబడి ఉంటుంది. ఇదే విషయం పిల్లల పాలసీలకూ వర్తిస్తుంది. కుటుంబంలోకి చిన్నారి రాకతోనే.. పిల్లల పాలసీని తీసుకోవడం ప్రారంభించాలి. వారు పెరుగుతున్న కొద్దీ.. పాలసీ కూడా మంచి ప్రతిఫలాన్ని అందిస్తుంది. విద్యా ద్రవ్యోల్బణం సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే.. రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి, దానికి అనుగుణంగా రాబడిని అందించేలా పాలసీలను ఎంచుకోవాలి.
కేవలం పిల్లల పాలసీని ఎంచుకోవడం ఒక్కటే సరైన ఆర్థిక రక్షణ కల్పించదు. తక్కువ ప్రీమియంతో లభించే టర్మ్‌ పాలసీనీ ఎంచుకోవడం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని