ప్రపంచానికి మరోసారి డ్రాగన్‌

చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి కంపెనీ ఎవర్‌గ్రాండ్‌సంక్షోభంలో పడడంతో.. మన స్టాక్‌ మార్కెట్‌లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. సంక్షోభం మరింత ముదిరితే భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకూ ఇబ్బందేనని విశ్లేషకులంటున్నారు.ఎవర్‌గ్రాండ్‌.. చైనాతో పాటు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తున్న

Updated : 21 Sep 2021 09:46 IST

 చైనాలో ముదురుతున్న ‘ఎవర్‌గ్రాండ్‌’ సంక్షోభం

భారత లోహ కంపెనీలపై ప్రభావం

ఐరోపా, వర్థమాన దేశాలకూ ఇబ్బందే

చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి కంపెనీ ఎవర్‌గ్రాండ్‌సంక్షోభంలో పడడంతో.. మన స్టాక్‌ మార్కెట్‌లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. సంక్షోభం మరింత ముదిరితే భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకూ ఇబ్బందేనని విశ్లేషకులంటున్నారు.

ఈనాడు వాణిజ్య విభాగం

ఎవర్‌గ్రాండ్‌.. చైనాతో పాటు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తున్న పేరిది. 1996లో ఏర్పాటైన ఈ కంపెనీ ఇపుడు సంక్షోభం అంచున ఉంది. ఎక్కువ భాగం రుణాలతో నడుస్తున్న ఈ స్థిరాస్తి కంపెనీకి 280 నగరాల్లో 1300కు పైగా ప్రాజెక్టులున్నాయి. విద్యుత్‌ వాహనాలు, ఇంటర్నెట్‌, మీడియా కంపెనీ, థీమ్‌ పార్కు, మినరల్‌ వాటర్‌, ఫుడ్‌ కంపెనీలూ ఉన్నాయి. చైనా స్థిరాస్తి విపణిలో 2% వాటా దీని సొంతం. ఈ కంపెనీకి గతేడాది ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడింది. మొత్తం 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉండగా, కంపెనీ తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. 2021 జనవరిలో చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఇబ్బందులు రావొచ్చని గతేడాది ఆగస్టులోనే కంపెనీ అంచనా వేసింది. మొత్తం 300 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22.50 లక్షల కోట్ల) అప్పులు సంస్థకు ఉండటంతో, తగ్గించుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. 2023 మధ్య కల్లా 100 బి.డా.(సుమారు రూ.7.50 లక్షల కోట్ల) రుణాలను తీర్చాలని భావిస్తోంది గానీ, అందుకు స్థిర ప్రణాళిక రూపొందలేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా 8 బిలియన్‌ డాలర్లనే సమీకరించింది.

ఎందుకీ ఆందోళన

ఈ ఏడాది చివరకు 669 మిలియన్‌ డాలర్లను వడ్డీ కిందే సంస్థ కట్టాల్సి ఉంది. వచ్చే మార్చికి 2 బిలియన్‌ డాలర్లు; ఏప్రిల్‌లో 1.45 బిలియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంది. స్టాక్‌ మార్కెట్ల ద్వారా సరైన సమయంలో నిధులను సమీకరించడం కూడా కంపెనీకి సవాలే.  చైనా ప్రభుత్వం కూడా సాయం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడినా, కాపాడకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.భయపడుతోంది. 

మొదలైందా ప్రభావం?

ఈనెల 23కు 83.5 మిలియన్‌ డాలర్ల వడ్డీని సైతం కట్టలేమని ఎవర్‌గ్రాండ్‌ ఇటీవల ప్రకటించడంతో మార్కెట్లు షాక్‌కు గురయ్యాయి. ఫలితంగా ముడి ఇనుము ధర గత వారం 22 శాతం క్షీణించి టన్ను 110.45 డాలర్లకు పరిమితమైంది. సంస్థ ఎగవేతదారుగా మారుతుందనే భయాలతో ఎవర్‌గ్రాండ్‌ షేర్లు సోమవారం హాంకాంగ్‌లో 19% మేర పడ్డాయి. ఈ ప్రభావం సోమవారం భారత స్టాక్‌ మార్కెట్లలో లోహ షేర్లపై పడింది. టాటా స్టీల్‌  9.53%; జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 9.13%, నేషనల్‌ అల్యూమినియం కంపెనీ 8.92%, సెయిల్‌ 8.20% మేర, ఎన్‌ఎండీసీ 7.70%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6.99%, హిందాల్కో   6.07%, వేదాంతా 4.99% నష్టపోయాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లూ భారీగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

 ఏం జరుగుతుంది?

ఎవర్‌గ్రాండ్‌ సంస్థ కుప్పకూలితే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరలు క్షీణిస్తాయి. చైనీయుల సంపదలో చాలా భాగం స్థిరాస్తి రంగంలోనే ఉండడం వల్ల వారి వ్యయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. చైనా ఆర్థికమందగమనానికి గురి కావొచ్చు.

 ఏ కంపెనీలకు ఇబ్బందంటే..

ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభం కారణంగా చైనా యువాన్‌ క్షీణిస్తే జౌళి, టైర్లు, రసాయనాల రంగాల్లోని భారత కంపెనీలకు చైనా కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చు. వర్థమాన మార్కెట్ల నుంచి వచ్చే పలు ఉత్పత్తులకు చైనాయే అతిపెద్ద కొనుగోలుదారు. రష్యా నుంచి ఇంధనం; తైవాన్‌ నుంచి సెమీ చిప్స్‌; బ్రెజిల్‌ నుంచి ఆహారం; కొరియా నుంచి యంత్ర పరికరాలు; సింగపూర్‌ నుంచి షిప్పింగ్‌ సేవలు; భారత్‌ నుంచి ముడి ఇనుమును అది కొంటోంది. చైనా కష్టాల్లో పడితే, వీటిపై ప్రభావం పడుతుంది. ఇవే కాదు.. ఐరోపాకు చెందిన విలాసవంత వస్తువుల తయారీ కంపెనీల ఆదాయంలో సగం చైనా నుంచే వస్తోంది. జర్మనీ ఎగుమతుల్లో 10 శాతం చైనాకే వెళ్తాయి. వీటికి కష్టాలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని