Mukesh Ambani: లండన్‌లో అంబానీ హరిత సౌధం

భారత్‌లోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ తన కుటుంబం కోసం మరో విశాల సౌధాన్ని బ్రిటన్‌లో సిద్ధం చేస్తున్నారని మిడ్‌డే వార్తా సంస్థ పేర్కొంది.

Published : 06 Nov 2021 06:56 IST

భారత్‌లోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ తన కుటుంబం కోసం మరో విశాల సౌధాన్ని బ్రిటన్‌లో సిద్ధం చేస్తున్నారని మిడ్‌డే వార్తా సంస్థ పేర్కొంది. లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ అంబానీకి రెండో సౌధం కానుందని  ఆ సంస్థ తెలిపింది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఆకాశహర్మ్యం ‘యాంటిలియా’లో ప్రస్తుతం అంబానీ కుటుంబం ఉంటోంది. ఈ ఏడాది మొదట్లో రూ.592 కోట్లతో కొనుగోలు చేసిన లండన్‌ ఆస్తిని, తమ అవసరాలకు అనుగుణంగా అంబానీలు మార్చుకుంటున్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది. ‘ద స్టోక్‌పార్క్‌’లో 49 పడక గదులతో పాటు అన్ని వసతులతో ప్రత్యేక ఆసుపత్రి ఉందని సమాచారం. ఈ దీపావళిని కొత్త ఇంట్లో జరుపుకోడానికి అంబానీలు వెళ్లారని పేర్కొంది. అయితే స్టోక్‌పార్క్‌ను ప్రీమియర్‌ గోల్ఫ్‌, క్రీడలకు వేదికగానే మారుస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ తెలిపింది. భారతీయ ఆతిథ్యాన్ని అంతర్జాతీయంగా చూపేందుకు ఈ ప్రాంగణాన్ని వినియోగించుకుంటామని తెలిపింది. ముకేశ్‌ అంబానీ తన నివాసాన్ని మార్చడం లేదని, ముంబయిలో మాత్రమే ఆయన ఉంటారని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని