ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా

పిల్లల చదువుల కోసం పెట్టుబడి.. తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించే విషయం ఇదే. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతుండటంతో.. ఎంత దాచినా.. ఖర్చులకు సరిపోని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మదుపు చేసినప్పుడు ద్రవ్యోల్బణాన్ని మించిన...

Updated : 12 Nov 2021 05:53 IST

పిల్లల చదువుల కోసం పెట్టుబడి.. తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించే విషయం ఇదే. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతుండటంతో.. ఎంత దాచినా.. ఖర్చులకు సరిపోని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మదుపు చేసినప్పుడు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని ఆర్జించినప్పుడే ఆర్థికంగా తట్టుకోగలం. ఇదే సమయంలో రాబడి హామీ ఉండే పథకాలను ఎంచుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. వీటిల్లో తక్కువ రాబడి రావడంతో.. అనుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టమవుతుంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? తెలుసుకుందాం...

విష్యత్‌ అవసరాల దృష్ట్యా.. పిల్లల పేరుమీద ఒక పథకంలో మదుపు చేస్తున్నారనుకుందాం.. రూ.20లక్షల పాలసీకోసం దీనికోసం ఏటా రూ.1లక్ష పెట్టుబడి పెడుతున్నారు. 20 ఏళ్లపాటు ఇలా చెల్లించాలి. పాలసీ తీసుకున్న తర్వాత 15, 16 ఏళ్లప్పుడు రూ.2లక్షల చొప్పున, 17, 18, 19, 20వ ఏట రూ.3లక్షల చొప్పున మనీ బ్యాక్‌ వస్తుందనుకుందాం. ఆ తర్వాత 21వ సంవత్సరం రూ.20 లక్షలతోపాటు, వర్తించే బోనస్‌ చెల్లిస్తుంది. పాలసీ వ్యవధి మధ్యలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. బీమా మొత్తం రూ.20 లక్షలు నామినీకి అందుతాయి. మొత్తంగా ఈ పాలసీవల్ల అన్ని దశల్లో మొత్తం రూ.36 లక్షల వరకూ ప్రయోజనం లభిస్తుంది. చూడ్డానికి బాగానే అనిపిస్తోంది కదా.. కానీ, వాస్తవ రాబడి ఎంత? భవిష్యత్తులో పిల్లల చదువుల ఖర్చులకు ఇది ఎంత మేరకు సరిపోతుంది?

ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం..

పైన పేర్కొన్నట్లుగానే.. 20 సంవత్సరాల పాటు.. ఏడాదికి రూ.1లక్ష పెట్టుబడి కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడిని పరిశీలిద్దాం.. ఇందుకోసం ఒక ఈక్విటీ ఫండ్‌ను చూద్దాం.. గత 2001 నుంచి ఈ నవంబరు 1 వరకూ అతి తక్కువ రాబడినిచ్చిన ఒక ఫండ్‌ ఇందుకోసం చూద్దాం.. వార్షిక సగటు రాబడి 12.75 శాతం ఈ ఫండ్‌ ద్వారా అందింది. ఇలాంటి ఫండ్‌ను ఎంచుకునే.. ఏటా రూ.1లక్ష చొప్పున మదుపు చేస్తూ వెళ్లారనుకుందాం. 15, 16వ ఏట రూ.2లక్షల చొప్పున, 17, 18, 19, 20వ ఏట రూ.3లక్షల చొప్పున వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ.. మీ దగ్గర రూ.64.54లక్షల నిధి ఉంటుంది. మీరు పైన ఉదహరించిన రాబడి హామీ పథకంతో పోలిస్తే.. ఇది దాదాపు 3 రెట్లు అధికం. ఒకవేళ ఫండ్‌ పనితీరు బాగుండి.. 20 శాతం రాబడిని ఆర్జిస్తే.. మొత్తం నిధి రూ.1.93 కోట్లకు చేరుతుంది. రాబడి హామీ పథకంలో వచ్చే సగటు రాబడి 6.1శాతానికి మించదు. ఇది ఈపీఎఫ్‌ కన్నా తక్కువ రాబడే.

సమస్య ఏమిటంటే..

ఆర్థిక లక్ష్య సాధనలో హామీతో కూడిన రాబడినిచ్చే పథకాలతో అంతగా ఉపయోగం ఉండదనే చెప్పాలి. పైన ఉదాహరణలే గమనిస్తే.. మనకు వచ్చే వడ్డీ రేటు 6.1శాతం ఉంటే.. విద్యా ద్రవ్యోల్బణం అంతకు మించి ఉండటం చూస్తూనే ఉన్నాం. 2007లో ఒక ప్రముఖ బిజినెస్‌ స్కూలులో ఎంబీఏ కోసం రూ.4లక్షలు వసూలు చేస్తే.. ఇప్పుడు ఆ ఫీజు రూ.27లక్షలు. అంటే.. ఈ 15 ఏళ్లలో ద్రవ్యోల్బణం 13.58శాతానికి పైమాటే. ఇదే విధంగా పెరిగితే.. మరో 15 ఏళ్లకు ఇది రూ.1.82కోట్లకు చేరుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ రాబడినిచ్చే పథకాలతో ఈ లక్ష్యాన్ని చేరడం కష్టసాధ్యమే. 15శాతం సగటు రాబడినిచ్చే మార్కెట్‌ ఆధారిత పథకాల్లో నెలకు రూ.27,000 మదుపు చేస్తూ వెళ్తే.. ఆ మొత్తాన్ని సమకూర్చుకోవడం తేలికే. కేవలం పెట్టుబడి పెట్టడమే కాదు.. దీన్ని ఎంత కాలం కొనసాగిస్తామన్నదీ ఇక్కడ ముఖ్యమే. పరోక్షంగా మార్కెట్‌లో మదుపు చేసేందుకు వీలు కల్పించే మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడంతోనే కలిసొస్తుందని గుర్తుంచుకోవాలి.

10 ఏళ్లకు మించి...

దీర్ఘకాలిక లక్ష్యాలైన.. పిల్లల చదువులు, పదవీ విరమణ అవసరాల కోసం మదుపు చేసేటప్పుడు.. ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు ఇలా వైవిధ్యమైన పథకాలను ఎంచుకోవాలి. ఎక్కడ మదుపు చేసినా.. 10 ఏళ్లకు మించి కొనసాగితేనే రెండంకెల రాబడి శాతాన్ని అందుకోగలరు.

ఆర్థిక రక్షణ తప్పనిసరి..

రాబడి హామీనిచ్చే పిల్లల పాలసీల్లో బీమా ఉండటం కలిసొచ్చే అంశమే. కానీ, ఆ బీమా ఏమాత్రం సరిపోదనేది గుర్తించాలి. మొదటి ఉదాహరణనే చూస్తే.. పాలసీదారుడికి ఏదైనా జరిగితే పరిహారం రూ.20లక్షలు వస్తుంది. కానీ, ఇది ఎందుకూ సరిపోదు. వార్షికాదాయానికి కనీసం 20 రెట్ల వరకూ బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది మీ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసాని కల్పిస్తుంది. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ ముఖ్యమే.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు