ఫ్రెషర్స్‌ కోసం పెరిగిన పోటీ

పేరున్న విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రముఖ ఐటీ సంస్థలు వీరిని నియమించుకునేందుకు ముందు వరుసలో ఉండేవి. విద్యార్థులూ వీటికే ప్రాధాన్యం ఇస్తుండేవారు.

Published : 28 Nov 2021 05:47 IST

 మధ్యస్థాయి ఐటీ కంపెనీల్లో నియామకాలు

నైపుణ్యాల శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు

అనుభవం ఉన్న వారినీ ఆకర్షించే ప్రయత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: పేరున్న విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రముఖ ఐటీ సంస్థలు వీరిని నియమించుకునేందుకు ముందు వరుసలో ఉండేవి. విద్యార్థులూ వీటికే ప్రాధాన్యం ఇస్తుండేవారు. ఇప్పుడు మధ్యస్థాయి ఐటీ సంస్థలూ ‘ఫ్రెషర్స్‌’ కోసం పోటీ పడుతున్నాయి. నియామకాల్లో తాజా ఉత్తీర్ణులకు ప్రాధాన్యమిస్తూ.. ఉద్యోగానికి అవసరమైన శిక్షణను తామే ఇస్తున్నాయి. ఈ సంస్థలు కూడా సంతృప్తికర వేతనాలు ఇస్తామంటున్నందున, ఫ్రెషర్స్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

కొవిడ్‌-19 పరిణామాలతో ఐటీ రంగం ఎంతో వేగంగా వృద్ధి చెందింది. కొత్తతరం సాంకేతికతలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ నైపుణ్యాలు కలిగిన వారికి  గిరాకీ పెరిగింది. అందువల్లే తమ ప్రాజెక్టులకు అవసరమైన నిపుణులను ఆకర్షించేందుకు, ఐటీ సంస్థలు అధిక వేతన పెంపు కల్పిస్తున్నాయి. ఫలితమే  సెప్టెంబరు త్రైమాసికంలో పెద్ద సంస్థల నుంచీ ఉద్యోగ వలసలు దాదాపు 20 శాతానికి చేరాయి. అందువల్ల కొత్త ఉద్యోగుల కోసం వెతకడం అన్ని కంపెనీలకు  తప్పనిసరి అవుతోంది.

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులతో..: కొవిడ్‌ తర్వాత అభివృద్ధి చెందిన దేశాల నుంచి మన దేశానికి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. కొన్ని విదేశీ సంస్థలు అక్కడి ఖాతాదార్ల నుంచి ప్రాజెక్ట్‌ తీసుకుని, మన కంపెనీలకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో అప్పగించేవారు. ఇప్పుడు పెద్ద సంస్థలతో పాటు, మధ్య, చిన్న స్థాయి దేశీయ ఐటీ సంస్థలు కూడా దీనికి అంగీకరించడం లేదు. నేరుగా ఖాతాదారు నుంచి ప్రాజెక్టు పొందేందుకే ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.

అనుభవజ్ఞులకు తోడుగా.. కొత్తవారు..

అనుభవం ఉన్న నిపుణులను బృంద నాయకుడిగా తీసుకుని, వారికింద పూర్తిగా కొత్త వారినే నియమిస్తూ.. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద సంస్థలు కాలేజీల నుంచి విద్యార్థులను ఉద్యోగంలోకి తీసుకుని, 3-6 నెలలపాటు తమకు కావాల్సిన విధంగా శిక్షణనిచ్చేవి. ఇప్పుడు మధ్యస్థాయి ఐటీ సంస్థలూ ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు ఉద్యోగం ఇచ్చేటప్పుడే సర్వీస్‌ అగ్రిమెంట్‌ తీసుకుంటున్నాయి. దీంతో శిక్షణ పూర్తయ్యాక కనీసం ఏడాదిపాటైనా సంస్థలో కొనసాగుతారనే నమ్మకమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ కోర్సులు చదివిన వారే కాకుండా.. ఇతర కోర్సులు అభ్యసించిన వారిని, బీఎస్‌సీ, బీకాం లాంటివి చదివిన వారికీ అవకాశం కల్పిస్తూ, కాస్త అనుభవం ఉన్న వారికి వీరిని సహాయకులుగా ఐటీ సంస్థలు నియమిస్తున్నాయి.

* టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలాంటి దిగ్గజాలు కలిసి లక్ష మంది ఫ్రెషర్లకు అవకాశం ఇస్తుంటే, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ ఇప్పటికే 6,500 మందికి పైగా  తీసుకున్నాయి. మధ్యస్థాయి ఐటీ సంస్థలు కూడా ప్రతి త్రైమాసికంలో కనీసం 1000 మంది ఫ్రెషర్లకు అవకాశం ఇస్తున్నాయి.

నాలుగోతరం నైపుణ్యాలుంటే..

కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌, లోకోడ్‌, నోకోడ్‌.. లాంటి నాలుగోతరం నైపుణ్యాలకు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంది. పరిశ్రమకు అవసరమైనదానికంటే.. దాదాపు 60శాతం తక్కువగానే నిపుణుల లభ్యత ఉంటోంది. అందువల్ల కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్న సంస్థలకూ ఆదరణ పెరుగుతోంది. కొత్తతరం సాంకేతికతతో సిద్ధం అయిన వారిని ప్రముఖ సంస్థలతో పాటు, అంకురాలూ అధిక జీతాలతో తీసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని