
పేటీఎం పెరిగిన నష్టాలు
త్రైమాసిక ఆదాయం రూ.1,086.4 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యునికేషన్స్ నష్టాలు ఇంకా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఈ సంస్థ రూ.473 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. చెల్లింపుల సేవల ఖర్చులు (పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు) పెరిగిపోవటం దీనికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఈ సంస్థ రూ.436.7 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం గమనార్హం. అదే సమయంలో ఈ రెండో త్రైమాసికానికి ఆదాయం మాత్రం 49.6 శాతం అధికంగా రూ.1,086.4 కోట్లు నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.663.9 కోట్లు ఉంది. టెక్నాలజీపై ఖర్చు పెంచినట్లు, అదే సమయంలో తమ సేవలు వినియోగించుకునే వ్యాపార సంస్థల (మర్చంట్స్) సంఖ్యను పెంచుకునే యత్నాల్లో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కంపెనీ మర్చంట్ బేస్ 1.85 కోట్ల నుంచి 2.3 కోట్లకు పెరిగింది.
ప్రస్తుత రెండో త్రైమాసికంలో చెల్లింపుల సేవల ఖర్చులు రూ.670 కోట్ల మేరకు నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఈ ఖర్చు రూ.492.4 కోట్లు మాత్రమే. ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు కూడా 35 శాతం పెరిగి రూ.386.5 కోట్లకు చేరుకున్నాయి. సాఫ్ట్వేర్, క్లౌడ్, డేటా సెంటర్ ఖర్చులు 56.5 శాతం అధికంగా రూ.112.9 కోట్లు అయ్యాయి. పేటీఎం నిర్వహించిన చెల్లింపుల మొత్తం (గ్రాస్ మర్చండైజ్ వాల్యూ) ఈ రెండో త్రైమాసికంలో రూ.1,95,600 కోట్లు ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఈ మొత్తం రూ.94,700 కోట్లు మాత్రమే. ఎంటీయూ (మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్) క్రితం ఏడాదితో పోల్చితే 33 శాతం వృద్ధితో 57 లక్షలకు చేరుకున్నట్లు పేటీఎం వివరించింది. ఈ రెండో త్రైమాసికంలో 28 లక్షల రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది.