పబ్లిక్‌ ఇష్యూల హంగామా

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా (బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌), జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా, డేటా పాటర్న్స్‌ (ఇండియా) లిమిటెడ్‌, మ్యాప్‌మై ఇండియా తదితర 10 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు

Updated : 30 Nov 2021 06:36 IST

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సహా 10 సంస్థలకు సెబీ అనుమతి

దిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా (బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌), జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా, డేటా పాటర్న్స్‌ (ఇండియా) లిమిటెడ్‌, మ్యాప్‌మై ఇండియా తదితర 10 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతిచ్చింది. ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌, ఇండియా1 పేమెంట్స్‌, హెల్తియమ్‌ మెడ్‌టెక్‌, వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌, మెట్రో బ్రాండ్స్‌, గోదావరి బయోరిఫైనరీస్‌ సంస్థలు కూడా ఐపీఓకు రాబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలన్నీ ఐపీఓకు అనుమతులు కోరుతూ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను ఆగస్టు, సెప్టెంబరులో దాఖలు చేశాయి. వీటి ప్రకారం..

* ఫ్రీడం బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయించే జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా, ఐపీఓ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించబోతోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో ఈ ఇష్యూ ఉండబోతోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు వాటాల్ని విక్రయించనున్నారు.

* రక్షణ, అంతరిక్ష రంగాలకు ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల్ని సరఫరా చేసే డేటా పాటర్న్స్‌ (ఇండియా) తాజా షేర్ల ఇష్యూ ద్వారా రూ.300 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో 60,70,675 ఈక్విటీ షేర్లను విక్రయించబోతోంది. మొత్తం రూ.600-700 కోట్ల మధ్య ఇష్యూ పరిమాణం ఉండబోతోంది.

మ్యాప్‌మై ఇండియా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు ఓఎఫ్‌ఎస్‌లో 75,47,959 ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరించనున్నారు.

* ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ ఓఎఫ్‌ఎస్‌ రూపంలో రూ.800 కోట్ల నిధుల్ని సేకరించాలనుకుంటోంది.

*  మెట్రో బ్రాండ్స్‌ తాజా షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది.  

* బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరిట మన్నికైన వినిమయ వస్తువుల విక్రయశాలలను నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనుంది. మూలధన అవసరాలు, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ వ్యవహారాలకు ఈ నిధులు వెచ్చిస్తామని కంపెనీ తెలిపింది.

* ఇండియా1 పేమెంట్స్‌ (గతంలో బీటీఐ పేమెంట్స్‌) తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా రూ.150 కోట్లు సమీకరించనుంది. అలాగే ఓఎఫ్‌ఎస్‌ రూపంలో 1,03,05,180 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు.

* హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.390 కోట్లు సమకూర్చుకోనుంది. అలాగే ఓఎఫ్‌ఎస్‌లో 3.91 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించబోతున్నారు.

* వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌ తాజా షేర్ల ఇష్యూ ద్వారా రూ.300 కోట్లు సేకరించనుండగా, 89.22 లక్షల ఈక్విటీ షేర్లను ఓఎఫ్‌ఎస్‌లో ప్రమోటర్లు తగ్గించకోనున్నారు.

* పాదరక్షల రిటైలర్‌ మెట్రో బ్రాండ్స్‌ తాజా షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో 2,19,00,100 ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.

* గోదావరి బయోరిఫైనరీస్‌ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.370 కోట్లు సేకరించనుంది. ప్రమోటర్లు, వాటాదార్లు ఓఎఫ్‌ఎస్‌లో 65,58,278 షేర్లను విక్రయించబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని