మళ్లీ  స్థిరాస్తి  వ్యాపారంలోకి  గోల్డ్‌మన్‌  శాక్స్‌!

అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లీ అడుగుపెట్టబోతోందని సమాచారం. రాబోయే మూడేళ్ళలో 2-3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15000-22,000 కోట్లు) పెట్టుబడి పెట్టాలన్నది సంస్థ ప్రణాళికగా తెలుస్తోంది. ఆసియాలో వచ్చే ఐదేళ్లలో ప్రత్యామ్నాయ

Published : 05 Dec 2021 02:33 IST

3 ఏళ్లలో రూ.22,000 కోట్ల పెట్టుబడి!

దిల్లీ: అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లీ అడుగుపెట్టబోతోందని సమాచారం. రాబోయే మూడేళ్ళలో 2-3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15000-22,000 కోట్లు) పెట్టుబడి పెట్టాలన్నది సంస్థ ప్రణాళికగా తెలుస్తోంది. ఆసియాలో వచ్చే ఐదేళ్లలో ప్రత్యామ్నాయ సాధనాల్లో 30 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.25 లక్షల కోట్లు)పెట్టుబడి పెట్టాలనే ప్రణాళికలో భాగంగా ఈ నిధులను వెచ్చించనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దశాబ్ద కాలంగా స్థిరాస్తి రంగం నెమ్మదించింది. ఇప్పుడు ఈ రంగం తిరిగి పుంజుకుంటున్నందునే, మళ్లీ భారత విపణిలోకి అడుగుపెట్టాలని గోల్డ్‌మన్‌ శాక్స్‌ భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. చైనా స్థిరాస్తి విపణిలోనూ గోల్డ్‌మన్‌ శాక్స్‌కు 2.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. భారత స్థిరాస్తి విపణిలోకి పునరాగమన వార్తలపై గోల్డ్‌మాన్‌ శాక్స్‌ నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. బ్లూమ్‌బర్గ్‌ వార్తా కథనం ప్రకారం.. భారత్‌, చైనా, దక్షిణ కొరియా విపణుల్లో తన ఉనికిని విస్తరించుకునే ఉద్దేశంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోల్డ్‌మన్‌ శాక్స్‌కు పోటీ సంస్థలైన కేకేఆర్‌, బ్లాక్‌స్టోన్‌లు భారత స్థిరాస్తి విపణిలో పెట్టుబడులను పెంచుతున్న సంగతి తెలిసిందే. ‘గత రెండేళ్లుగా గోల్డ్‌మాన్‌ శాక్స్‌ స్థిరాస్తి రంగంలో రుణ లావాదేవీలనే నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈక్విటీ, డెట్‌ రెండింటిపైనా దృష్టి పెట్టాలని అనుకుంటోంద’ని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య, నివాస స్థిరాస్తుల నిమిత్తం బెంగళూరులో ఇద్దరు, ముంబయిలో ఒక డెవలపర్‌తో గోల్డ్‌మన్‌ శాక్స్‌ చర్చలు జరుపుతోందని తెలిపాయి. భారత్‌లో స్థిరాస్తి పెట్టుబడుల బాధ్యతల నిర్వహణ నిమిత్తం యూకే పీఈ పంఢ్‌ యాక్టిస్‌కు చెందిన ముకేశ్‌ తివారీని నియమించుకుందని సమాచారం.
* భారత్‌లో డేటా కేంద్రాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని గోల్డ్‌మన్‌ శాక్స్‌ యోచిస్తోందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని