40,000 ప్రాంగణ ఎంపికలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000-22,000 మందిని కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకుంటున్న ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40,000 మందిని నియమించుకుంటామని ప్రకటించింది.
2022-23లో చేస్తాం:హెచ్సీఎల్ టెక్
రూ.10 డివిడెండు ప్రకటన
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000-22,000 మందిని కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకుంటున్న ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40,000 మందిని నియమించుకుంటామని ప్రకటించింది. విజయవాడ, మదురై వంటి పట్టణాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామని మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ నికర లాభం రూ.3,442 కోట్లకు తగ్గింది. 2020-21 ఇదే కాల లాభం(యూఎస్ జీఏఏపీ లెక్కల ప్రకారం) రూ.3,982 కోట్ల కంటే ఇది 13.6 శాతం తక్కువ ఇదే సమయంలో ఆదాయం రూ.19,302 కోట్ల నుంచి 15.7 శాతం వృద్ధితో రూ.22,331 కోట్లకు చేరుకుంది. ‘పండుగల కారణంగా ఉద్యోగులు సెలవులు ఎక్కువగా పెట్టడం; వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి తోడు వలసల వ్యయాల కారణంగా డిసెంబరు త్రైమాసికంలో లాభం తగ్గింద’ని కంపెనీ తెలిపింది.సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 5.4 శాతం, ఆదాయం 8.1 శాతం పెరిగాయి.
అన్ని విభాగాల్లోనూ రాణించాం
బలమైన గిరాకీ వాతావారణం కారణంగా ఆర్డర్లు మరింత పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అందుకే 2021-22 ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలను రెండంకెల్లోనే కొనసాగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. డిసెంబరు త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.10 డివిడెండును ప్రకటించింది. ‘మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. ఆదాయ వృద్ధీ బాగుంద’ని కంపెనీ సీఈఓ, ఎండీ సి. విజయ్కుమార్ అన్నారు. ‘స్థిర కరెన్సీల్లో ఆదాయ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. ఇది 46 త్రైమాసికాల్లోనే అత్యధికం. కొత్త ఒప్పందాల మొత్తం కాంట్రాక్ట్ విలువ(టీసీవీ) 64 శాతం వృద్ధితో 2135 మిలియన్ డాలర్లకు చేరుకుంద’ని ఆయన పేర్కొన్నారు.
కార్యాలయాలకు వస్తోంది 3% మందే
డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నికరంగా 10,143 మందిని నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,97,777కు చేరింది. ఐటీ సేవల్లో వలసల రేటు 19.8 శాతంగా నమోదైంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000-22,000 మందికి పైగా ప్రాంగణ నియామకాల్లో తీసుకోవాలన్నది లక్ష్యం. జనవరి 10 నాటికి 17,500 మందిని నియమించుకున్నామ’ని సీఈఓ తెలిపారు. ‘అమెరికాలో వచ్చే 2-3 ఏళ్లలో 2000 మందికి పైగా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటాం. వియత్నాం, శ్రీలంక, కోస్టారికా, రొమేనియాల్లో మరింత విస్తరిస్తాం’ అన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో రెట్టింపు (40,000) నియామకాలు చేపడతామ’ని కంపెనీ ముఖ్య మానవ వనరుల అధికారి అప్పారావు వి.వి. పేర్కొన్నారు. వలసలను తగ్గించడానికి స్టాక్ఆప్షన్లు, వేతన పెంపులనూ చేపడతామన్నారు. వచ్చే 4-5 ఏళ్లలో ఉన్నత స్థాయి పదవుల కోసం ఇప్పటికే 600 మందిని గుర్తించామని అన్నారు. ప్రస్తుతం 3 శాతం మంది సిబ్బంది కార్యాలయాలకు వస్తున్నారని, కొన్ని త్రైమాసికాల పాటు భౌతిక హాజరు తక్కువగానే ఉంటుందని వివరించారు.
బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా పెరిగి రూ.1337.55 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు