కొవిడ్‌ వచ్చిందా..కొత్తపాలసీ ఆలస్యమే

కరోనా సోకిన వారు, కొత్త బీమా పాలసీలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. కొవిడ్‌ నుంచి కోలుకుని, నెగిటివ్‌గా తేలిన తర్వాత కనీసం మూడు నెలల తర్వాతే వారు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న పాలసీల

Published : 15 Jan 2022 01:42 IST

3 నెలల వరకు ఇవ్వని బీమా సంస్థలు

రీ ఇన్సూరెన్స్‌ సంస్థల సూచనలే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా సోకిన వారు, కొత్త బీమా పాలసీలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. కొవిడ్‌ నుంచి కోలుకుని, నెగిటివ్‌గా తేలిన తర్వాత కనీసం మూడు నెలల తర్వాతే వారు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న పాలసీల దరఖాస్తులను బీమా సంస్థలు ఆమోదిస్తున్నాయి. ఇప్పటివరకు ‘కొన్ని నిర్ణీత వ్యాధుల నుంచి కోలుకున్న వారికి (గుండెజబ్బులు, మూత్రపిండ వ్యాధులు, లివర్‌ సిరోసిస్‌ లాంటివి)’ కొత్త పాలసీలు ఇవ్వాలంటే ‘వేచి ఉండే వ్యవధి’ ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే అమలవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కొవిడ్‌-19 సైతం చేరింది. పైగా జీవిత బీమా సంస్థలూ దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. టర్మ్‌ పాలసీలు జారీచేసేందుకు కూడా కొవిడ్‌ తగ్గిన 90 రోజుల వరకు వేచిచూస్తున్నాయి.

రెండేళ్లుగా కరోనా ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసింది.  ఎన్నో కుటుంబాలు తమ ఆర్జన శక్తిని కోల్పోయాయి. ఈ సమయంలో ఎంతోమందికి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కొంత మేరకు ఆర్థిక రక్షణ కల్పించాయి. 2020-21 సంవత్సరాల్లో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న వారి సంఖ్యా భారీగా పెరిగింది. చాలామంది తమ పాలసీల విలువను పెంచుకున్నారు. అయితే, క్లెయింల సంఖ్య పెరగడంతో బీమా సంస్థలు కొత్త పాలసీల జారీలో పలు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి.

ప్రీమియం పెంపు

జీవిత బీమా సంస్థలు ఇప్పటికే టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని 15-30 శాతం వరకు పెంచాయి. సాధారణంగా బీమా కంపెనీలు రూ.20 లక్షలకు మించిన పాలసీలను రీఇన్సూరెన్స్‌ చేయిస్తాయి. క్లెయింల సంఖ్య పెరగడంతో రీ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఒక్కసారిగా ప్రీమియాన్ని పెంచాయి. ఈ భారాన్ని దేశీయ బీమా సంస్థలు పాలసీదారులకు మళ్లించాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు మరికొన్ని బీమా సంస్థలు ఇప్పటికే ప్రీమియాన్ని పెంచాయి. ఎక్కువమంది పాలసీలు తీసుకునే ఫిబ్రవరి, మార్చిలో ప్రీమియాన్ని పెంచేందుకు చాలా బీమా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు మరణాల రేటు తక్కువగా ఉండటంతో బీమా సంస్థలు పూర్తి రక్షణకు పరిమితమైన టర్మ్‌ పాలసీలను తక్కువ ప్రీమియానికే అందించేవి. ఎక్కువమందికి పాలసీలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవి పనిచేసేవి. కానీ, కొవిడ్‌ ఈ పరిస్థితులను మార్చేసింది.

కఠిన నిబంధనలు..

జీవిత బీమా పాలసీల్లో ముఖ్యంగా టర్మ్‌ పాలసీలను అందించేందుకు బీమా సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. పాలసీల అండర్‌ రైటింగ్‌లను మారుస్తున్నాయి. టర్మ్‌ పాలసీలు తీసుకునేందుకు డిగ్రీని కనీస విద్యార్హతగా చేయాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నిర్ణీత ఆదాయ పరిమితి దాటితేనే పాలసీ ఇవ్వాలని భావిస్తున్నాయి.

ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే..

కొవిడ్‌ బారినపడి కోలుకున్న తరవాతా, చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉంటున్నాయి. అందుకే బీమా సంస్థలు కొవిడ్‌ నుంచి కోలుకున్నాక, కనీసం 90 రోజుల వరకు వేచి చూశాకే కొత్త పాలసీని జారీ చేయాలని భావిస్తున్నాయని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసమే కొత్తగా పాలసీ తీసుకునే వారికి కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టును కోరుతున్నాయి. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరిగా అడుగుతున్నారు.

పునరుద్ధరణ ఆలస్యమైతే..

గతంలో పాలసీల జారీకి ఫోన్‌లోనే ఆరోగ్య సమాచారం తీసుకుని, దాని ప్రకారం జారీ చేసేవారు. పాలసీదారుడు పేర్కొన్న సమాచారానికి విశ్వసనీయత ఉండేది. కానీ, ఇప్పుడు వైద్య పరీక్షలు తప్పనిసరి అని సంస్థలు పేర్కొంటున్నాయి. నిర్ణీత వ్యవధిలోపు పాలసీ రెన్యూవల్‌ ఆలస్యమైనా.. ఇబ్బంది పెట్టేవి కావు. ఇప్పుడు ఈ విషయంలో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఆరోగ్య పరీక్షలు అవసరం అని చెబుతున్నాయి. బీమా సంస్థల విచక్షణ మేరకే పాలసీలను పునరుద్ధరిస్తున్నాయి. పాత పాలసీని రద్దు చేసుకుని, కొత్త పాలసీలను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని