రిలయన్స్‌ లాభం రూ.18,549 కోట్లు

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి రికార్డు ఫలితాలను ఆర్‌ఐఎల్‌ నమోదుచేసిందని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వ్యాపార విభాగాలు రాణించడం వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్‌ వృద్ధికి ఉపకరించేలా అన్ని వ్యాపార విభాగాల్లో

Updated : 22 Jan 2022 15:55 IST

అక్టోబరు-డిసెంబరులో 41% వృద్ధి

52% పెరిగిన ఆదాయం

జియో, రిటైల్‌ వ్యాపారాల నుంచే రూ.75,000 కోట్లు

చమురు రిఫైనింగ్‌, రసాయనాల విభాగాలూ రాణించాయ్‌

రుణ రహిత స్థితి నుంచి తిరిగి నికర అప్పుల్లోకి సంస్థ

‘‘అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి రికార్డు ఫలితాలను ఆర్‌ఐఎల్‌ నమోదుచేసిందని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వ్యాపార విభాగాలు రాణించడం వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్‌ వృద్ధికి ఉపకరించేలా అన్ని వ్యాపార విభాగాల్లో వ్యూహాత్మక కొనుగోళ్లు, భాగస్వామ్యాలపై దృష్టి పెట్టాం. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపునకు తోడు పండగ సీజను నేపథ్యంలో రిటైల్‌ వ్యాపారం బలమైన వృద్ధితో సాధారణ స్థితికి చేరుకుంది. చందాదార్ల సంఖ్య, డేటా వినియోగంలో వృద్ధితో డిజిటల్‌ సేవల విభాగ లాభదాయకతలో స్థిర వృద్ధి నమోదైంది. అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు పుంజుకోవడం వల్ల ఇంధన మార్జిన్లు పెరిగాయి. చమురు- గ్యాస్‌ విభాగాలు అత్యధిక ఎబిటా నమోదు చేశాయి. 2035 కల్లా కర్బన రహిత స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధించే దిశలో ముందుకు వెళ్తున్నాం’’

- ముకేశ్‌ అంబానీ, ఛైర్మన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అక్టోబరు-డిసెంబరు  త్రైమాసికానికి అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.18,549 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.13,101 కోట్లతో పోలిస్తే ఈసారి 41% శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 52.2% పెరిగి   రూ.2,09,823 కోట్లకు చేరింది. టెలికాం విభాగంలో సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) అధికంగా నమోదు కావడం, రిటైల్‌ వ్యాపారం గిరాకీ పుంజుకోవడం ఆర్‌ఐఎల్‌ లాభాల్లో వృద్ధికి తోడ్పడింది.

చమురు- రసాయనాలు

* త్రైమాసిక ప్రాతిపదికన చమురు- రసాయనాల విభాగ నిర్వహణ లాభం వరుసగా ఆరో త్రైమాసికంలోనూ పెరిగింది. ఈ విభాగ ఎబిటా జులై-సెప్టెంబరుతో పోలిస్తే 6.3 శాతం పెరిగి రూ.13,530 కోట్లకు చేరింది. ఏడాది క్రితంతో పోల్చినా 38.7 శాతం వృద్ధి ఉంది. ఆదాయం 56.8 శాతం వృద్ధితో రూ.1,31,427 కోట్లకు చేరింది.

* కేజీ-డీ6 నిక్షేపంలోని కొత్త క్షేత్రాల నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడంతో మొత్తం ఉత్పత్తి రోజుకు 18 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లకు చేరింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌

* అక్టోబరు-డిసెంబరులో నికర లాభం 8.8% పెరిగి రూ.3,795 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే కాలంలో ఇది రూ.3,486 కోట్లుగా ఉంది. స్థూల ఆదాయం రూ.22,858 కోట్ల నుంచి రూ.24,176 కోట్లకు చేరింది.

డిజిటల్‌ సేవల విభాగం ఎబిటా తొలిసారి రూ.10,000 కోట్ల మైలురాయిని అందుకుంది.

* జియో ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన టెలికాం సేవల సంస్థ రిలయన్స్‌ జియో నికర లాభం 9.8 శాతం పెరిగి రూ.3,615 కోట్లకు చేరింది. ఆదాయం4.62 శాతం వృద్ధితో రూ.19,347 కోట్లకు పెరిగింది.

* ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన రూ.151.60గా ఉంది. 2020-21 అక్టోబరు-డిసెంబరులో ఇది రూ.151గా నమోదైంది.

* మొత్తం డేటా వినియోగం 23.4 బిలియన్‌ గిగాబైట్లుగా ఉంది. ఏడాదిక్రితంతో పోలిస్తే 47.8 శాతం పెరిగింది.

* మొత్తం చందాదార్ల సంఖ్య 42.1 కోట్లకు చేరింది.

రిలయన్స్‌ రిటైల్‌

* ఏకీకృత నికర లాభం ఏడాది వ్యవధిలో రూ.2,312 కోట్ల నుంచి 23.81 శాతం వృద్ధితో రూ.3,822 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 53.41% పెరిగి రూ.50,654 కోట్లుగా నమోదైంది. ఆదాయం తొలిసారి రూ.50,000 కోట్లను అధిగమించడం విశేషం. స్థూల ఆదాయం రూ.37,845 కోట్ల నుంచి 52.5 శాతం పెరిగి రూ.57,714 కోట్లకు చేరింది.  

సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 837 విక్రయ కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. తద్వారా మొత్తం విక్రయ కేంద్రాల సంఖ్య 14,412కు చేరింది.

* ఆర్‌ఐఎల్‌ మొత్తం ఆదాయంలో వినియోగ ఆధారిత విభాగాలైన జియో ప్లాట్‌ఫామ్స్‌, రిటైల్‌ నుంచే రూ.75,0000 కోట్ల ఆదాయం వచ్చింది.

* కొన్ని త్రైమాసికాలుగా రుణ రహిత సంస్థగా ఉన్న రిలయన్స్‌.. టెలికాం స్పెక్ట్రమ్‌ చెల్లింపుల వల్ల మళ్లీ నికరంగా అప్పుల్లోకి వచ్చింది. 2021 డిసెంబరు 31 నాటికి ఈ  సంస్థ రుణాలు రూ.2,44,708 కోట్లుగా ఉన్నాయి. నగదు, నగదు సమాన నిల్వలు   రూ.2,41,846 కోట్లుగా ఉన్నాయి.  

* సమీక్షా త్రైమాసికంలో మూలధన వ్యయాలు రూ.27,582 కోట్లుగా నమోదయ్యాయి.

బీఎస్‌ఈలో  షేరు శుక్రవారం 0.03%నష్టపోయి రూ.2,478.10 వద్ద ముగిసింది.ఫలితాలు ట్రేడింగ్‌ అనంతరం వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని