
ఎల్ఐసీ లాభం రూ.1,437 కోట్లు
ముంబయి: ఐపీఓకు రాబోతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలానికి (ఏప్రిల్-సెప్టెంబరు) రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.6.14 కోట్లు మాత్రమే. కొత్త వ్యాపార ప్రీమియం వృద్ధి రేటు 394.76 శాతం నుంచి 554.1 శాతానికి చేరింది. మొత్తం నికర ప్రీమియం రూ.1.84 లక్షల కోట్ల నుంచి రూ.1,679 కోట్లు పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియం- పెట్టుబడులపై ఆదాయం రూ.17,404 కోట్లు పెరిగి రూ.3.35 లక్షల కోట్లుగా నమోదైంది. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.15,726 కోట్ల మేర పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరింది. వడ్డీ, డివిడెండ్లు, అద్దెల ద్వారా వచ్చిన ఆదాయం రూ.10,178 కోట్లకు చేరింది. పెట్టుబడుల విక్రయాలు/రిడెంమ్షన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.10,965 కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ వాటా మూలధనం రూ.6,325 కోట్లకు చేరింది.
* వ్యక్తిగత జీవిత (నాన్-లింక్డ్) ప్రీమియాలు రూ.7,262 కోట్లు పెరిగి రూ.1.13 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత పింఛన్ (నాన్-లింక్డ్) ప్రీమియాలు రూ.4,432 కోట్లు పెరిగి రూ.5,636 కోట్లకు చేరాయి. బృంద (నాన్-లింక్డ్) ప్రీమియాలు రూ.90 కోట్లు పెరిగి రూ.66,295 కోట్లకు చేరాయి. వ్యక్తిగత జీవిత (లింక్డ్) మొత్తం ప్రీమియం రూ.737.08 కోట్లు పెరిగి రూ.1,085 కోట్లకు చేరింది. పాలసీదారుల పెట్టుబడులు రూ.5.9 లక్షల కోట్లు పెరిగి రూ.37.72 లక్షల కోట్లకు చేరాయి. వాటాదార్ల పెట్టుబడులు రూ.56.17 కోట్లు పెరిగి రూ.6,311 కోట్లకు చేరాయి. 2021 ఏప్రిల్-సెప్టెంబరులో నిలకడ నిష్పత్తి (ప్రీమియం ఆధారంగా) 78.18 శాతం, సాల్వెన్సీ నిష్పత్తి 183.37 శాతంగా నమోదయ్యాయి.