ఈ ఏడాదీ పర్యావరణహిత బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్ కూడా పర్యావరణ హితంగానే ఉండనుంది. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక వివరాలు ఉండే బడ్జెట్ ప్రతుల ముద్రణను
డిజిటల్ రూపంలోనే అధిక శాతం పత్రాలు
దిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్ కూడా పర్యావరణ హితంగానే ఉండనుంది. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక వివరాలు ఉండే బడ్జెట్ ప్రతుల ముద్రణను భారీగా తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం బడ్జెట్ పత్రాలు డిజిటల్ రూపంలోనే లభిస్తాయని, భౌతిక ప్రతులను కొన్ని మాత్రమే ముద్రించనున్నట్లు వెల్లడించారు. వందల సంఖ్యలో బడ్జెట్ పత్రాల ముద్రణ భారీ ప్రక్రియగా ఉండేది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే అందులోని ప్రతిపాదనలు వెలుగుచూడకూడదు కనుక, ఆర్థిక శాఖ ఉండే నార్త్బ్లాక్ బేస్మెంట్లోని ముద్రణాలయ సిబ్బంది రెండు వారాల పాటు బాహ్య ప్రపంచంలోకి రాకుండా పనిచేసేవారు. ఆర్థిక మంత్రి, సహాయ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యే సంప్రదాయ హల్వా వేడుక నుంచి బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ మొదలయ్యేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ప్రతుల ముద్రణను తగ్గిస్తూ వచ్చింది. తొలుత విలేకరులు, ఇతర విశ్లేషకులకు భౌతిక ప్రతులు ఇవ్వడం తగ్గించారు. కరోనా సంక్షోభం మొదలయ్యాక లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కూడా ఇవ్వడం తగ్గించారు. ప్రస్తుతం కొవిడ్ ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నందున, మరిన్ని ఆంక్షలను విధించారు. సంప్రదాయ హల్వా వేడుకను సైతం నిర్వహించలేదు. డిజిటల్ రూపంలో బడ్జెట్ పత్రాల కూర్పు కోసం, కొంతమంది సిబ్బందిని తప్పనిసరి క్వారంటైన్లో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.