తక్కువ ప్రతిఫలంతో స్థిరాస్తి అభివృద్ధిదార్లకు ఇక్కట్లు
బ్లూచిప్ స్టాక్లతో పోలిస్తే స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా వెల్లడించారు.
స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల్ని నమోదు చేయొద్దు
ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా
ముంబయి: బ్లూచిప్ స్టాక్లతో పోలిస్తే స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా వెల్లడించారు. అందుకే ఆయా కంపెనీలను స్టాక్ మార్కెట్లో నమోదు చేయొద్దని సూచించారు. అందుబాటు ధరల్లో లభ్యమయ్యే గృహాల అభివృద్ధిదార్లు మాత్రమే తాము విక్రయించే పరిమాణం ఆధారంగా స్టాక్మార్కెట్లో లిస్టింగ్కు ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్), డీఎల్ఎఫ్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం గమనించొచ్చని తెలిపారు. డీఎల్ఎఫ్ షేరు రూ.1,300 నుంచి రూ.80కి పడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ రంగంలో నష్టభయాన్ని ఉదహరించారు. ‘ఒకవేళ నేనే గనుక డెవలపర్ అయితే నా సంస్థను స్టాక్మార్కెట్లో నమోదు చేయను. ఎందుకంటే ఇది అంత ఆకర్షణీయ వ్యాపారం కాద’ని సీఐఐ నిర్వహించిన స్థిరాస్తి సదస్సులో రాకేశ్ వివరించారు. బ్లూచిప్ స్టాక్లు పెట్టుబడిపై 18-25 శాతం ప్రతిఫలం అందిస్తుండగా, స్థిరాస్తి రంగంలో 6-7 శాతమే రాబడి ఉంటోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్) అసెట్ క్లాస్పై మదుపర్లు బుల్లిష్గా ఉన్నారని, ఐటీ సేవలు, ఫార్మా రంగాల మాదిరి ఈ విభాగం కూడా రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
* 2006లో ఇంటి కొనుగోలు కోసం రాకేశ్ తన పోర్ట్ఫోలియోలోని క్రిసిల్ షేర్లను రూ.20 కోట్లకు విక్రయించారు. అప్పట్లో వాటిని విక్రయించకుండా అలాగే ఉంచుకునుంటే, ఇప్పుడు వాటి విలువ రూ.1,000 కోట్లు ఉండేదట.
* టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్తో తాను జరిపిన సంభాషణను కూడా రాకేశ్ వివరించారు. ఆకాశ ఎయిర్తో విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న తాను రూ.275 కోట్లు పెట్టుబడి పెట్టగా, నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను రూ.18,000 కోట్లు చెల్లించి ఎలా కొనుగోలు చేశారని చంద్రశేఖరన్ను అడిగానని రాకేశ్ తెలిపారు.
షేర్మార్కెట్లో మహారాజు ఉండరు
స్టాక్ మార్కెట్కు రాజంటూ ఎవరూ ఉండరని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా వ్యాఖ్యానించారు. అలా అనుకున్నవారంతా ఆర్థర్ జైలుకు (ముంబయి కేంద్ర కారాగారం) వెళ్లారని అన్నారు. రాజు ఒకడే అని.. అది మార్కెట్టే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘భారత్కు సమయం రాబోవడం లేదు.. వచ్చేసింది.’ అంటూ ప్రధానికి ఒక ప్రెజెంటేషన్ను ఆయన సమర్పించారు. గురువారమిక్కడ జరిగిన సీఐఐ రియల్ ఎస్టేట్ కాన్ఫ్లూయెన్స్ 2022, 4వ ఎడిషన్లో ఆయన ఏమన్నారంటే..
‘వాతావరణం, మరణం, మార్కెట్, మహిళ.. వీటిని ఎవరూ అంచనా వేయలేరు. మార్కెట్ కూడా మహిళలాంటిదే. ఎపుడూ మనల్ని నిర్దేశిస్తుంది. అనిశ్చితి, ఊగిసలాటకు గురి అవుతుంది. నువ్వెపుడూ ఒక మహిళపై అజమాయిషీ చేయలేవు. అలాగే మార్కెట్పై కూడా మనం పైచేయి సాధించలేం.
2025-26 కల్లా భారత జీడీపీ 10 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. దేశంలో సులువుగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఒక ప్లాట్ఫాం అవసరం. వచ్చే అయిదేళ్లలో ఐటీ పరిశ్రమ మరో 50 లక్షల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవచ్చు. 50 లక్షల ఇళ్లకు కొత్తగా గిరాకీ ఉండొచ్చు. చైనా పట్టణీకరణతో పోలిస్తే భారత్ పట్టణీకరణ 45 శాతంగా ఉంది. ఇళ్లకు గిరాకీ మరింత పెరగాల్సి ఉంది. వాణిజ్య స్థిరాస్తిపై చాలా ‘బులిష్’గా ఉన్నాను. స్థిరాస్తి కంపెనీల కంటే ఆర్ఈఐటీ లిస్టింగ్ను నేను ఇష్టపడతాను. అది చాలా పెద్ద ఆస్తి. నేను తప్పు అంచనాలు వేయొచ్చు. అయితే భారత్లో ఏం జరుగుతోందో ప్రజలు చూడకుండా ఉండరు. విమానయాన పరిశ్రమ భవిష్యత్లో రాణిస్తుంది. అయితే టికెట్ ధరల విషయంలో మరింత మెరుగుపడాల్సి ఉంది.
ఇళ్లకు గిరాకీ కొనసాగుతుంది: దీపక్ పరేఖ్
భారత స్థిరాస్తి విపణి పురోగమన దిశగా వెళుతోందని, నివాస గృహాలకు గిరాకీ పెరుగుతుందని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ వెల్లడించారు. చాలా వరకు పశ్చిమ దేశాల్లో ధరలు పెరుగుతాయని అంచనాలతో ఇళ్లను కొనుగోలు చేస్తుంటారని, భారత్లో మాత్రం అవసరం కోసం ఇళ్ల కొనుగోలుదార్లతోనే గిరాకీ ఉంటోందని పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన స్థిరాస్తి సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కొత్త స్థిరాస్తి ప్రాజెక్టులు కొవిడ్ పూర్వ స్థాయిని అధిగమించడం ఈ రంగంపై విశ్వాసాన్ని పెంచుతోంది. కొత్తగా ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేసే వారితో పాటు చిన్న గృహాల నుంచి పెద్ద గృహాలకు మారేవారు, ప్రస్తుతం ఉన్న చోటు నుంచి ఇతర ప్రాంతాలకు మారేందుకు ఇళ్లు కొనుగోలు చేసే వారు అధికంగా ఉంటున్నారు. దేశంలో ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యమవుతున్నాయి. నా 50 ఏళ్ల వృత్తి జీవితంలో తొలిసారిగా ఈ పరిస్థితి చూస్తున్నాను. అలాగే నగదు లభ్యత కూడా విరివిగా ఉంది. తక్కువ రేట్లకే గృహ రుణాలు లభ్యమవడం కలిసొస్తోంది. ఇంటికి యజమాని కావాలనే బలమైన కోరిక గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు చూస్తున్నాన’ని దీపక్ వివరించారు.
* కొన్ని మెట్రో నగరాలను మినహాయిస్తే, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య అందుబాటు ధరలో గృహాలు లభ్యమవుతున్నాయని, ఈ విభాగానికి గిరాకీ స్థిరంగా కొనసాగుతోందని దీపక్ తెలిపారు.
* త్వరలోనే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నా, స్వల్పంగానే ఉంటాయని దాంతో గృహ రుణాలకు గిరాకీ తగ్గే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్