2023 24 కల్లా దేశీయ తయారీ చిప్‌లు

2023-24 కల్లా దేశీయంగా తయారైన తొలి చిప్‌ సెట్‌ల (సెమీ కండక్టర్లు) వాణిజ్య విక్రయాలు ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బుధవారం శ్రీకారం చుట్టిన డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ- వి (డీఐఆర్‌-వి) కార్యక్రమం

Published : 28 Apr 2022 02:17 IST

లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం

దిల్లీ: 2023-24 కల్లా దేశీయంగా తయారైన తొలి చిప్‌ సెట్‌ల (సెమీ కండక్టర్లు) వాణిజ్య విక్రయాలు ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బుధవారం శ్రీకారం చుట్టిన డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ- వి (డీఐఆర్‌-వి) కార్యక్రమం కింద దీనిని చేపట్టనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. దేశంలో మొబిలిటీ, కంప్యూటింగ్‌, డిజిటలీకరణ అవసరాలను తీర్చేందుకు కావాల్సిన భవిష్యతరం మైక్రోప్రాసెసర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ‘2023 డిసెంబరు కల్లా లేదంటే 2024 ప్రారంభంలో శక్తి, వేగా సిలికాన్‌ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవాలనే ఓ కీలక లక్ష్యంపై దృష్టి పెట్టామ’ని ఆయన అన్నారు. 2023-24 లోగా కనీసం కొన్ని కంపెనీలైనా వాటి ప్రోడక్ట్‌ డిజైన్‌లకు డీఐఆర్‌ ఉత్పత్తులైన శక్తి, వేగాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు. సిలికాన్‌ సిద్ధమైతే.. అవి తయారీ ప్రారంభించి, ఉత్పత్తుల్లో చిప్‌లను అమరుస్తాయని విలేకరులకు చంద్రశేఖర్‌ చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖలోని మైక్రోప్రాసెసర్‌ డెవలప్‌ ప్రోగ్రామ్‌ కింద ఓపెన్‌ సోర్స్‌ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి ఐఐటీ మద్రాస్‌, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కంప్యూటింగ్‌ (సీడీఏసీ)లు వరుసగా శక్తి (32 బిట్‌), వేగా (64 బిట్‌) పేరుతో రెండు మైక్రోప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. డీఐఆర్‌ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటిని ప్రధాన ఆర్కిటెక్ట్‌గా, సీడీఏసీ త్రివేండ్రం శాస్త్రవేత్త కృష్ణకుమార్‌ రావును ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా ప్రభుత్వం నియమించింది. దేశంలో సెమీకండక్టర్‌ తయారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ.76,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా డీఐఆర్‌- వి ని రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని