ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగుతేజం

కరోనా తొలినాళ్ల నుంచి ఆసియా-పసిఫిక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్రాంత యువత మాత్రం కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే సొంత వ్యాపారాలను పెట్టి, సవాళ్లను ఎదుర్కొని మరీ గెలిచి చూపించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘30 అండర్‌  30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితా ఆ విషయాన్నే వెల్లడిస్తోంది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్‌

Updated : 27 May 2022 10:19 IST

‘30 అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’లో జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌

కరోనా తొలినాళ్ల నుంచి ఆసియా-పసిఫిక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ ప్రాంత యువత మాత్రం కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే సొంత వ్యాపారాలను పెట్టి, సవాళ్లను ఎదుర్కొని మరీ గెలిచి చూపించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘30 అండర్‌  30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితా ఆ విషయాన్నే వెల్లడిస్తోంది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్‌ నిర్వచిస్తున్నట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. ‘ఈ జాబితా కోసం 4,000కు పైగా నామినేషన్లు ఈ ఏడాది వచ్చాయి. చివరకు ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేశాం. ఒలింపిక్స్‌లో విజేతల నుంచి అంకురాల వ్యవస్థాపకుల వరకు ఇందులో చోటు చేసుకున్నార’ని ఫోర్బ్స్‌ తెలిపింది.
భారతే నంబర్‌ వన్‌: తుది జాబితాలో మొత్తం 22 దేశాల వారు చోటు దక్కించుకోగా.. అందులో 61 మందితో భారత్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న సింగపూర్‌(34), జపాన్‌(33), ఆస్ట్రేలియా(32), ఇండోనేషియా(30), చైనా(28)లకు, భారత్‌ మధ్య అంతరం చాలా కనిపించింది. ఆగ్నేయాసియా నుంచి 90 మంది చోటు దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అంకుర వ్యవస్థ బాగా ఎదుగుతోంది.  అంతర్జాతీయ వెంచర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సింగపూర్‌కు ఇతర ప్రాంతాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలూ చేరుతున్నారు. ఇండోనేషియా అంకురాల్లోకి 2021 తొలి 6 నెలల్లో  4.7 బి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

‘లెక్క’ తప్పని విజయం: హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో భాన్జు అనే కమర్షియల్‌ ఎడ్‌టెక్‌ అంకురాన్ని ఈ యువకుడు ప్రారంభించారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ‘భాన్జు’ పద్ధతిలో అభ్యసిస్తే, విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని భాను చెబుతుంటారు. 2021 జులైలో భానుకు చెందిన అంకురానికి లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ నుంచి 2 మి. డాలర్ల సీడ్‌ ఫండింగ్‌ అందింది. ఇప్పటికే ఈ అంకురం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపిందని ఆయన అంటారు. 17 ఏళ్ల వయసులో ‘ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌’గా జొన్నలగడ్డ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను తిరగరాశారు.  

ఇవీ విభాగాలు

* ఫోర్బ్స్‌ జాబితాలోని యువత

కళలు

వినియోగదారు సాంకేతికత

ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ  

ఆరోగ్య సంరక్షణ-శాస్త్రవిజ్ఞానం

వినోదం-ఆటలు

పరిశ్రమ-తయారీ-ఇంధనం

మీడియా-మార్కెటింగ్‌-ప్రకటనలు

సామాజిక ప్రభావం

రిటైల్‌-కామర్స్‌

ఫైనాన్స్‌- వెంచర్‌ క్యాపిటల్‌ విభాగాల్లో కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని