లోహ, బ్యాంకింగ్‌ షేర్లకు లాభాలు

సెన్సెక్స్‌ ఉదయం 53,950.84 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 53,425.25 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పుంజుకున్న సెన్సెక్స్‌, లాభాల్లోకి వచ్చి 54,346.22 వద్ద గరిష్ఠాన్ని తాకింది

Updated : 27 May 2022 04:00 IST

సమీక్ష

మూడు రోజుల నష్టాల తర్వాత సూచీలు పుంజుకున్నాయి. మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో లోహ, బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. సగానికి పైగా మార్కెట్‌ లాభాలకు హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు దోహదపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 77.61 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై లాభపడగా, హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో నష్టపోయాయి. ఐరోపా సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 53,950.84 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 53,425.25 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పుంజుకున్న సెన్సెక్స్‌, లాభాల్లోకి వచ్చి 54,346.22 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 503.27 పాయింట్ల లాభంతో 54,252.53 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 144.35 పాయింట్లు పెరిగి 16,170.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,903.70- 16,204.45 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 5.27%, ఎస్‌బీఐ 3.26%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.96%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.82%, నెస్లే 2.34%, హెచ్‌డీఎఫ్‌సీ 2.28%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.20%, టీసీఎస్‌ 1.96%, విప్రో 1.93%, టెక్‌ మహీంద్రా 1.89% రాణించాయి. సన్‌ఫార్మా, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ స్వల్పంగా నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ (3.35%), బ్యాంకింగ్‌ (2.15%), ఫైనాన్స్‌ (1.97%), స్థిరాస్తి (1.43%) పెరిగాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ నీరసపడింది. బీఎస్‌ఈలో 1690 షేర్లు లాభపడగా, 1623 స్క్రిప్‌లు నష్టపోయాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* హౌడెన్‌ ఇన్సూర్సెన్స్‌ బ్రోకర్స్‌ ఇండియాలో తమ వాటాను 49 శాతం నుంచి 100 శాతానికి పెంచునేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి లభించిందని అంతర్జాతీయ బీమా బ్రోకర్‌ హౌడెన్‌ వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తికావడానికి రిజర్వు బ్యాంక్‌ అనుమతి లభించాల్సి ఉంటుంది.

* ఏథెర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ చివరి రోజున 6.26 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 93,56,193 షేర్లను ఆఫర్‌ చేయగా.. 5,85,34,586 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 17.57 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల నుంచి 2.52 రెట్లు, రిటైల్‌ విభాగంలో 1.14 రెట్ల చొప్పున స్పందన నమోదైంది.

* భారత్‌లో వాహన, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ సహా పలు విభాగాల్లో బీ2బీ లాజిస్టిక్స్‌ సేవలు అందించేందుకు సంయుక్త సంస్థను ప్రారంభిస్తున్నట్లు రాహుల్‌ భాటియా నేతృత్వంలోని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికా సంస్థ యూపీఎస్‌ ప్రకటించాయి. సంయుక్త సంస్థ ‘మోవిన్‌’ గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేయనుంది.  

ఆసియా అత్యుత్తమ ఐపీఓ అదానీ విల్మర్‌: ఆసియాలో స్టాక్‌ మార్కెట్లలో కొత్తగా నమోదైన కంపెనీల్లో అగ్రగామిగా గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ విల్మర్‌ నిలిచింది. మార్కెట్‌లో నమోదు తర్వాత ఈ షేరు దాదాపు మూడింతలు దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన విల్మర్‌ ఇంటర్నేషనల్‌, అదానీ గ్రూప్‌లు సంయుక్తంగా అదానీ విల్మర్‌ సంస్థను నిర్వహిస్తున్నాయి. మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, నిప్పన్‌ లైఫ్‌ ఇండియాలకు ఇందులో వాటాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆసియాలో 100 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన 121 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. పలు దేశాలు వడ్డీ రేట్లు పెంచడం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇందులో మూడింట రెండొంతుల కంపెనీలు నిరాశజనకంగా ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని