Work From Home: రోజూ ఆఫీస్‌కు రమ్మంటే.. కొత్త ఉద్యోగం వెతుక్కుంటాం

కొవిడ్‌ పరిణామాల్లో ఐటీ పరిశ్రమలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానమైంది పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయడం. వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పనిచేయడం కొవిడ్‌ ముందునుంచే ఉంది.

Updated : 19 Jun 2022 08:29 IST

అంతర్జాతీయంగా యువ ఉద్యోగుల వైఖరి ఇదే

ఏడీపీ రీసెర్చ్‌ నివేదిక

ముంబయి: కొవిడ్‌ పరిణామాల్లో ఐటీ పరిశ్రమలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానమైంది పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయడం. వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పనిచేయడం కొవిడ్‌ ముందునుంచే ఉంది. అయితే కొవిడ్‌ సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి అనుమతించారు. కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, పలు సంస్థలు క్రమంగా కార్యాలయాలను తెరుస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిళ్లు  పంపాయి. కానీ రోజూ కార్యాలయాలకు వచ్చి పనిచేయడానికి 25-34 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువ ఉద్యోగులు విముఖత చూపుతున్నారట. ప్రతిరోజూ తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందిగా సంస్థలు ఆదేశిస్తే ఉద్యోగం మారడానికి సైతం సిద్ధపడుతున్నారని ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022: ఏ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వ్యూ’ పేరిట సంస్థ నివేదికను వెలువరించింది. ఇందులోని మరిన్ని విషయాలు ఇలా..

* ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పించడానికి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. అయితే సీనియర్‌ ఉద్యోగులతో పోలిస్తే కార్యాలయాలకు వెళ్లడానికి యువ ఉద్యోగులు ఎక్కువ అయిష్టంగా ఉన్నారు.

* కంపెనీలు కార్యాలయాలకు రావాల్సిందిగా పట్టుబడితే ఉద్యోగం మారుతామని 18-24 ఏళ్ల వారిలో 10 మందిలో ఏడుగురు (71 శాతం) స్పష్టం చేశారు. 25-34 ఏళ్ల వారిలో మూడింట రెండొంతుల (66 శాతం) మంది, 45-54 ఏళ్ల వారిలో 56 శాతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* కార్యాలయాలకు రోజు రావాల్సిందిగా కంపెనీ ఒత్తిడి తెస్తే ఉద్యోగులు కొత్త కొలువు వైపు చూస్తున్నారు. అంతర్జాతీయ ఉద్యోగుల్లో 64 శాతం మంది ఇదే ధోరణిలో ఉన్నారు. భారత్‌లో 76.38 శాతం మంది ఉద్యోగులదీ ఇదే బాట.

* 2021 నవంబరు 1 నుంచి 24 తేదీల మధ్య భారత్‌ సహా 17 దేశాల్లో ఈ సర్వే చేపట్టారు. మొత్తంగా 32,924 మంది ఉద్యోగులు పాల్గొనగా.. భారత్‌ నుంచి 1600 మంది అభిప్రాయాలు తెలిపారు.

* ఇంటి నుంచి పని విధానంలోనే, తమ బృందాలతో అద్భుతంగా పనిచేశామని 75 శాతం భారత ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రావడానికి విముఖత చూపడానికి ఇది కూడా కారణంగా ఉంది.

* ‘లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా సడలించడం వల్ల ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని ఆదేశించాలా వద్దా అనే ప్రశ్న ఆవిర్భవిస్తోంది. చాలా మంది ఉద్యోగులకు ఇది కీలకంగా మారింది. యువ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి ఇష్టపడం లేదు. సామాజిక,  భవిష్యత్‌ ప్రణాళికలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి’ అని ఏడీపీ ఇండియా ఎండీ రాహుల్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని