53400 నుంచి 54400 వరకు శ్రేణి కీలకం!

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. గత వారం సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. కమొడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అయితే మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయంటూ అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ సంకేతాలు ఇవ్వడం

Updated : 04 Jul 2022 12:45 IST

సమీక్ష: అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. గత వారం సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. కమొడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అయితే మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయంటూ అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ సంకేతాలు ఇవ్వడం అప్రమత్తతకు దారితీసింది. దేశీయంగా చూస్తే.. కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ మండలి నిర్ణయం తీసుకుంది. మౌలిక రంగం 18.1 శాతం వృద్ధి నమోదు చేసింది. జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు      రూ.1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనాలపై ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని విధించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై టన్నుకు రూ.23,250 చొప్పున విండ్‌ఫాల్‌ పన్ను వేసింది. దీంతో చమురు-గ్యాస్‌, రిఫైనరీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 2 శాతం తగ్గి 110.9 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.12 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకి, 79.04 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.3 శాతం లాభంతో 52,908 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.3 శాతం పెరిగి 15,752 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, యంత్ర పరికరాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించాయి. మన్నికైన వినిమయ వస్తువులు, బ్యాంకింగ్‌ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6,837 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.5,926 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. వరుసగా తొమ్మిదో నెలలోనూ (జూన్‌) ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల నుంచి రూ.50,203 కోట్లు ఉపసంహరించుకున్నారు. 2022 మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌పీఐ అమ్మకాలు రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1గా నమోదు కావడం..

ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు, విక్రయాలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్‌ 52,000 పాయింట్ల వద్ద మద్దతు తీసుకుంది. ఈ స్థాయిని కోల్పోతే దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మరోవైపు 53,400 పాయింట్ల వద్ద తొలి నిరోధం, అది దాటితే 54,400 పాయింట్ల వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి, ముడిచమురు కదలికలు కీలకం కానున్నాయి. ఎఫ్‌ఐఐ అమ్మకాలపైనా దృష్టి పెట్టొచ్చు. జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీలు ప్రకటించనుండటంతో షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. కంపెనీల ఏజీఎం వార్తలు ప్రభావం చూపొచ్చు. ముడిచమురు సహా కమొడిటీ ధరలు శాంతించడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చని కార్పొరేట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి దిగువ స్థాయుల్లో కొనుగోళ్లకు మద్దతుగా నిలవొచ్చు. రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కాంపోజిట్‌ పీఎంఐ, సేవల పీఎంఐ, చైనా కాంపోజిట్‌ పీఎంఐ, అమెరికా ఐఎస్‌ఎం తయారీయేతర పీఎంఐ, అమెరికా నాన్‌ ఫార్మ్‌ పేరోల్స్‌ గణాంకాలు వెలువడనున్నాయి. రూపాయి మరింత బలహీనపడి, చమురు ధరలు పెరిగితే సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 52,094, 51,632, 50,921

తక్షణ నిరోధ స్థాయులు: 53,377, 53,750, 54,303

సెన్సెక్స్‌కు 53,400- 54,400 శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని