PMJJBY: కొవిడ్‌ మరణాలకు వర్తిస్తుందా?

ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీ ఉంటే.. కొవిడ్‌-19తో మరణించినా పరిహారం లభిస్తుందా? కొంతమంది రూ.4లక్షల పరిహారం వస్తుందని అంటున్నారు

Updated : 28 May 2021 10:43 IST

ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీ ఉంటే.. కొవిడ్‌-19తో మరణించినా పరిహారం లభిస్తుందా? కొంతమంది రూ.4లక్షల పరిహారం వస్తుందని అంటున్నారు నిజమేనా?
ఇప్పుడు చాలామందికి పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పథకాల గురించి ఉన్న సందేహాలివి.. దేశ వ్యాప్తంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన పథకాలే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). ఈ పాలసీలను తీసుకున్న వ్యక్తులు మరణిస్తే.. బీమా పరిహారం నామినీకి అందుతుంది.
* ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై): ఈ పాలసీకి ప్రీమియం రూ.12 మాత్రమే. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-70 ఏళ్ల వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే రూ.2లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.లక్ష చెల్లిస్తారు. కొవిడ్‌ మరణాలకూ ఈ పాలసీకి సంబంధం లేదు.
* ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై): ఈ పాలసీకి ప్రీమియం రూ.330. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-50 ఏళ్ల లోపు వ్యక్తులు దీనికి అర్హులు. ఆదాయంతో నిమిత్తం లేదు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా.. పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్‌ 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుదారులు ఏ కారణంతో మరణించినా.. రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది. హత్య, ఆత్మహత్యలకూ ఇది వర్తిస్తుంది. కాబట్టి, కొవిడ్‌-19 కారణంగా మరణించిన వారికీ ఈ బీమా పాలసీ రూ.2లక్షల పరిహారం చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే.. వారి నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిం కోసం దాఖలు చేయాలి. క్లెయిం సమర్పించిన 30 రోజుల్లోగా బ్యాంకు ఆ క్లెయిం ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది. కొవిడ్‌-19 కారణంగా చనిపోయిన వారి క్లెయింలను బీమా సంస్థలు వేగంగా పరిష్కరిస్తున్నాయి.

- ఫణి శ్రీనివాసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని