టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?

కొవిడ్‌-19తో పోరాడేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సిందే. ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలనేది పక్కన పెడితే.. మీకు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కావాలంటే మాత్రం టీకా తీసుకొని

Published : 11 Jun 2021 00:09 IST

కొవిడ్‌-19తో పోరాడేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సిందే. ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలనేది పక్కన పెడితే.. మీకు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కావాలంటే మాత్రం టీకా తీసుకొని ఉండాల్సిందే.. ఆ మేరకు బీమా సంస్థలు కొత్తగా నిబంధనలు తీసుకొస్తున్నాయి.
పరిస్థితులను బట్టి, బీమా సంస్థలు పాలసీలను జారీ చేసే నిబంధనలు మారుస్తూ ఉంటాయి. కొవిడ్‌-19 తొలిదశ తర్వాత వీటిపై మరీ కచ్చితంగా వ్యవహరిస్తున్నాయి. రెండో దశ తర్వాత అటు సాధారణ, ఇటు జీవిత బీమా సంస్థలకు క్లెయింల భారం పెరిగింది. దీంతో పాలసీలను ఇచ్చేటప్పుడే కొన్ని నిబంధనలను పాటించేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి పాలసీ ఇచ్చేందుకు బీమా సంస్థలు కనీసం 90 రోజుల వ్యవధిని పెడుతున్నాయి. ఆ తర్వాతే జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. సాధారణంగా పాలసీలు ఇవ్వడానికి ఆరోగ్య బీమా పరీక్షలను అడుగుతుంటాయి బీమా సంస్థలు. కొవిడ్‌-19 పాజిటివ్‌ ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్లు ఉంది, ఆసుపత్రిలో చేరారా? అక్కడ ఇచ్చిన చికిత్స వివరాలూ ఇవ్వాలని కోరుతున్నాయి.
కొన్ని బీమా సంస్థలు ఒక అడుగు ముందుకు వేశాయి..
కరోనా టీకా తీసుకుంటేనే టర్మ్‌ పాలసీ ఇస్తానని కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఒక బీమా సంస్థ 45 ఏళ్లు దాటిన వారు రెండు టీకా డోసులు తీసుకుంటేనే టర్మ్‌ పాలసీ ఇస్తానని చెబుతోంది. మరో సంస్థ ఒక డోసు టీకా తీసుకున్నా ఇబ్బంది లేదని చెబుతోంది. కొన్ని బీమా సంస్థలు టీకాతో సంబంధం లేదని చెబుతూనే.. టీకా వేసుకున్నారా లేదా అనే ప్రశ్నను అడుగుతున్నాయి.
ఆరోగ్య బీమా సంస్థల్లో కొన్ని కొత్తగా పాలసీ తీసుకునే వారితోపాటు.. పునరుద్ధరణ చేసుకునే వారు టీకా వేసుకుంటే.. 5శాతం వరకూ రాయితీని ఇస్తున్నాయి. అందుకే, వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.

అధిక వడ్డీ...
కొన్ని బ్యాంకులు కొవిడ్‌-19 టీకా వేసుకున్న సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీనిస్తున్నట్లు ప్రకటించాయి. యూకో బ్యాంకు టీకా వేసుకున్న పెద్దలకు డిపాజిట్లపై 0.3శాతం అదనపు వడ్డీనిస్తోంది. యూకోవాక్సీ-999 పేరుతో 999 రోజుల వ్యవధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని అందిస్తోంది. ఇది సెప్టెంబరు 30 వరకూ అందుబాటులో ఉంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇమ్యూన్‌ ఇండియా డిపాజిట్‌ స్కీం పేరుతో 1111 రోజుల వ్యవధికి అందిస్తోన్న పథకంలో 25 బేసిస్‌ పాయింట్లు అధిక వడ్డీని ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని