హైబ్రీడ్ ఫండ్లు.. ఎవరికి సరిపోతాయంటే?
హైబ్రీడ్ ఫండ్లు ఒకే రీతిగా పనిచేసినప్పటికీ.. ఇందులోనూ పెట్టుబడి తీరును బట్టి, ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఈక్విటీలు కాస్త దూకుడుగా ఉంటాయి. నష్టభయం ఎక్కువే. అదే సమయంలో కాస్త తక్కువ రాబడి వచ్చినా స్వల్ప నష్టభయంలో ఉండేవి డెట్ ఫండ్లు. మరి, ఈ రెండింటిలో ఏక కాలంలో మదుపు చేయాలంటే.. అందుకు ఉన్న మార్గం హైబ్రీడ్ ఫండ్లు. ఇటీవల కాలంలో ఇవి మదుపరులను ఆకర్షిస్తున్నాయి. ఈక్విటీ రాబడులను అందించడం, డెట్ ఫండ్ల రీతిలో తక్కువ అనిశ్చితి ఉండడం విటీ ప్రత్యేతక. మరి ఈ ఫండ్లు ఎవరికి అనుకూలం.. వీటి నుంచి ఎంత రాబడి ఆశించవచ్చు.. చూద్దామా..!
హైబ్రీడ్ ఫండ్లు ఒకే రీతిగా పనిచేసినప్పటికీ.. ఇందులోనూ పెట్టుబడి తీరును బట్టి, ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
* అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్స్: పెట్టుబడుల్లో 65-80శాతం వరకూ ఈక్విటీలకు కేటాయిస్తాయి. మిగతా మొత్తాన్ని డెట్ మార్కెట్లో మదుపు చేస్తాయి. చాలా ఫండ్లలో ఈ కేటాయింపులు ఒకే విధంగా ఉంటాయి. ఈ విభాగంలో సగటు పెట్టుబడుల తీరును చూస్తే.. 75శాతం వరకూ ఈక్విటీలు, 25శాతం వరకూ డెట్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ కేటాయింపులను ఎప్పటికప్పుడు ఫండ్ సంస్థలు మారుస్తూ ఉంటాయి. నియంత్రణ సంస్థల నిబంధనల మేరకు 80శాతం మించి, ఈక్విటీల్లో పెట్టుబడులు ఉండకుండా చూడటమే ఈ మార్పుల వెనక ప్రధాన వ్యూహం.
* బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్: ఇవి 30-80 శాతం వరకూ ఈక్విటీలకు, మిగతా మొత్తాన్ని డెట్కు కేటాయిస్తాయి. అయితే, ఇందులో ప్రత్యేకతేమిటంటే.. ఈక్విటీ మార్కెట్ల పనితీరును బట్టి, ఇవి ఆ విభాగానికి కేటాయింపులను మారుస్తూ ఉంటాయి. కొన్ని ఫండ్లు సందర్భాన్ని బట్టి, 100శాతం వరకూ పెట్టుబడిని ఈక్విటీలకే మళ్లిస్తుంది. ఫండ్ సంస్థలు అంతర్గతంగా పెట్టుబడుల కేటాయింపు విధానాలను రూపొందించుకొని, దానికి తగ్గట్టుగా పెట్టుబడులు పెడుతుంటాయి. పీ/ఈ, పీ/బీ నిష్పత్తులను, సాంకేతిక విశ్లేషణలను పరిగణనలోకి తీసుకొని, రోజువారీ సగటును నిర్ణయిస్తాయి. ఈ ఫండ్ల ప్రధాన పెట్టుబడి వ్యూహం.. అనిశ్చితిని సాధ్యమైనంత తగ్గించి, మార్కెట్ దిద్దుబాటు సమయంలోనూ పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా చూడటమే.
* ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్: ఈ రకం హైబ్రీడ్ ఫండ్లు 30-40 శాతం వరకూ ఈక్విటీల్లోనూ.. 25-35 శాతం ఈక్విటీ ఆర్బిట్రేజ్, మిగతా మొత్తం 25-35శాతం వరకూ డెట్లోనూ మదుపు చేస్తాయి. మొదటి రెండు రకాలతో పోలిస్తే.. ఈ రకం ఫండ్లు పెట్టుబడుల్లో కాస్త అధిక జాగ్రత్తలు పాటిస్తుందని చెప్పొచ్చు.
రాబడి ఎంత వరకూ...
ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు రాబడి ఒక్కటే ప్రామాణికం కాదు. మీరు ఆశిస్తున్న రాబడితోపాటు.. దానికి అంతర్గతంగా ఉండే నష్టభయమూ లెక్కలోకి తీసుకోవాలి. అనిశ్చితి ఎక్కువగా ఉన్నచోట నష్టభయమూ అధికంగానే ఉంటుంది. గత మూడేళ్ల చరిత్రను (జూన్ 15, 2021) పరిశీలిస్తే.. అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్లు గరిష్ఠంగా 20.02 శాతం, సగటున 9.63శాతం రాబడిని అందించాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు.. గరిష్ఠంగా 16.88శాతం, సగటున 9.09శాతం, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లు.. గరిష్ఠంగా 9.15 శాతం, సగటున 6.76 శాతం వరకూ రాబడిని అందించాయి. కొవిడ్-19 తొలి దశ సందర్భంలో ఇవి కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత కోలుకున్నాయి. డెట్ ఫండ్లతో పోలిస్తే కాస్త అధికం.. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ నష్టభయం ఉన్న ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ 7-9శాతం సగటు రాబడినిచ్చాయని చెప్పుకోవచ్చు.
ఎవరికి?
కనీసం మూడేళ్ల నుంచి అయిదేళ్ల కాలానికి మదుపు చేసే వారికి ఈ హైబ్రీడ్ ఫండ్లు సరిపోతాయి. ఈక్విటీలాంటి రాబడులు, తక్కువ అనిశ్చితి ఉండాలనుకుంటే.. అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్లు పరిశీలించాలి. హెచ్చుతగ్గులు చాలా తక్కువగా ఉండాలనుకుంటే.. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు నప్పుతాయి. ఇక స్వల్ప నష్టభయం ఉండాలనుకున్నప్పుడు ఈక్విటీ సేవింగ్ ఫండ్లు సరిపోతాయి.
దీర్ఘకాలంలోనే..
ఏడాదిలోనే హైబ్రీడ్ ఫండ్ల ద్వారా మంచి రాబడి రావాలని ఆశించడం సరికాదు. ఏడాది కాలంలో పనితీరు బాగున్నా.. అదే పునరావృతం కాకపోవచ్చు. ఒక్కోసారి మెరుగైన రాబడిని ఇవ్వవచ్చు. వీటిని సాధారణంగా నష్టభయం తక్కువగా ఉండే పథకాలుగా పోర్ట్ఫోలియోలో స్థానం కల్పించాలి. ముఖ్యంగా ఈక్విటీ సేవింగ్స్ పథకాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని డెట్లాగానే పరిగణించాలి.
- నిరంజన్ అవస్థి, హెడ్-ప్రొడక్ట్, ఎడిల్వైజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్