Commodity Trading: కమొడిటీ పెట్టుబడులు లాభదాయకమా?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఫలితంగా ముడిచమురు బ్యారెల్‌  110-120 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. ఫలితంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈనెలలో 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లు పెంచుతామని, అవసరమైతే మరిన్ని విడతల పెంపు

Updated : 04 Mar 2022 09:43 IST

బంగారం, వెండి, వ్యవసాయోత్పత్తులపై మొగ్గుచూపుతున్న మదుపరులు

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, ఇతర పరిస్థితుల ప్రభావం

ఈక్విటీ షేర్ల విషయంలో వేచిచూసే ధోరణి  

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఫలితంగా ముడిచమురు బ్యారెల్‌  110-120 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. ఫలితంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈనెలలో 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లు పెంచుతామని, అవసరమైతే మరిన్ని విడతల పెంపు ఉంటుందని అమెరికా కేంద్రబ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్‌మార్కెట్లలో ఎఫ్‌ఐఐ (విదేశీ సంస్థాగత మదుపరులు) పెద్దఎత్తున అమ్మకాలు చేపట్టారు. గత 5 నెలల్లోనే రూ. లక్ష కోట్లకు పైగా విలువైన షేర్లను వారు విక్రయించారు. అందువల్లే దేశీయ స్టాక్‌మార్కెట్లో దిద్దుబాటు చోటుచేసుకుంటోంది. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) కొనుగోళ్లు చేస్తున్నందున, అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే, మనదేశ స్టాక్‌మార్కెట్లలో దిద్దుబాటు కొద్దిగా అదుపులో ఉన్నా, భవిష్యత్తు కదలిక ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కమొడిటీస్‌’ పై పెట్టుబడులు కొంతకాలం పాటు లాభదాయకంగా ఉంటాయనే అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆర్ధికంగా ఇబ్బందికర వాతావరణం నెలకొన్నప్పుడు, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పుడు కమొడిటీస్‌ ధరలు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని.. కమొడిటీస్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అగ్రశ్రేణి పెట్టుబడి సంస్థలు అంచనా వేస్తున్నాయి. మదుపర్లు కూడా ఈ దిశగా తమ పెట్టుబడులు మార్చుకుంటున్నారని చెబుతున్నారు.

వీటిల్లో ట్రేడింగ్‌

వ్యవసాయోత్పత్తులు, లోహాలు, చమురు, మాంసం..తదితరాలను కమొడిటీస్‌ (వస్తువులు)గా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటాయి. ఆహార ధాన్యాలు, బంగారం, వెండి, అల్యూమినియం, రాగి, ఇనుము, చమురు, సహజవాయువు, విద్యుత్తు.. వీటన్నింటిపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కమొడిటీస్‌ మార్కెట్లలో ఫ్యూచర్‌ కాంట్రాక్టులు, స్పాట్‌ మార్కెట్లు ఇందుకు వీలుకల్పిస్తున్నాయి. మనదేశంలో ఎన్‌సీడెక్స్‌, ఎంసీఎక్స్‌, ఐఈఎక్స్‌ లలో ఇటువంటి లావాదేవీలు జరుగుతాయి.


వైవిధ్యం మేలు

అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలని కోరుకునే మదుపరులు ఇటీవల ఈక్విటీ షేర్లకే పరిమితం కాకుండా కమొడిటీస్‌ ట్రేడింగ్‌ జరిగే ఎక్స్ఛేజీలకూ దారితీస్తున్నారు. తమ పెట్టుబడుల్లో కొంత మేరకు బంగారం, వెండి, చమురు, కొన్ని వ్యవసాయోత్పత్తుల కాంట్రాక్టుల్లోనూ పెడుతున‌్రను. మరోపక్క ‘హెడ్జింగ్‌’ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు కమొడిటీస్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా పెట్టుబడులు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు.


జిమ్‌ రోజర్స్‌ ఏమంటున్నారంటే..

ప్రపంచ వ్యాప్త పరిణామాలను, స్టాక్‌మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ‘దిద్దుబాటు’ను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతానికి కమొడిటీస్‌ పెట్టుబడులు మేలైనవిగా కనిపిస్తున్నట్లు అగ్రశ్రేణి పెట్టుబడుల సంస్థ అయిన రోజర్స్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ జిమ్‌ రోజర్స్‌ తాజాగా అభిప్రాయపడ్డారు. యుద్ధం వచ్చినప్పుడు, ఇతరత్రా అననుకూల పరిస్థితుల్లో కమొడిటీస్‌ ధరలు పెరిగిపోతాయని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండితో పాటు వ్యవసాయోత్పత్తులపై పెట్టుబడులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటిలో ఔన్సు (31.10 గ్రాములు) 1790 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర ఇప్పుడు 1925 డాలర్లపైన కదలాడుతోంది. చమురు కూడా అంతే ఈనెల 1న బ్యారెల్‌ 100 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు 112 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది ఇంకా పెరగొచ్చనే అంచనాలే ఉన్నాయని గుర్తు చేశారు. ఇతర దేశాలతో పోల్చితే బలంగా కనిపిస్తున్నా కూడా భారత స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు కొంతకాలం పాటు వేచి ఉండాలనేది తన అభిప్రాయమని తెలిపారు.  అమెరికాకు చెందిన పిమ్‌కో గ్లోబల్‌ అనే పెట్టుబడుల సేవల సంస్థ సహ- వ్యవస్థాపకుడైన బిల్‌ గ్రాస్‌ సైతం ఈక్విటీ పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంతకాలం పాటు స్వల్ప మాంద్యాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని