సూచీ ఫండ్లలో పెట్టుబడి.. లాభమేనా?

స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్‌ ఫండ్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అందులోనూ నిఫ్టీలాంటి సూచీలో మదుపు చేసే ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లపై (ఈటీఎఫ్‌) మదుపరుల ఆసక్తి పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే

Updated : 08 Apr 2022 04:04 IST

స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్‌ ఫండ్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అందులోనూ నిఫ్టీలాంటి సూచీలో మదుపు చేసే ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లపై (ఈటీఎఫ్‌) మదుపరుల ఆసక్తి పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఫండ్‌ సంస్థలూ కొత్త ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభమేమిటి? ఎవరికి అనుకూలం.. తెలుసుకోండి..

పేరులోనే ఉన్నట్లు ఈ ఫండ్లు సూచీల్లో ఉన్న షేర్లలోనే మదుపు చేస్తాయి. సూచీలో ఒక్కో షేరుకు ఎంత వెయిటేజీ కేటాయించారో అదే నిష్పత్తిలో ఈ ఫండ్లూ ఆయా షేర్లలో మదుపు చేస్తాయి. సూచీల్లో ఆ షేరుకు వెయిటేజీ మారితే.. అందుకు తగ్గట్టుగానే ఫండ్‌ పెట్టుబడుల్లోనూ సర్దుబాటు జరుగుతుంది. ఉదాహరణకు నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌.. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుందన్నమాట.

ఈ ఫండ్లలో ఉన్న ప్రయోజనాలను గమనిస్తే..

* వైవిధ్యం: ఇండెక్స్‌ ఫండ్‌ ద్వారా మదుపు చేసినప్పుడు సులభంగా వైవిధ్యమైన షేర్లలో మదుపు చేసేందుకు అవకాశం లభిస్తుంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌నే తీసుకుంటే.. ఈ సూచీ ద్వారా మదుపరులు విభిన్న కంపెనీల్లో మదుపు చేయొచ్చు. ఇండెక్స్‌లో భాగంగా ఉన్న ఏదైనా కంపెనీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసినా.. పోర్ట్‌ఫోలియోలోని ఇతర షేర్లు పెట్టుబడి నష్టపోకుండా భర్తీ చేస్తాయి. ఈ వైవిధ్యం కేవలం రూ.100 పెట్టుబడితో సాధించవచ్చు.

* ఖర్చులు తక్కువ: ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్లలో ఖర్చులు తక్కువగా ఉంటాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రకారం ఇండెక్స్‌ ఫండ్‌ కోసం మొత్తం వ్యయ నిష్పత్తి 1 శాతానికే పరిమితం. కాబట్టి, పెట్టుబడుదారులకు ఈ ఫండ్లు చౌకైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

* రాబడి: ఆర్థిక వృద్ధిని మార్కెట్‌ సూచీలు ప్రతిబింబిస్తాయి. ఇండెక్స్‌ ఫండ్లు అంతర్లీనంగా సూచీకి దగ్గరగా రాబడిని అందిస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడిని కొనసాగించినప్పుడు మంచి లాభాలను పొందేందుకు వీలవుతుంది. ఉదాహరణకు అయిదేళ్ల కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ 15 శాతం వార్షిక సగటు రాబడిని అందించింది.

* సిప్‌: ఇతర ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు పెట్టినట్లే... వీటిలోనూ సిప్‌ చేసేందుకు అవకాశం ఉంది. సూచీలు తగ్గినప్పుడు వీలును బట్టి, ఈటీఎఫ్‌ యూనిట్లను కొనుగోలు చేసే వీలూ ఉంది.

ఎవరికి..

ప్రతి మదుపరి తన పెట్టుబడుల జాబితాలో ఇండెక్స్‌ ఫండ్లకు స్థానం కల్పించాలి. కొత్తగా ఈక్విటీల్లో మదుపు చేస్తున్న వారు ఈ ఫండ్లను తొలి మెట్టుగా భావించవచ్చు. స్వల్పకాలంలో ఈ ఫండ్ల పనితీరులో కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఇవి పరిమితమే. వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టాన్ని భరించే సామర్థ్యం, వ్యవధి, ఆర్థిక లక్ష్యాలు తదితరాలను బట్టి, నిర్ణయం తీసుకోవాలి.


పరిమితులున్నాయి..

* మార్పులకు అవకాశం లేకపోవడం: క్రియాశీలకంగా ఉండే ఈక్విటీ ఫండ్లలో ఫండ్‌ మేనేజర్‌ పాత్ర కీలకం. మార్కెట్‌ పోకడను బట్టి, షేర్ల ఎంపిక మారుతూ ఉంటుంది. ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఈ అవకాశం ఉండదు. మార్కెట్‌ ప్రతికూలతలోనూ పెట్టుబడులు సూచీకి అనుసంధానంగా ఉన్న షేర్లలోనే పెట్టుబడులు కొనసాగుతాయి.

* అధిక లాభాలు: ఇండెక్స్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నప్పుడు మదుపరులు సూచీ ఇచ్చే లాభాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే.. పెట్టుబడులతో అధిక రాబడులను ఆర్జించే అవకాశం ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో అంత ఎక్కువగా ఉండకపోవచ్చు.

- చింతన్‌ హారియా, హెడ్‌- ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని