ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..

వ్యక్తిగత ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్‌ కార్డులు, ఆదాయపను పన్ను, క్రిప్టో కరెన్సీపై టీడీఎస్‌లాంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. మరి వీటి గురించి వివరంగా చూద్దాం..

Updated : 01 Jul 2022 07:03 IST

వ్యక్తిగత ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్‌ కార్డులు, ఆదాయ ప‌న్ను, క్రిప్టో కరెన్సీపై టీడీఎస్‌లాంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. మరి వీటి గురించి వివరంగా చూద్దాం..


క్రెడిట్‌ కార్డులు..

క్రెడిట్‌ కార్డుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్‌ కార్డు సంస్థలు.. కార్డు వినియోగదారుడిని సంప్రదించకుండా.. కొత్తగా పరిమితి పెంచడం, కొత్త కార్డులను పంపించడంలాంటివి చేసేందుకు వీల్లేదు. దీంతోపాటు.. కార్డుదారుడు తన వెసులుబాటును బట్టి, బిల్లింగ్‌ సైకిల్‌ను మార్చుకోవచ్చు. అయితే, దీనికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. క్రెడిట్‌ కార్డును రద్దు చేయాల్సిందిగా వినియోగదారుడు కోరినప్పుడు ఎలాంటి బాకీలు లేకపోతే ఏడు పనిదినాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆలస్యం అయితే.. రోజుకు రూ. 500 చొప్పున వినియోగదారుడికి కార్డు సంస్థ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


పాన్‌- ఆధార్‌ జత

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ను అనుసంధానం చేయాలి. లేకపోతే పాన్‌ చెల్లకుండా పోతుంది. జూన్‌ 30 వరకూ రూ.500 అపరాధ రుసుముతో పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి వీలు కల్పించారు. ఇప్పుడు ఈ జరిమానా మొత్తం రెట్టింపు అవుతోంది. నేటి నుంచి ఈ రెండింటినీ జత చేసేందుకు అపరాధ రుసుము రూ.1,000 చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అనుమతి ఉంది.


క్రిప్టోలపై..

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించే విషయంలో ఇప్పటికే పూర్తి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను బదిలీ చేసిన సందర్భంలో 1 శాతం టీసీఎస్‌ విధించాల్సి ఉంటుంది. ఇందుకుగాను సెక్షన్‌ 194 ఎస్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు.


ఉచిత శాంపిళ్లపై..

వైద్యులు, ఇతరులు ఉచిత శాంపిళ్లను అందుకున్నప్పుడు అది వారికి ఆదాయంగానే చూపించాల్సి ఉంటుంది. వీటికి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికోసం సెక్షన్‌ 194ఆర్‌ అమల్లోకి రానుంది. ఈ ప్రయోజనాలను అందుకునే వారి నుంచి 10 శాతం టీడీఎస్‌ విధించి, ఆదాయపు పన్ను శాఖకు కంపెనీలు జమ చేయాలి.


డీమ్యాట్‌ కేవైసీ..

డీమ్యాట్‌ ఖాతాలకు పూర్తి కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) ఉన్నప్పుడే అవి జులై 1 నుంచి అమల్లో ఉంటాయి. పేరు, చిరునామా, పాన్‌, మొబైల్‌ నెంబరు, ఆదాయం వివరాలు, ఇ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలు కచ్చితంగా ఉండాలి. లేకపోతే.. జులై 1 నుంచి డీమ్యాట్‌ ఖాతాలు నిలిపివేస్తారు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు