ఆరేళ్లలో.. రూ.8 లక్షలు రావాలంటే

నేను నెలకు రూ. 15,000 వరకూ స్టాక్‌ మార్కెట్లో పెట్టాలని అనుకుంటున్నాను. క్రమం తప్పకుండా షేర్లలో మదుపు చేసేందుకూ అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? మ్యూచువల్‌ ఫండ్లకన్నా దీని ద్వారా లాభం ఎక్కువగా వస్తుందా?

Updated : 03 Dec 2021 09:15 IST

* నేను నెలకు రూ. 15,000 వరకూ స్టాక్‌ మార్కెట్లో పెట్టాలని అనుకుంటున్నాను. క్రమం తప్పకుండా షేర్లలో మదుపు చేసేందుకూ అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? మ్యూచువల్‌ ఫండ్లకన్నా దీని ద్వారా లాభం ఎక్కువగా వస్తుందా?

- సత్యం

* క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా షేర్లలోనూ మదుపు చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని సిస్టమేటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ అంటారు. కనీసం ఏడేళ్లకు పైగా పెట్టుబడిని కొనసాగించగలరు అనే నమ్మకం ఉన్నప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాలి. మీకు స్టాక్‌ మార్కెట్‌పైన మంచి అవగాహన ఉండి, షేర్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండటం, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించగలిగే అవకాశం ఉన్నప్పుడే దీన్ని ఎంచుకోవాలి. లేదా.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. నేరుగా షేర్లలో మదుపు చేసినప్పుడు నష్టభయం అధికంగా ఉంటుంది.

* నా వయసు 46 ఏళ్లు. నెలకు రూ.45వేలు వస్తున్నాయి. నేను రూ.కోటి పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా? ఎంత వ్యవధికి తీసుకుంటే బాగుంటుంది?

- కుమార్‌

* మీ బాధ్యతలన్నీ తీరేంత వరకూ బీమా పాలసీ రక్షణ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ బీమా ఉంటే సరిపోతుంది. మీ అవసరాలను బట్టి, దీన్ని నిర్ణయించుకోండి. మీ ఆదాయం, వయసు ఆధారంగా ఎంత బీమా ఇచ్చేందుకు అవకాశం ఉంది అనేది బీమా సంస్థలను బట్టి ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాల కోసం బీమా సంస్థను సంప్రదించండి.

* మా అమ్మాయి వయసు 14 ఏళ్లు. మరో 10 ఏళ్ల తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నెలకు రూ.25,000 మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికోసం మా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?

- మాధవి

ఆరేళ్లలో.. రూ.8 లక్షలు రావాలంటే  ముందుగా మీ అమ్మాయి భవిష్యత్తు అవసరాలను తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. దీని కోసం టర్మ్‌ పాలసీని పరిశీలించండి. ఆ తర్వాతే పెట్టుబడి గురించి ఆలోచించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.25వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 10శాతం రాబడితో రూ.47,81,227 జమ అయ్యే అవకాశం ఉంది.

* నా దగ్గర ఉన్న రూ.2 లక్షలను ఎక్కడైనా మదుపు చేయాలని అనుకుంటున్నాను. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను కొనడం మంచిదేనా? 6 ఏళ్ల తర్వాత ఈ డబ్బు తీసుకుంటాను. అప్పటి వరకూ కనీసం రూ.8 లక్షల వరకూ అయ్యే అవకాశం ఉందా?

- ప్రదీప్‌

* మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.2లక్షలు ఆరేళ్లలో రూ.8లక్షలు కావాలంటే.. దాదాపు 26 శాతం రాబడి రావాలి. ఇది అంత తేలిక కాదు. నష్టభయం ఉన్న పెట్టుబడుల్లోనూ దాదాపు 8-13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌, బంగారం ఫండ్లలో మదుపు చేసినప్పుడు ఈ రాబడి వచ్చే అవకాశం తక్కువే. ఈ డబ్బును బంగారం కొనడానికే ఉపయోగించుకోవాలని అనుకుంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. లేదా.. నష్టం వచ్చినా ఇబ్బంది లేదు అనుకుంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. సగటున 12 శాతం వార్షిక రాబడితో ఆరేళ్లలో మీ రూ.2లక్షలు.. రూ.3,94,764 అవుతాయని అంచనా వేసుకోవచ్చు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని