పన్ను ఆదా కోసం ఆన్లైన్ విధానాన్ని ఎంచుకోండి
పెట్టుబడులను బయటకు వెళ్లకుండా ఇంటివద్ద నుంచే ఆన్లైన్ ద్వారా చేయొచ్చు
కోవిడ్- 19 దృష్ట్యా 3 మే 2020 వరకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్, ముగుస్తుందో లేదా మరికొంత కాలం కొనసాగుతుందో తెలియదు. ఆర్ధిక సంవత్సరం 2019-20 కి పన్ను మినహాయింపుల కోసం చేయాల్సిన పెట్టుబడుల గడువును జూన్ 30 ,2020 వరకు పొడిగించారు. అప్పటి వరకు చేయగలిగిన పెట్టుబడులను , బయటకు వెళ్లకుండా ఇంటివద్ద నుంచే ఆన్లైన్ ద్వారా చేయొచ్చు .
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం సెక్షన్ 80సి కింద చేయగలిగిన 5 పెట్టుబడుల గురించి తెలుసుకుందాం :
1.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్ ):
మీ పొదుపు ఖాతా ఉన్న బ్యాంకులోనే పీపీఎఫ్ ఖాతా తెరిచి , పొదుపు ఖాతా ద్వారా నగదు బదిలీ చేయొచ్చు. పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ప్రతి ఏడాది కనీసం రూ. 500 , గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. మైనర్ పిల్లల పేరుమీద కూడా ఖాతా తెరవచ్చు. అయితే అన్ని పీపీఎఫ్ ఖాతాలలో మొత్తం, ఏడాది కి గరిష్టంగా రూ.1.50 లక్షలు మాత్రమే జమ చేయొచ్చు . ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వీటిపై వడ్డీ నిర్ణయిస్తుంది. 1 ఏప్రిల్, 2020 నుంచి వార్షిక వడ్డీ 7.10 శాతం గా ఉంది. వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది .
2.5 ఏళ్ల బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ :
బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ లను 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు అనుమతిస్తాయి. అయితే 5 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్సెడ్ డిపాజిట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందొచ్చు . ప్రస్తుతం 6 శాతం వరకు వడ్డీ ని అందిస్తున్నాయి . వడ్డీ ఆదాయం ఫై పన్ను ఉంటుంది.
3.ఈఎల్ఎస్ఎస్ (ELSS) మ్యూచువల్ ఫండ్స్ :
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పటికీ , కేవలం ఈఎల్ఎస్ఎస్ (ELSS-ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం ) కి సెక్షన్ 80సి కింద మదుపు చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనికి 3 ఏళ్ల లాక్-ఇన్ వుంటుంది . బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్, పీపీఎఫ్ మాదిరిగా దీనిపై కచ్చితమైన రాబడి ఉండదు. 3 ఏళ్ల తరువాత మార్కెట్లు తక్కువలో వుంటే, పెట్టుబడిని కొనసాగించవచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఎంచుకుని, కేవైసీ వివరాలు పూర్తి చేసి, పెట్టుబడి చేయొచ్చు . అవసరమయితే డిస్ట్రిబ్యూటర్ ల సహాయం తీసుకోవచ్చు .
4.నేషనల్ పెన్షన్ సిస్టమ్ - ఎన్పీఎస్ :
18-65 ఏళ్ల మధ్య ఉన్న వారు ఆన్లైన్ లో ఖాతాను తెరవవచ్చు. కేవైసీ వివరాలు పూర్తి చేసేందుకు స్కాన్ (Scan) చేసిన పాన్ (PAN), ఫొటోగ్రాఫ్ , సంతకం , కాన్సల్ చేసిన చెక్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. టయర్ 1 ఖాతా తప్పనిసరి. అవసరమనుకుంటే టయర్ 2 ఖాతా తెరవవచ్చు.
5.యులిప్స్ ఆన్లైన్ :
మీరు ఎంచుకున్న జీవిత బీమా సంస్థ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో పెట్టుబడి చేయొచ్చు . ఆన్లైన్ యలిప్స్ లో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి . దీర్ఘకాలం అంటే కనీసం 10 ఏళ్ల కాలానికి మదుపు చేయగలిగితే రాబడి పొందొచ్చు. ఇందులో కనీసం 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.