కుటుంబ సభ్యుల‌ స‌హ‌కారంతో పన్ను ఆదా చేసుకోండి

కుటుంబ స‌భ్యుల పేరుతో పెట్టుబ‌డులు చేస్తే ఆదాయ ప‌న్ను సెక్ష‌న్‌ల ప్ర‌కారం ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

Published : 17 Dec 2020 14:01 IST

పెట్టుబ‌డులు పెట్టేముందు ప‌న్ను ఆదా చేసుకునేందుకు సంబంధించిన సెక్ష‌న్‌లు మిన‌హాయింపుల విష‌యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ మంది సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను ఆదా చేసుకునేవిదంగా పెట్టుబ‌డులు పెడుతుంటారు. అయితే ప‌న్ను ఆదా చేసుకునేందుకు సెక్ష‌న్ 80సీ తో పాటు మ‌రిన్ని సెక్ష‌న్‌లు కూడా ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యుల స‌హ‌కారంతో కూడా ప‌న్ను ఆదా చేసుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు, భార్య కూడా ప‌న్ను ఆదా చేసుకునేందుకు దోహ‌ద‌ప‌డ‌తారు. మ‌రి ప‌న్ను ఆదా చేసేందుకు వివిద చ‌ట్టాలు,సెక్ష‌న్‌ల గురించి తెలుసుకుందాం.

త‌ల్లిదండ్రులు:

  1. త‌ల్లిదండ్రుల పేరుతో పెట్టుబ‌డులు

ప‌న్ను ఆదా చేసేందుకు మొద‌ట చేయాల్సింది త‌ల్లిదండ్రుల పేరుతో పెట్టుబ‌డులు చేయ‌డం. మీరు త‌ల్లిదండ్రుల‌కు డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇస్తే దానిపై ప‌న్ను ఉండ‌దు. అయితే వారు ప‌న్ను శ్లాబులోకి రాకుండా ఉంటేనే మిన‌హాయింపు ల‌భిస్తుంద‌న్న విష‌యం గుర్తుంచుకోండి. ఉదాహ‌ర‌ణ‌కు రూ.2 ల‌క్ష‌లు మీ త‌ల్లిదండ్రుల‌కు బ‌హుమ‌తిగా ఇచ్చార‌నుకుందాం. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో పొదుపు చేశారు. దీనిపై 8-9 శాతం రాబ‌డి వ‌స్తుంది. వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను ఉంటుంది. అయితే మీ త‌ల్లిదండ్ర‌లు ప‌న్ను శ్లాబులోకి రాక‌పోతే ఎక్కువ ప‌న్ను ఆదా చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ త‌ల్లిదండ్ర‌లు సీనియ‌ర్ సిటిజ‌న్లు అయితే వారికి అద‌నంగా ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

  1. త‌ల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా

ప‌న్ను ఆదా చేసేందుకు రెండ‌వ ప‌ద్ద‌తి త‌ల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం. సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.50 వేల వ‌ర‌కు ఉంటుంది. వారు మీపై ఆధార‌ప‌డినా లేదా సొంత ఆదాయం క‌లిగి ఉన్నా ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

  1. త‌ల్లిదండ్రుల‌కు అద్దె చెల్లించండి

మీరు వేత‌న జీవులై ఉండి, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వారి సొంతింట్లో నివ‌సిస్తుంటే ఇంటి అద్దె వారికి చెల్లించండి. అప్పుడు, ఇంటి అద్దె అల‌వెన్సు ల‌భిస్తుంది. ఇంటి అద్దె చెల్లిస్తే మీ త‌ల్లిదండ్రుల‌కు పన్ను ప‌డుతుంది. అయితే వారికి ఎటువంటి ఆదాయం లేక‌పోతే మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ప‌న్ను ఆదాకు భాగ‌స్వామ్యం:

  1. భార్య లేదా భ‌ర్త పేరుతో పెట్టుబ‌డులు

మీ భార్య‌తో పోలిస్తే మీరు అధిక ప‌న్ను శ్లాబులోకి వ‌స్తే లేదా మీ భార్య‌కు ఎలాంటి ఆదాయం లేక‌పోతే వారి పేరుతో పెట్టుబ‌డులు ప్రారంభించండి. భార్య‌కు ఇచ్చే బ‌హుమ‌తిత‌లో ప‌రిమితులు లేవు. బ‌హుమ‌తిగా పొందిన డ‌బ్బు వేర్వేరు సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు చేవ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌, పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల వంటివి. పీపీఎఫ్ వంటి ప‌న్ను ర‌హిత ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెడితే వ‌డ్డీపై మీకు ప‌న్ను ఉండ‌దు. అది కాకుండా ప‌న్ను వ‌ర్తించే వాటిలో పెడితే శ్లాబు ప్ర‌కారం మీకు ప‌న్ను ఉంటుంది.

  1. ఆస్తిని మీ భార్య పేరుకి బ‌దిలీ చేయ‌డం

అద్దె ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని కూడా భార్య స‌హ‌కారంతో ఆదా చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ మీకు రెండ‌వ ఇల్లు ఉంటే దానిని అద్దెకు ఇస్తేఅద్దె ఆదాయాన్ని చూపి దాని ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి. అయితే అద్దె ఆదాయంపై ప‌న్ను ఆదా చేసేందుకు ఆస్తిని భార్య పేరుకి బ‌దిలీ చేయాలి. దానికి స‌మానంగా జువెల‌రీ లేదా ఇత‌ర ఆస్తి వంటివి హామీగా తీసుకున్న‌ట్లుగా చూపాలి. రెండ‌వ ఇంటిపై వ‌చ్చే ఇంటి ఆదాయంపై మీ భార్య పేరుతో ఉన్నా ప‌న్ను ఉంటుంది.

పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులు:

  1. పిల్ల‌ల పేరుతో పెట్టుబడులు

ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్రకారం 18 ఏళ్లు దాటిన త‌ర్వాత పిల్ల‌లు పొందే ఆదాయాన్ని సొంత‌ ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. అది వారి త‌ల్లిదండ్రుల ఆదాయంతో క‌లిపి లెక్కించ‌రు. అంటే 18 ఏళ్లు దాటి, ఎలాంటి ఆదాయం లేని పిల్ల‌లు ఉంటే వారి పేరుతో పెట్టుబ‌డులు ప్రారంభించి ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అయితే వారు డ‌బ్బు విష‌యంలో ఎంత జాగ‌త్ర‌గా వ్య‌వ‌హ‌రిస్తారు, డ‌బ్బును న‌ష్ట‌పోయే ప్ర‌మాదం లేద‌న‌కున్న‌ప్ప‌డు పెట్టుబ‌డులు పెట్టాలి. త‌ర్వాత మీ పిల్ల‌లు డ‌బ్బు మీకు ఇవ్వ‌డానికి నిరాక‌రించడం లేదా వృథా చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

  1. మైన‌ర్ పిల్ల‌ల పేరుతో పెట్టుబడులు

మైన‌ర్ పిల్ల‌ల పేరుతో చేసే పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్ని త‌ల్లిదండ్రుల ఆదాయంతో క‌లుపుతారు. ఒక్కొక్క‌రికి రూ.1500 చొప్పును వారి ఆదాయంలో క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

  1. ట్యూష‌న్ ఫీజు

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, రూ. 1.50 లక్షల వ‌ర‌కు పిల్ల‌ల‌కు చెల్లించే ట్యూష‌న్‌పై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. గ‌రిష్ఠంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఇది వ‌ర్తిస్తుంది. ట్యూష‌న్ ఫీజు చెల్లించిన రశీదు ఆధారంగా ప‌న్ను ఆదా చేసుకోవచ్చు. ఇత‌ర హాస్ట‌ల్ ఛార్జీలు, డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజు, లైబ్ర‌రీ ఫీజు వంటివి ప‌న్ను మిన‌హాయింపు కింద‌కి రావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని