Investments: భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆసక్తి

Investments: అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో తమ పెట్టుబడులను మరింత విస్తరిస్తున్నాయి....

Published : 02 Aug 2022 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా స్థిరాస్తి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వీటన్నింటితో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా ముందుకు సాగుతోంది. అధిక ధరలు ఇక్కడా ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇతర దేశాలతో పోలిస్తే కొంత అదుపులోనే ఉన్నాయని చెప్పాలి!. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నట్లు ఇప్పటికే పలు కీలక సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యాయి.

గూగుల్‌: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో టెక్‌ దిగ్గజం గూగుల్‌ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. అంతకుముందు బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌ 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.

బ్లాక్‌స్టోన్‌: అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్‌ భారత అంకుర సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై భారీ ఎత్తున లాభాలు ఆర్జించింది. దీంతో ఈ కంపెనీ మన దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. భారతదేశంలో గతంలో పెట్టిన 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి విలువ ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత దశాబ్ద కాలంలో ఈ కంపెనీ దేశంలోకి 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను మళ్లించింది. 2021 తొలి నాలుగు నెలల్లో ఈ కంపెనీ 5.5 బిలియన్‌ డాలర్లను వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. పిరమల్ గ్లాస్, ఎంఫసిస్, నెక్సస్ మాల్స్, ఎడ్యుటెక్ ప్లేయర్ ఆకాశ్‌, ప్రెస్టీజ్ వంటి కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి.

ఎయిర్‌బస్‌, బోయింగ్‌: భారత విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. దీంతో దీన్ని అవకాశంగా మార్చుకునేందుకు అంతర్జాతీయ దిగ్గజ విమాన తయారీ కంపెనీలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌ పోటీ పడుతున్నాయి. కొవిడ్‌-19 తర్వాత పుంజుకుంటున్న విమానయానంలోని అవకాశాలను ఇవి అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశంలోని అనేక విమానయాన సంస్థలతో ఈ రెండు కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

మైక్రోసాఫ్ట్‌: మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సైతం భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తోంది. హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధమైంది. ఐటీ రంగంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తర్వాత భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే కావడం గమనార్హం.

ఒరాకిల్‌: వరుసగా మూడేళ్ల నుంచి గణనీయ వృద్ధిని నమోదు చేస్తున్న క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ఒరాకిల్‌ భారత్‌లో మరింత విస్తరించేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రానున్న కొన్ని నెలల్లో అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

యాపిల్‌: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న యాపిల్‌.. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్‌లో ఈ కంపెనీ వ్యాపారం రెండింతలైంది. సెప్టెంబరు 2021 త్రైమాసికంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా యాపిల్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న అవకాశాలను పెట్టుబడుల ద్వారా అందిపుచ్చుకునేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని