Cryptocurrency: ప్రపంచ క్రిప్టో మార్కెట్‌ ఢమాల్‌.. ఆర్‌బీఐ పుణ్యం వల్ల మనం సేఫ్‌..!

ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణా సంస్థల ముందుచూపు వల్ల భారత్‌ అందుకు అతీతంగా నిలుస్తోంది.

Published : 14 Nov 2022 18:54 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం.

క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్‌బీఐ ముందు నుంచీ నిరాకరిస్తూనే వస్తోంది. పైగా వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది. ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి. ఏడాది క్రితం 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్‌ విలువ ఇప్పుడు 1 ట్రిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎఫ్‌టీఎక్స్‌.. కస్టమర్ల ఉపసంహరణల తాకిడితో దివాలా తీసే పరిస్థితి తలెత్తింది. అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తున్న బిట్‌కాయిన్‌ ఓ దశలో 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 16,500 డాలర్లకు అటుఇటుగా ట్రేడవుతోంది. ఏడాది క్రితం ఇదే కాయిన్‌ 69,000 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే నాటి నుంచి ఇప్పటి వరకు 75 శాతం పతనమైంది.

స్వయంగా ఎఫ్‌టీఎక్స్‌ సహ- వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌ 16 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. ఇది క్రిప్టో మదుపర్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీసింది. ఏడాది క్రితం అందరి నోటా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వాలు ఎలాంటి కచ్చితమైన వైఖరి ప్రకటించకపోవడంతో క్రమంగా సెంటిమెంటు దెబ్బతింటూ వచ్చింది. దీనికి వడ్డీరేట్ల పెంపు, ఉక్రెయిన్‌ యుద్ధం, ఇంధన ధరల సంక్షోభం, చైనాలో లాక్‌డౌన్‌ల వంటి సవాళ్లు కూడా ఎదురుకావడంతో ఒడుదొడుకులు కొనసాగుతూ వస్తున్నాయి. తాజాగా ఎఫ్‌టీఎక్స్‌ పతనంతో క్రిప్టో పరిశ్రమలో ఉన్న లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. దీంతో మదుపర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను ఉపసహరించుకునేందుకు ఎగబడుతున్నారు.

భారత్‌లో ఆర్‌బీఐ మొదట్నుంటి క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, గిరాకీ పుంజుకున్న నేపథ్యంలో ప్రభుత్వం తొలుత దీన్ని నియంత్రించేందుకు చట్టం తీసుకొచ్చే యోచన చేసింది. కానీ, వివిధ వర్గాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ఒక ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వ నియంత్రణల నుంచి తప్పించుకునేందుకే క్రిప్టోను సృష్టించారనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఒక్క కారణంతో క్రిప్టోల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెబుతూ వచ్చింది. ఇదే విషయాన్ని మదుపర్లకు వివరిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ప్రస్తుతం భారత్‌లో మదుపర్ల పెట్టుబడుల్లో కేవలం 3 శాతం మాత్రమే క్రిప్టోల్లో ఉన్నాయి. పైగా భారత్‌కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజీలు వజీరిక్స్‌, జెబ్‌పే వంటి సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. 

క్రిప్టోకరెన్సీలతో ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధించింది. డిజిటల్‌ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని స్పష్టం చేసింది. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ విధించింది. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు మాత్రం ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా పన్ను భారం అధికమై చాలా మంది క్రిప్టోల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కొత్తగా మదుపు చేయడానికి వెనుకాడారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీ సంస్థలపై నియంత్రణ సంస్థలు సోదాలు జరిపాయి. జీఎస్‌టీ ఎగవేసిన సంస్థలపై చర్యలకు దిగాయి. ఈ చర్యల వల్లే ఇప్పుడు మన మదుపర్ల సంపద సురక్షితంగా ఉంది.

జూన్‌లో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌  క్రిప్టో కరెన్సీలను చాలా ప్రమాదకరమైన అసెట్‌ క్లాస్‌గా అభివర్ణించారు. ఎలాంటి నిర్మాణాత్మకమైన ఆధారం లేకుండా.. కేవలం మార్కెట్‌ ఊహాగానాలతో విలువ పెంచుకుంటున్న క్రిప్టో కరెన్సీలను విశ్వసించడానికి లేదని హెచ్చరించారు. ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీని నిషేధించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని అప్పట్లో నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఉద్ఘాటించారు. అయితే, అంతర్జాతీయ సహకారం, సమన్వయం లేకుండా దేశీయంగా తీసుకునే నియంత్రణాపరమైన చర్యలు ఫలితాలు ఇవ్వవని ఆమె స్పష్టం చేశారు. 

డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించబోతోంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. దీనిపై ప్రపంచ దేశాల సహకారం, సమన్వయానికి కృషి చేసే అవకాశం ఉంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ సైతం ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని