Gold Imports: ఏప్రిల్‌-అక్టోబరు మధ్య 17% తగ్గిన బంగారం దిగుమతులు

ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో బంగారానికి గిరాకీ తగ్గింది. దీంతో ఏప్రిల్‌-అక్టోబరు మధ్య పసిడి దిగుమతులు 17 శాతం తగ్గాయి. 

Published : 27 Nov 2022 14:45 IST

దిల్లీ: దేశంలో గిరాకీ తగ్గడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య పసిడి దిగుమతుల విలువ 17 శాతం తగ్గి 24 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో భారత్ 29 బిలియన్‌ డాలర్లు విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

అక్టోబరు నెలలో పసిడి దిగుమతుల విలువ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో వెండి దిగుమతులు 34.80 శాతం తగ్గి 585 మిలియన్‌ డాలర్లకు చేరాయి. మొత్తంగా ఏప్రిల్‌-అక్టోబరు మధ్య వెండి దిగుమతుల విలువ వార్షిక ప్రాతిపదికన 1.52 బిలియన్‌ డాలర్ల నుంచి 4.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో సరకుల వాణిజ్య లోటు క్రితం సంవత్సరంతో పోలిస్తే 94.16 బిలియన్‌ డాలర్ల నుంచి 173.46 బిలియన్ డాలర్లకు చేరింది.

మరోవైపు రత్నాభరణాల ఎగుమతి విలువ ఏప్రిల్‌- అక్టోబరులో 1.81 శాతం పెరిగి 24 బిలియన్‌ డాలర్లకు చేరింది.  ప్రపంచంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. ఆభరణాల పరిశ్రమలో అధిక గిరాకీయే దీనికి కారణం. ఏటా 800-900 టన్నుల పసిడి దిగుమతి అవుతుంటుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి తిరిగి బంగారానికి గిరాకీ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని