Gold Imports: రూ.1.80 లక్షల కోట్ల పసిడి దిగుమతి

కరెంట్‌ ఖాతా లోటుపై (సీఏడీ) ప్రభావం చూపించే పసిడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,80,000 కోట్లు) చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

Updated : 18 Oct 2021 09:15 IST

ఏప్రిల్‌-సెప్టెంబరులో

దిల్లీ: కరెంట్‌ ఖాతా లోటుపై (సీఏడీ) ప్రభావం చూపించే పసిడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,80,000 కోట్లు) చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఇదే సమయంలో పసిడి దిగుమతులు 680 కోట్ల డాలర్లు (సుమారు  రూ.51,000 కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ఈ సెప్టెంబరులోనే 511 కోట్ల డాలర్ల (సుమారు రూ.38,325 కోట్లు) పసిడి దిగుమతి అయ్యింది. 2020 సెప్టెంబరులో 60.14 కోట్ల డాలర్ల (రూ.4510 కోట్ల) పసిడి మాత్రమే వచ్చింది.  పసిడి దిగుమతుల్లో భారత్‌ వాటా అత్యధికంగా ఉంటుంది. ఆభరణాల పరిశ్రమ గిరాకీకి తగ్గట్లు ఈ దిగుమతులు ఉంటుంటాయి. వార్షికంగా సుమారు 800-900 టన్నుల పసిడిని మనదేశం దిగుమతి చేసుకుంటోంది.

* వెండి దిగుమతులు మాత్రం 2021-22 ఏప్రిల్‌-సెప్టెంబరులో 15.5 శాతం మేర తగ్గి, 61.93 కోట్ల డాలర్ల (సుమారు రూ.4645 కోట్ల)కు పరిమితమయ్యాయి. అయితే ఒక్క సెప్టెంబరులోనే వెండి దిగుమతులు 55.23 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. గత ఏడాది సెప్టెంబరులో ఇవి 92.3 లక్షల డాలర్లుగా నమోదయ్యాయి.

* పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో దేశ వాణిజ్య లోటు గత సెప్టెంబరులో 2,260 కోట్ల డాలర్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే నెలలో వాణిజ్య లోటు 296 కోట్ల డాలర్లు మాత్రమే.

* వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరులో 1,930 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఏడాది క్రితం ఇదే సమయం ఎగుమతులు 870 కోట్ల డాలర్లు మాత్రమే.

* పండుగల సీజన్‌ కావడంతో పసిడికి గిరాకీ లభిస్తుందనే అంచనాతో అధికంగా దిగుమతి అయ్యిందని భారత వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఛైర్మన్‌ కొలిన్‌ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.


సెప్టెంబరులో పసిడి ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్లు

సిడి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌లు)లోకి గత సెప్టెంబరులో రూ.446 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. తాజా పెట్టుబడులతో ఇప్పటివరకు ఈ విభాగంలోకి రూ.3,515 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. పండుగల సీజన్‌ దృష్ట్యా దేశీయంగా పసిడికి గిరాకీ బాగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ పెట్టుబడులు మరింత అధికమవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జులైలో ఈ విభాగంలో 61.5 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి మరలాయని భారత మ్యూచువల్‌ ఫండ్ల సంఘం యాంఫీ గణాంకాలు వెల్లడించాయి. ఈ విభాగంలో ఫోలియోల సంఖ్య జులైలో 21.46 లక్షలు ఉండగా, సెప్టెంబరు నాటికి 14 శాతం పెరిగి 24.6 లక్షలకు ఫోలియోలకు చేరాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ఫోలియోలు 56 శాతం పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని