GST: క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ?

క్యాసినో (casinos), గుర్రపు పందేలు (race courses), ఆన్‌లైన్‌ గేమింగ్‌ (online gaming)పై ఎంత జీఎస్‌టీ విధించాలన్న దానిపై మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిపై 28శాతం జీఎస్‌టీ వేయాలని

Published : 18 May 2022 19:30 IST

దిల్లీ: క్యాసినో (casinos), గుర్రపు పందేలు (race courses), ఆన్‌లైన్‌ గేమింగ్‌ (online gaming)పై ఎంత జీఎస్‌టీ (GST) విధించాలన్న అంశంపై మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిపై 28 శాతం జీఎస్‌టీ వేయాలని పేర్కొంటూ తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

దేశంలోని క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై జీఎస్‌టీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఓ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఈ కమిటీ ఈ నెల మొదటి వారంలో సమావేశమైంది. క్యాసినోలు, రేస్‌కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తాజాగా మంత్రుల కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నివేదికను రూపొందించింది.

‘‘క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్‌టీ విషయంలో మంత్రుల కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తాం’’ అని సంగ్మా ట్విటర్‌లో వెల్లడించారు. ఈ నెలాఖరులో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.

క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఈ సేవల విలువను అంచనా వేయడంతో పాటు వాటి నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు గతేడాది జూన్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. సంబంధిత విషయాలపై చట్టపరమైన నిబంధనలు, కోర్టు ఆదేశాలను మంత్రుల బృందం పరిగణనలోకి తీసుకుంది. అలాగే కాసినోలు (casinos), రేస్ కోర్సులు (race courses), ఆన్‌లైన్ గేమింగ్‌ (online gaming)లకు సంబంధించి రూపొందించే కొత్త మదింపు పద్ధతులను అమలు చేయడానికి ఇప్పటికే ఉన్న చట్టాల్లో సాధ్యమయ్యే మార్పులపై కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని