Google: గూగుల్‌ ‘రిటర్న్‌ టు ఆఫీస్‌’ తీరుపై ఉద్యోగుల వ్యతిరేకత!

Google: వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం నుంచి గూగుల్‌ క్రమంగా వెనక్కి వస్తోంది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాల్సిందేనని కంపెనీ తేల్చి చెప్పింది.

Published : 09 Jun 2023 17:36 IST

వాషింగ్టన్‌: వారానికి కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని అంతర్గతంగా పంపిన మెయిల్‌లో పేర్కొంది. అయితే, ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం (Work From Home)’ విధానంపై కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అస్పష్టమైన హాజరు విధానాల ద్వారా తమ పనితీరును అంచనా వేయడం ఏమాత్రం సరికాదని ఆల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌లో భాగమైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తెలిపారు. మేలో జరిగిన గూగుల్‌ I/O వార్షిక సమావేశంలో ఆవిష్కరించిన ప్రొడక్ట్‌లలో చాలా వరకు ఒకే దగ్గర కూర్చొని సమన్వయం చేసుకున్న ఉద్యోగులే అభివృద్ధి చేశారని గూగుల్‌ (Google) మెయిల్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొంది.

ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో ఇకపై హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు గూగుల్‌ (Google) తెలిపింది. కార్యాలయానికి రాని ఉద్యోగులకు వారి బృందాలు రిమైండర్లు పంపుతాయని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని గూగుల్‌ (Google) తమ ఉద్యోగులకు తెలిపింది. తాజాగా దీన్ని అన్ని విభాగాలకూ విస్తరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని